Chintala Ramachandra Reddy fires BRS : "ఇళ్లనిర్మాణ నిధుల అక్రమాలపై.. త్వరలో జన్సున్వాయి"
BJP leaders fires BRS on double bedroom houses : రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పేరుతో.. బీఆర్ఎస్ రూ.9 వేల కోట్ల అవినీతికి పాల్పడిందని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఇందులో కీలక సూత్రధారులైన కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజాకోర్టులో నిలబెడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం 6లక్షల 10వేల ఇళ్ల నిర్మాణానికి.. కేంద్రానికి నివేదిక ఇచ్చిందన్నారు. వీటికి కేంద్రం నుంచి 2 లక్షల 83వేల డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం.. 17వేల కోట్లు రూపాయలను వివిధ రూపాల్లో ఇచ్చిందని చింతల రామచంద్రారెడ్డి వివరించారు. కేంద్ర నిధుల నుంచి ఒక్కో బెడ్ రూముకు 6 లక్షలు ఖర్చు చేసిన 2లక్షల 83వేల ఇళ్లు పూర్తయ్యేవని.. ఎందుకు నిర్మించలేదని, ఆ డబ్బులు ఎక్కడికి పోయాయని నిలదీశారు. రేపు సోషల్ ఆడిట్ ఇన్స్పెక్షన్ "జన్సున్వాయి" పేరుతో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆధ్వర్యంలో పరిశీలిస్తామని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం.. ఈ నెల 24న అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద, 25న ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. పేదవారికి ఇళ్లు ఇచ్చేంత వరకు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు.