KishanReddy: రెండో రోజు విజయవంతంగా కిషన్​రెడ్డి యాత్ర.. విమర్శలతో దూకుడు పెంచిన మంత్రి

author img

By

Published : Aug 21, 2021, 4:25 AM IST

third day in jana ashirwada yatra of central minister Kishan Reddy

జన ఆశీర్వాద యాత్ర.. రెండో రోజు విజయవంతంగా సాగింది. సూర్యాపేట నుంచి ప్రారంభమైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి యాత్ర.. మహబూబాబాద్, వరంగల్‌, జనగామ జిల్లాల మేదుగా... యాదాద్రి చేరుకుంది. ఇవాళ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం... యాత్ర ఘట్‌కేసర్‌, ఉప్పల్‌ మీదుగా హైదరాబాద్‌ చేరుకోనుంది. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభతో... యాత్ర ముగియనుంది.

జన ఆశీర్వాద యాత్రలో భాగంగా... సూర్యాపేటలో యాత్ర తిరిగి ప్రారంభమై మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి, తోర్రూరు మీదుగా రాయపర్తి వద్ద వరంగల్ జిల్లాలోకి ప్రవేశించింది. వర్ధన్నపేట మీదుగా వరంగల్ భద్రకాళి దేవాలయానికి చేరుకుంది. భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం.. హన్మకొండలోని వెయ్యి స్తంభాల ఆలయంలో కిషన్‌రెడ్డి పూజలు చేశారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఖిలాశాపూర్ కోటను సందర్శించారు. యాదాద్రి జిల్లా ఆలేరు నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. యాత్రలో భాగంగా... అధికార పక్షంపై కిషన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ఎవరెన్ని కుట్రలు చేసినా హుజురాబాద్ లో ఎగిరేది... కాషాయ జెండా మాత్రమేనని స్పష్టం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ.. కేసీఆర్ కుటుంబంలో బందీ అయిందని విమర్శించారు. ముఖ్యమంత్రి కుర్చీ కోసం కేసీఆర్ రోజురోజుకూ దిగజారుతున్నారని ఆరోపించారు. ఏడేళ్లలో.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ తన నీడను చూసి తానే భయపడుతున్నారని... కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

గెలుపు మాదే..

హుజూరాబాద్ లో ఎన్ని అప్రజాస్వామిక పద్ధతులను ప్రయోగించినా.... గెలుపు తమదేనని భాజపా నేత ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి జన ఆశీర్వాద సభలో కమలాపూర్‌లో ఈటల పర్యటించారు. హుజూరాబాద్‌లో తెరాసకు డిపాజిట్లు కూడా దక్కవని ఈటల జోస్యం చెప్పారు.


మూడో రోజున...

జన ఆశీర్వాదయాత్రలో భాగంగా ఇవాళ యాత్ర... యాదాద్రిలో ప్రారంభమై ఘట్కేసర్, ఉప్పల్ మీదుగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి ప్రవేశిస్తుంది. సాయంత్రం 6గంటలకు భాజపా రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటుంది. పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభతో యాత్ర ముగియనుంది.

ఇదీ చూడండి:

KISHAN REDDY: 'హుజూరాబాద్​లో తెరాస రాజకీయ నాయకులను కొనుగోలు చేస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.