ETV Bharat / state

హడలెత్తిస్తోన్న సెకండ్ వేవ్​.. ఆస్పత్రులకు క్యూ కట్టిన ప్రజలు

author img

By

Published : May 5, 2021, 9:43 PM IST

యాదాద్రి జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ హడలెత్తిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. వ్యాధి నిర్ధరణ పరీక్షల కోసం ఆసుపత్రుల వద్ద జనాలు బారులు తీరుతున్నారు. అయితే ఆయా ఆరోగ్య కేంద్రాల్లో డిమాండ్​కు తగ్గ వసతులు లేక.. వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

yadadri corona news
yadadri corona news

కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ పరీక్షల సంఖ్య 50 కే పరిమితం చేయడం సరైంది కాదంటూ యాదగిరిగుట్ట ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఎదుట స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్, ర్యాపిడ్ టెస్టుల కోసం.. పాద రక్షకాలను క్యూలో పెట్టి చెట్ల కింద నిరీక్షించి పరీక్షలు చేయించుకున్నారు. రోజురోజుకూ ఆస్పత్రికి వచ్చే వారి సంఖ్య పెరగడం, సిబ్బంది కొరత ఉండటం వల్ల ఎక్కువ మందికి పరీక్షలు చేయలేకపోతున్నామని వైద్య సిబ్బంది తెలుపుతున్నారు. దాంతో పాటు కచ్చితమైన లక్షణాలు ఉంటేనే పరీక్షలు చేయాలనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. స్వల్ప లక్షణాలు కలిగిన వారికి టెస్టులు చేయడం లేదంటున్నారు.

జిల్లాలో కొవిడ్ విజృంభణ..

జిల్లాలో కొవిడ్‌ విజృంభిస్తోంది. ఇప్పటికే యాదాద్రి దేవస్థాన ఉద్యోగులు, ప్రభుత్వ కార్యాలయం, బ్యాంకు ఉద్యోగులను చుట్టుముడుతూ పట్టణం, పల్లెలు అని తేడా లేకుండా ప్రతాపాన్ని చూపిస్తోంది. మంగళవారం మరో 13 మందికి పాజిటివ్‌ వచ్చినట్లుగా వైద్యాధికారులు తెలిపారు. వారం వ్యవధిలో 116 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం, 10 మంది కొవిడ్‌కు బలికావడం, అనధికారంగా మరికొందరు ఉండడం ఉద్ధృతికి అద్దం పడుతోంది.

రెండు డోసులు తీసుకున్న వారినీ మహమ్మారి వదలటం లేదు. సోమవారం సాయంత్రం పట్టణానికి చెందిన ఇద్దరు కరోనాతో మృతి చెందగా.. ఇళ్లకు తీసుకురాకుండా వారికి అక్కడే అంత్యక్రియలు చేపట్టారు. యాదగిరిగుట్టకు చెందిన ఇద్దరు పోలీసులు, బ్యాంకు ఉద్యోగులు ముగ్గురు, పంచాయతీరాజ్‌ కార్యాలయంలో ఇద్దరు కరోనా బారి పడ్డారు. దీంతో కార్యాలయాల నిర్వాహణ కష్టంగా మారింది. అయినప్పటికీ జనాల్లో చైతన్యం లేకపోవడం కలవరానికి గురిచేస్తోంది.

ఇదీ చదవండి: ఒకరి మృతదేహం.. మరొకరు తీసుకెళ్లి ఖననం.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.