ETV Bharat / state

Yadadri Temple Reopening : మరో 100 రోజుల్లో యాదాద్రి మూలవరుల దర్శనభాగ్యం

author img

By

Published : Dec 19, 2021, 6:42 AM IST

Updated : Dec 19, 2021, 8:50 AM IST

Yadadri Temple Reopening : యాదాద్రి శ్రీలక్ష్మినరసింహ స్వామి మూలవరుల దర్శన భాగ్యం మరో వంద రోజుల్లో దక్కనుంది. పంచనారసింహుల పుణ్యక్షేత్రంలోని పనులు చకాచకా జరుగుతున్నాయి. మహాకుంభ సంప్రోక్షణ వచ్చే ఏడాది మార్చి 28న చేపట్టాలని చినజీయర్‌ స్వామి ముహూర్తం ఖరారు చేసిన విషయం తెలిసిందే.

Yadadri Temple to reopen news, sri lakshmi narasimha swamy temple news
మరో 100 రోజుల్లో గర్భాలయంలోని నారసింహుని దర్శన భాగ్యం

Yadadri Temple Reopening : యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలోని గర్భాలయ మూలవరులను కనులారా దర్శించుకోవాలన్న భక్త జనుల కోరిక తీరే తరుణం ఆసన్నమవుతోంది. వందరోజుల్లో వారి కలనెరవేరబోతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పంతో పునర్నిర్మితమవుతున్న యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ వచ్చే ఏడాది మార్చి 28న చేపట్టాలని చినజీయర్‌ స్వామి ముహూర్తం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రతువు పూర్తయ్యాకే గర్భాలయంలో నారసింహుని చూసే భాగ్యం దక్కుతుంది. మహాకుంభ సంప్రోక్షణకు ముందస్తుగా వారంపాటు నిర్వహించే శ్రీసుదర్శన మహాయాగం కోసం ఏర్పాట్లకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చినజీయర్‌ స్వామితో త్వరలో వస్తారని అధికారులు చెబుతున్నారు.

యాదాద్రి బాలాలయం, ప్రధాన ఆలయం

సంపూర్ణ కృష్ణశిలతో ప్రధానాలయం

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఆధ్యాత్మిక మహాదివ్య క్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. యాదాద్రి కొండపైన 14 ఎకరాల విస్తీర్ణంలో గల ప్రాంగణాన్ని రూ.165 కోట్ల వ్యయంతో 20 ఎకరాలకు విస్తరించారు. అరెకరంలో ఉన్న ప్రధాన ఆలయాన్ని మాడవీధులు, అష్టభుజి మండప ప్రాకారాలతో 4.03 ఎకరాలకు విస్తరించి పునర్నిర్మించారు. సంపూర్ణంగా కృష్ణశిలతో దాదాపు రూ.వెయ్యి కోట్ల ఖర్చు చేసి ప్రధానాలయాన్ని తీర్చిదిద్దారు. ప్రస్తుతం ధ్వజస్తంభానికి స్వర్ణ కవచాలు బిగిస్తున్నారు. గోపురాలపై కలశాల స్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నారు. మాడవీధుల్లో ఫ్లోరింగ్‌ పనులు పూర్తికావొస్తున్నాయి. అద్దాల మండపం తుది దశలో ఉంది. గర్భాలయంలోని ప్రధాన ద్వారానికి పసిడి కవచాల బిగింపు పూర్తయ్యింది. ఏడు రాజగోపుర ద్వారాలకు ఇత్తడి తొడుగుల అమరిక జరుగుతోంది. విమానాన్ని స్వర్ణమయం చేయాల్సి ఉంది. సాలహారాల్లో అష్టదిక్పాలకుల విగ్రహాలను పొందుపరచాలి. విద్యుదీకరణ ప్రయోగాత్మక పరిశీలన జరుగుతోంది.

కాంతులీనుతున్న గర్భాలయ స్వర్ణ ద్వారం

ఆధ్యాత్మికం.. ఆహ్లాదభరితం

ఎంతో మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో కొండపై లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు శివాలయాన్ని పునర్నిర్మించారు. పరిసరాల్లోనే విష్ణు పుష్కరిణి, ప్రసాదాల తయారీ, విక్రయ సముదాయం, క్యూ కాంప్లెక్స్‌ కడుతున్నారు. పసిడి వర్ణంతో కూడిన ఇత్తడి దర్శన వరుసలు ఏర్పాటయ్యాయి. బ్రహ్మోత్సవ మండపం నిర్మించారు. కొండపై ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా ఏర్పాట్లు చేశారు. కొండ చుట్టూ పచ్చని మొక్కలు నాటి ఆహ్లాదకరంగా రూపొందిస్తున్నారు.

Yadadri Temple to reopen news, sri lakshmi narasimha swamy temple news
సుందరంగా ముస్తాబు

మహా కుంభ సంప్రోక్షణ జరిగాక స్వయంభువుల దర్శనాలకు అత్యధిక సంఖ్యలో భక్తులు రానున్న దృష్ట్యా రవాణా సౌకర్యం కోసం నలువైపులా విశాల రహదారులు నిర్మితమయ్యాయి. కొండపైన ఎకరంన్నర స్థలంలో 16 ప్లాట్‌ఫారాలతో బస్‌ బే కడుతున్నారు. పైకి ఎక్కి, దిగేందుకు పైవంతెనలు నిర్మాణ దశలో ఉన్నాయి. నిఘా కమాండ్‌ కంట్రోల్‌ కోసం ప్రత్యేక భవన నిర్మాణం జరుగుతోంది.

క్షేత్ర సందర్శనకు వచ్చే వీఐపీలు సేదతీరేందుకు రూ.3 కోట్లతో అతిథిగృహం, రూ.2.5 కోట్లతో ఈవో ఛాంబర్‌ నిర్మించారు.

Yadadri Temple to reopen news, sri lakshmi narasimha swamy temple news
అతిథుల కోసం...

కొండ కింద గండి చెరువు ప్రాంగణంలో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరించేందుకు లక్ష్మి పుష్కరిణి నిర్మించారు. దీక్షాపరుల మండపం తుది దశలో ఉంది, కల్యాణ కట్ట పూర్తికావస్తోంది. శ్రీసత్యనారాయణ వ్రత మండపం, అన్నప్రసాద భవనం నిర్మాణంలో ఉంది. రూ.40 కోట్లతో గండి చెరువు సుందరీకరణ జరుగుతోంది. మహా సంప్రోక్షణలోగా ఈ పనులన్నీ పూర్తిచేసేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు.

Last Updated :Dec 19, 2021, 8:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.