ETV Bharat / state

block fungus victim: బతుకుదెరువు మీద దెబ్బకొట్టిన కొవిడ్​ మహమ్మారి... సాయం కోసం ఎదురుచూపులు

author img

By

Published : Dec 13, 2021, 11:00 PM IST

block fungus victim: కొవిడ్​, బ్లాక్​ ఫంగస్​ ఆ కుటుంబంలో సంతోషం దూరం చేసింది. కుటుంబాన్నంతటినీ బాధించిన మహమ్మారి.. కుటుంబ పెద్దను అంధుడిని చేసింది. కొన్ని నెలల క్రితం వరకు సంతోషంగా ఉన్న ఆ కుటుంబం.. ప్రస్తుతం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. తమ కష్టాన్ని జిల్లా కలెక్టర్​కు విన్నవించుకుని ఆర్థిక సాయం అర్థిస్తున్నారు యాదాద్రి జిల్లా చౌటుప్పల్​ మండలం దండు మల్కాపురం గ్రామానికి చెందిన కోటి జనార్దన్​, సురేఖ దంపతులు.

black fungus victim
black fungus victim

Block fungus victim: కరోనా, బ్లాక్ ఫంగస్ ఓ వ్యక్తి జీవితాన్ని అతలాకుతలం చేసింది. అతనితో పాటు కుటుంబ సభ్యులందరికీ సోకింది. వారందరూ కోలుకున్నా.. ఆ వ్యక్తిని మాత్రం కోలుకోలేదని దెబ్బతీసింది. కొవిడ్​ కాస్త.. బ్లాక్ ఫంగస్​గా.. అది కాస్తా మెదడుకు, కళ్లకు సోకింది. దీంతో చూపును కోల్పోయాడు. కుటుంబ పోషణకు దిక్కు లేకుండా పోయింది. దీంతో తమకు సహాయం చేయలంటూ ఆ వ్యక్తి తన భార్యతో కలిసి సోమవారం.. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. తన దీనస్థితిని అధికారులకు వివరించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామానికి చెందిన కోటి జనార్దన్ రెడ్డి, సురేఖ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. జనార్దన్ రెడ్డి ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. ఈ మధ్యనే అప్పు చేసి ఇల్లు కట్టుకున్నారు. అంతా సంతోషంగా ఉందనుకున్న సమయంలో వారి కుటుంపై కొవిడ్​ మహమ్మారి పంజా విసిరింది. ఈ ఏడాది మే నెలలో జనార్దన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులందరూ కొవిడ్​ బారిన పడ్డారు. గాంధీలో చికిత్స అనంతరం కుటుంబ సభ్యులందరూ కోలుకున్నారు. కానీ జనార్దన్ రెడ్డికి మాత్రం బ్లాక్ ఫంగస్ సోకింది. మే 11న అతడిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. బ్లాక్ ఫంగస్ మెదడు, కళ్లకు సోకడంతో చూపును కోల్పోయాడు. నోటి పైభాగానికి ఇన్ఫెక్షన్ రావడంతో పైభాగాన్ని వైద్యులు తొలగించారు. మెదడుకు శస్త్ర చికిత్స చేశారు. ప్రాణాలు దక్కించుకున్నా.. కొవిడ్​ మహమ్మారి మిగిల్చిన గాయం ఆ కుటుంబాన్ని తీవ్ర ఆర్థిక కష్టాల్లోకి నెట్టేసింది.

కుటుంబానికి పెద్ద దిక్కైన జనార్దన్​ రెడ్డి.. ప్రస్తుతం ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్నాడు. కుటుంబ పోషణ కూడా భారంగా మారడంతో తమ కష్టాలను జిల్లా కలెక్టర్​కు విన్నవించుకునేందుకు కలెక్టరేట్​కు వచ్చారు. గతంలో బ్యాంకు రుణం తీసుకుని ఇల్లు కట్టుకున్నామని.. ఇప్పుడు ఇల్లు గడవడమే కష్టంగా ఉందని.. లోన్​ వాయిదాలు చెల్లించకపోవడం వల్ల ఇంటిని బ్యాంకు అధికారులు జప్తు చేస్తామంటున్నారని ఆ దంపతులు వాపోతున్నారు. ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన తాము.. ఇంటిని కోల్పోతే కుటుంబంతో సహా రోడ్డున పడిపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పరిస్థితిని పరిశీలించి ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఆ కుటుంబ బతుకుదెరువు మీద దెబ్బకొట్టిన కొవిడ్​ మహమ్మారి... సాయం కోసం ఎదురుచూపు

మే 11న నాకు కొవిడ్​ పాజిటివ్​ వచ్చింది. ఆ తర్వాత బ్లాక్​ ఫంగస్​ సోకింది. గాంధీ ఆస్పత్రిలో నాలుగు నెలలు చికిత్స పొందాను. బ్లాక్​ ఫంగస్​ వల్ల కంటి చూపు పోయింది. మెదడు, పై దవడ శస్త్ర చికిత్సలు చేశారు. ఇప్పుడు నేను పని చేయలేని పరిస్థితి. గతంలో ఓ బ్యాంకులో లోన్​ తీసుకుని ఇంటిని నిర్మించుకున్నాను. ఇప్పుడు ఆమొత్తం చెల్లించలేని పరిస్థితి. బ్యాంకు వాళ్లు ఇంటిని జప్తు చేస్తామంటున్నారు. ఈ విషయమై కలెక్టర్​గారికి విన్నవించుకుని ఏమైనా సాయం చేస్తారేమో అని వచ్చాము. -జనార్దన్​ రెడ్డి, బాధితుడు

మా కుటుంబం అంతా కొవిడ్​ బారిన పడ్డాము. మేమందరం కోలుకున్నాము కానీ నా భర్తకు బ్లాక్​ ఫంగస్​ సోకింది. చాలా ఆపరేషన్లు జరిగాయి. కంటి చూపు కోల్పోయారు. ఇంటిమీద లోన్​ చెల్లించలేని పరిస్థితి. బ్యాంకువారు ఇంటిని జప్తు చేస్తే కుటుంబంతో సహా రోడ్డున పడిపోతాం.. అధికారులు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. -సురేఖ, జనార్దన్​ రెడ్డి భార్య

ఇదీ చూడండి: Consumer Commission‌: పరిహారం చెల్లించని బీమా కంపెనీపై వినియోగదారుల కమిషన్‌ ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.