ETV Bharat / state

telangana floods: మత్తడి దూకుతున్న చెరువులు.. జనావాసాలు జలమయం...

author img

By

Published : Jul 23, 2021, 5:38 PM IST

Updated : Jul 23, 2021, 7:52 PM IST

floods in telangana
floods in telangana

రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో జన జీవనం స్తంభించింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా వదలని ముసురుతో ఊళ్లన్నీ ఏరులయ్యాయి. జలాశయాలు, ప్రాజెక్టులు, చెరువులు, వాగులు ఇలా నది మొదలు.. ఊళ్లో చిన్న కాలువ వరకు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఊళ్లన్నీ నీటమునిగితే.. కొన్ని చోట్ల పంటలు మట్టికొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో చాలా మంది జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు. చాలా గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. అధికారులు ఎక్కడికక్కడ సహాయకచర్యల్లో నిమగ్నమై ఉన్నారు. మంత్రుల నుంచి.. పంచాయతీ స్థాయి అధికారుల వరకు రక్షణ చర్యల్లో పాల్గొంటున్నారు.

మత్తడి దూకుతున్న చెరువులు.. జనావాసాలు జలమయం...

వర్షాలు, వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. ఎక్కడికక్కడ వరదనీరు ముంచెత్తి లోతట్టు ప్రాంతాలను జలమయం చేస్తుంది. నదీ పరివాహన ప్రాంతాలతో పాటు.. వాగులు, వంకలు చెరువులు ఉన్న ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

ఉమ్మడి ఆదిలాబాద్​లో పరిస్థితి ఇది..

వర్షాలు, వరదలు అనగానే ముందుగా ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా ఉంటుంది. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతాయి. ఆదిలాబాద్​, నిర్మల్​, కుమరంభీం, మంచిర్యాల జిల్లాలు వరుణుడి ప్రకోపానికి చిగురుటాకుల వణికాయి. వరదల దెబ్బకు అలతాకుతలం అవుతున్నాయి. పోటెత్తిన వాగులతో.... ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో ప్రధాన పర్యాటక కేంద్రాలైన కుంటాల, పొచ్చర జలపాతాలకు వరద ఉద్ధృతి తగ్గింది. పర్యాటకుల సంఖ్య పెరగడంతో జిల్లా ఎస్పీ రాజేశ్​ చంద్ర ఆధ్వర్యంలో పోలీసులు జలపాతాన్ని సందర్శించి.. పర్యాటకులు రాకుండా చర్యలు తీసుకున్నారు.

అర్ధరాత్రి వేళ 40మందిని కాపాడారు

కుమరంభీం ఆసిఫాబాద్​ జిల్లా వాంకిడిలో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. మూడురోజులుగా బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కోమటిగూడ వాగులో చిక్కుకున్న సుమారు 40 విద్యార్థులు, మహిళలను పోలీసులు కాపాడారు. అర్ధరాత్రి సమయంలో సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని వారిని రక్షించారు. కుమురం భీం జలాశయంలోకి భారీగా వరద నీరు చేరడంతో నిన్న 7 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. పలు గ్రామాలు నీట మునిగాయి. పెంచికలపేట మండలం ఎల్కపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద కార్మికులు నీటిలో చిక్కుకున్నారు. పోలీసులు, స్థానికుల సాయంతో వారిని బయటకు తీసుకొచ్చారు.

ఓరుగల్లుపై వరుణుడి ప్రకోపం

ఉమ్మడి వరంగల్‌ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు అతలాకుతలం చేశారు. వరంగల్‌ నగరంలో కాలనీలు జలమయ్యాయి. పోటెత్తిన వాగులతో.... ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. భద్రకాళి జలాశయంతో పాటు రంగసముద్రం, వడ్డేపల్లి చెరువు మత్తడి పోస్తున్నాయి. పలు కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. వరద ప్రాంతాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు పర్యటించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి.... సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వరంగల్‌ గ్రామీణ జిల్లా నర్సంపేట నుంచి నెక్కొండ వెళ్లే ప్రధాన రహదారిపై వరద ఉద్ధృతితో రాకపోకలు నిలిచిపోయాయి. పురిటి నొప్పులతో నర్సంపేట ఆస్పత్రికి వెళ్తున్న ఓ మహిళను స్థానిక యువకులు... స్టెచర్‌పై మోసుకెళ్లారు. భారీ వర్షాలతో ములుగు జిల్లాలో లక్నవరం సరస్సు మత్తడి పోస్తోంది. వెంకటాపురం మండలంలో గిన్నెల వాగు, బొగ్గులవాగు, జంపన్నవాగు ఉద్ధృతికి.... ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది.

యువకుడు మృతి.. మంత్రి పరామర్శ

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. నెల్లికుదురు మండలం మునిగలవీడు శివారులో చౌట కుంట కట్టకు గండి పడింది. వరదల కారణంగా తొర్రూరు నుండి నర్సంపేట, నెక్కొండ-గూడూరు, బయ్యారం, మెట్లతిమ్మాపురానికి రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లికుదురు మండలంలో పలుఇళ్లు కూలిపోయాయి. మొట్లతిమ్మాపురం శివారులో ఉడుముల వాగు దాటుతూ.... ఓ యువకుడు గల్లంతయ్యాడు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సత్యవతి రాఠోడ్.... కుటుంబసభ్యులను ఓదార్చారు. నెల్లికుదురు మండలం కాచికల్లు, కేసముద్రం మండలం ఉప్పరపల్లిలో రెండు ఇళ్లు కూలిపోయాయి. జయశంకర్ భూపాలపల్లి మహదేవపూర్ మండలం పలుగులలో ఇసుక క్వారీ ప్రాంతంలో ఐదుగురు వ్యక్తులు వరదలో చిక్కుకోగా... అధికారులు రక్షించారు.

కరీంనగర్​ను కుదిపేసిన వరదలు

భారీ వర్షాలు, వరదలతో ఉమ్మడి కరీంనగర్​ అతలాకుతలం అయింది. పలు కాలనీలు నీట మునిగాయి. ఎగువన కురుస్తున్నవర్షానికి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో భారీగా వరద చేరుతోంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీరాంసాగర్​తో పాటు కడెం ప్రాజెక్టు నుంచి వస్తున్న నీటితో దిగువ ప్రాంతాలు జలమయమయ్యాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం బండలింగాపూర్​లో వరిపొలాలు కొట్టుకుపోయాయి. పంటపొలాల్లో మట్టి మేటలు వేశాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ వద్ద సిద్దిపేట-హన్మకొండ- వరంగల్ ప్రధాన రహదారి వంతెనపై నుంచి తుమ్మెద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సిద్దిపేట నుంచి వరంగల్​ వెళ్లే వాహనాలను దారి మరల్చి పంపిస్తున్నారు. పోరెడ్డిపల్లి వద్ద మోయ తుమ్మెద వాగు ముచ్చెత్తడం వల్ల గ్రామస్థులు వాహనాలు నిలిపేశారు.

ఉమ్మడి నిజామాబాద్​లో జలదిగ్బంధం

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువల నుంచి వరద కొనసాగుతుండగా..... పోచారం, కౌలాస్‌ నాలా ప్రాజెక్టులు అలుగు పారుతున్నాయి. వర్షాలపై మంత్రి ప్రశాంత్‌ రెడ్డి వేల్పూరులోని తన నివాసంలో అధికారులతో సమీక్షించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దిగువన గల పోచంపాడు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని సీఈ ప్రభాకర్ రావు తెలిపారు. మూడు టర్బైన్‌ల ద్వారా 27 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు.

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుర్జల్‌లో బండిరేగు వాగు వద్ద వరదలో చిక్కుకున్న 100 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. గుర్జల్ గ్రామానికి చెందిన రైతులు, కూలీలు వందమంది వరకు నిన్న ఉదయం వాగు దాటుకుని పొలం పనులకు వెళ్లారు. సాయంత్రం వాగు ఉద్ధృతి పెరగడంతో అవతలి ఒడ్డుకు వెళ్లలేక చిక్కుకుపోయారు. నిన్న రాత్రి ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు తాళ్ల సాయంతో గ్రామస్థులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

ఉమ్మడి నల్గొండపై వరదల ప్రభావం

ఎడతెరపి లేని వర్షాలు... ముంచెత్తుతున్న వరదలతో మూసి నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ప్రాజెక్టు 6 గేట్ల ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం తాళ్లసింగారం గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది.

ఖమ్మం, భద్రాద్రిలో గోదావరి ఉద్ధృతి

గోదావరిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద 26.50 అడుగులకు చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గోదావరి వరదలపై ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాలు జారీ చేశారు. గోదావరి బ్రిడ్జి వద్ద వరద ఉద్ధృతిని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పరిశీలించారు. వరదలపై భద్రాచలంలోని సబ్​కలెక్టర్​ కార్యాలయంలో సమీక్షించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గోదావరిలో జలవనరుల శాఖ నిర్మించిన కాపర్ డ్యాం నీట మునిగింది

ఇదీ చూడండి: Hyd Floods: నిండుకుండల్లా జంట జలాశయాలు.. మూసీ పరివాహక ప్రాంతాలు అప్రమత్తం

Last Updated :Jul 23, 2021, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.