ETV Bharat / state

Rains in Telangana: పలు జిల్లాల్లో అకాల వర్షం... మిగిల్చింది తీరని నష్టం

author img

By

Published : Jan 13, 2022, 6:21 AM IST

Rains
Rains

Rains in Telangana: రాష్ట్రవ్యాప్తంగా పలుజిల్లాల్లో కురిసిన వర్షాలు... తీవ్ర నష్టాలను మిగిల్చాయి. వడగళ్లు కురవడంతో పంటలు నాశనమయ్యాయి. మిర్చి నేలరాలిపోయి రైతుల కంట కన్నీటినే మిగిల్చగా... మొక్కజొన్న పంట నేలకొరిగింది. పలుచోట్ల ఈదురుగాలులకు ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన మిర్చి... వానకు తడిసిపోయింది. తామర, ఇతర తెగుళ్ల కారణంగా ఇప్పటికే కొంతమేర నష్టపోగా... వడగళ్ల కారణంగా మిగత పంట నాశనమైందని మిరపరైతులు వాపోతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఇంకా రెండ్రోజులపాటు పలుజిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

పలు జిల్లాల్లో అకాల వర్షం... మిగిల్చింది తీరని నష్టం

Rains in Telangana: జనవరిలో ఉరుముల్లేని పిడుగులా వచ్చిపడ్డ అకాల వర్షాలు... కర్షకులను నష్టాల పాలుచేశాయి. రెండు మూడ్రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షం కురుస్తున్నా... మంగళవారం రాత్రి పడిన వానలు వరంగల్ జిల్లా రైతుల్ని పుట్టిముంచాయి. వరంగల్ జిల్లాలో కురిసిన వడగళ్ల వాన... అందరికీ కన్నీళ్లనే మిగిల్చింది. దాదాపు రెండు గంటలకు పైగా ఈదురుగాలులతో... వర్షం పడింది. దీంతో నర్సంపేట, దుగ్గొండి, నల్లబెల్లి మండలాల్లో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. నర్సంపేట పరిధిలో దాదాపు 280 ఇళ్లు దెబ్బతిన్నాయి. వర్షం ధాటికి ఇంట్లో బియ్యం, దుస్తులు, వస్తువులు తడిసిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

నష్టం మిగిల్చిన అకాల వర్షాలు...

వాన ఉద్ధృతికి నర్సంపేట పరిధిలోనూ పంట చేనుల్లోకి నీళ్లు వచ్చాయి. జిల్లాలో మిర్చి, మొక్కజొన్న పంటలు పూర్తిగా నీట మునిగాయి. వడగళ్ల కారణంగా మక్క చెట్లు సగానికి విరిగి నేలకొరిగాయి. మిరప చెట్ల నుంచి మిర్చి మొత్తం నేలరాలింది. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోనూ సుమారు 500 ఎకరాల పంట నష్టం వాటిల్లింది. వడగళ్ల వానతో మిరపకాయలు రాలి వరదలో కొట్టుకుపోయాయి. చిట్యాల, టేకుమట్ల, మహదేవపూర్, మొగుళ్లపల్లి తదితర మండలాల్లో కోసి ఆరబోసిన మిర్చి కూడా తడిచింది. రేగొండకి చెందిన బందెల్లి అనే రైతు ఐదెకరాల మిర్చి పంట వానకు కొట్టుకుపోగా... అది చూసిన రైతు అస్వస్థతకు గురయ్యాడు. స్థానిక రైతులు ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటికి కోలుకున్నాడు. తామర, ఇతర తెగుళ్ల కారణంగా ఇప్పటికే కొంతమేర నష్టపోగా... వడగళ్ల కారణంగా మిగత పంట నాశనమైందని మిరపరైతులు వాపోతున్నారు.

ఆదుకుంటాం...

కలెక్టర్‌తో కలిసి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శనరెడ్డి... దుగ్గొండి, నల్లబెల్లి మండలాల్లో పర్యటించారు. వర్షాలతో నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఖమ్మం జిల్లా వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో అకాల వర్షం రైతులను ఉరుకులు పెట్టించింది. కల్లాల్లో మిరపకాయలు ఆరబోసి ఉన్న సమయంలో ఒక్కసారిగా జల్లులు పడటంతో వాటిని కాపాడుకునేందుకు నానా అవస్థలు పడ్డారు. ఖమ్మంలో కురిసిన భారీ వర్షానికి... లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. భద్రాచలంలో కురిసిన వర్షానికి ఆలయంలోని ప్రాంతాలన్నీ తడిసి ముద్దయ్యాయి. ఆలయ గోపురంపై నుంచి కురిసిన వర్షపు జల్లులు... నిత్య కళ్యాణ మండపం వరకు వ్యాపించాయి. నల్గొండా జిల్లా నాంపల్లి మండలంలో వడగళ్ల వాన కురిసింది. పెద్దాపురం పంటపొలాల్లో అరకిలో సైజులో వడగళ్లు పడ్డాయి.

ఇదీ చూడండి: Telangana weather report: ఆ రెండు జిల్లాల్లో దడపుట్టించిన వడగళ్ల వాన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.