ETV Bharat / state

తెలుగులోనూ ‘స్కోప్‌’... విద్యార్థులకు మాతృ భాషలోనే సైన్స్!

author img

By

Published : Sep 1, 2021, 11:04 AM IST

awareness-programs
తెలుగులోనూ ‘స్కోప్‌’

చిన్నారులకు వారి మాతృ భాషలోనే సైన్స్ సంగతులు ఆసక్తిగా చెప్పేందుకు డిపార్ట్​మెంట్ ఆఫ్ సైన్స్ అండ్​ టెక్నాలజీ బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. స్కోప్ ప్రాజెక్టును ప్రారంభించి... దాని ద్వారా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

విద్యార్థులకు శాస్త్ర సాంకేతికత పట్ల చిన్నతనం నుంచీ అభిరుచి ఉంటేనే పెద్దయ్యాక వారు పరిశోధనల వైపు ఆసక్తి చూపుతారు. అందుకే కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం (డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ-డీఎస్టీ) చిన్నారులకు వారి మాతృభాషలోనే సైన్స్‌ సంగతులు ఆసక్తిగా చెప్పేందుకు ఓ బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో మాతృభాషలో శాస్త్ర, సాంకేతికత అంశాలను వివరించి చెప్పేందుకు ‘స్కోప్‌’ (సైన్స్‌ కమ్యూనికేషన్‌ పాప్యులరైజేషన్‌ అండ్‌ ఎక్స్‌టెన్షన్‌) ప్రాజెక్టును ప్రారంభించింది. ఇప్పటికే ఇది తమిళనాడు, కర్ణాటక, కేరళలో పట్టాలెక్కింది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని స్థాయుల విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా వరంగల్‌ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ(నిట్‌)కు ‘స్కోప్‌’ ప్రాజెక్టు మంజూరైంది. మూడేళ్ల పాటు కొనసాగే ఈ ప్రాజెక్టు కింద ఏటా రూ.30లక్షల నిధులు అందుతాయి. ప్రాజెక్టు కోర్‌కమిటీ ఛైర్మన్‌గా నిట్ సంచాలకుడు ఆచార్య ఎన్‌.వి.రమణారావు వ్యవహరిస్తున్నారు. రసాయనశాస్త్ర విభాగం ఆచార్యుడు లక్ష్మారెడ్డి ముఖ్య పరిశోధకుడిగా, విశ్రాంత ఆచార్యుడు అల్లికాయల రామచంద్రయ్య ప్రాజెక్టు సమన్వయకర్తగా ఉంటారు.

ఎంతో ప్రయోజనం

  • స్కోప్‌ ద్వారా ఇప్పటికే కార్యకలాపాలు మొదలయ్యాయి. సమకాలీన సైన్స్‌ అంశాలను తెలుగులో వివరించేందుకు ఆగస్టులో మ్యాగజైన్‌ను ప్రారంభించారు. డీఎస్టీ నిపుణులు సైన్స్‌ వ్యాసాలు రాస్తే, వాటిని తెలుగులో అనువదించి విద్యార్థులకు అందిస్తారు.
  • ప్రతి వారం జూమ్‌ ద్వారా వెబినార్లు ఏర్పాటు చేసి తెలుగుభాషపై పట్టున్నవారితో ప్రసంగాలు ఇప్పిస్తారు. లింకును విద్యార్థులకు పంపి వినేలా ఏర్పాట్లు చేస్తున్నారు. యూట్యూబ్‌లోనూ ఉంచుతున్నారు. ఇటీవల ‘స్వతంత్ర భారతంలో శాస్త్ర సాంకేతిక ప్రగతి’ అనే అంశంపై వెబినార్‌ నిర్వహించారు.
  • ఎన్‌ఐటీ ఆచార్యులు రెండు రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలను ఎంపిక చేస్తారు. అక్కడికి వెళ్లి సైన్స్‌ క్లబ్బులను ఏర్పాటు చేయించి.. విద్యార్థులకు సైన్స్‌ ప్రయోగాలపై ఆసక్తి కలిగేలా తీర్చిదిద్దుతారు.
  • ఈ నెలలో డీఎస్టీ నుంచి ఓ బృందం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించి ప్రాజెక్టు అమలు తీరును పరిశీలిస్తుందని ఆచార్య లక్ష్మారెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి: Schools Reopen: తెలంగాణలో స్కూల్స్ రీ ఓపెన్... కొవిడ్ రూల్స్ మస్ట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.