ETV Bharat / state

యునెస్కో సూచనలకు అనుగణంగా.. రామప్ప ఆలయంపై అవగాహన సదస్సు

author img

By

Published : Nov 11, 2022, 3:02 PM IST

Ramappa temple promotion
Ramappa temple promotion

Ramappa Temple: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప కట్టడ వైభవాన్ని నలుగురికి చాటేందుకు కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అవగాహనా సదస్సు నిర్వహించింది. అందులో భాగంగా పర్యాటకులను సాదరంగా ఆహ్వానించడం.. తదితర అంశాలపై ఏర్పాటు చేసిన కార్యక్రమం ఆలయం వద్ద ఉత్సాహంగా సాగింది. మేధావులు, అధికారులు, విద్యార్ధులతో పాటు స్ధానికులూ ఇందులో పాల్గొన్నారు. రామప్ప ఆలయం తమ ప్రాంతంలో ఉండడం అదృష్టంగా వారు చెబుతున్నారు.

యునెస్కో సూచనలకు అనుగణంగా.. రామప్ప ఆలయంపై అవగాహన సదస్సు

Ramappa Temple: శిల్పసంపదకు చిరునామాగా నిలిచిన రామప్ప ఖ్యాతి, యునెస్కో గుర్తింపుతో విశ్వవ్యాప్తమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర కట్టడాలను తోసిరాజంటూ రామప్ప గతేడాది ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు సొంతం చేసుకుంది. నిత్యం ఎంతో మంది పర్యాటకులు అత్యద్భుతమైన ఈ కట్టడ అందాలు వీక్షించి పులకరించిపోతున్నారు. సహజత్వాన్ని పోలిన శిలా ప్రతిమలు చూసి ఔరా అనకుండా ఉండలేకపోతున్నారు.

అవగాహన సదస్సుకు మంచి స్పందన: నల్లరాతి నిగారింపులు, ఒకదానిని మించి మరొకటి శిల్పకళాకృతులు.. పర్యాటకులను కన్నార్పకుండా చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. రామప్ప ఆలయ పరిరక్షణ, సంరక్షణ, ప్రచారం తదితర అంశాలపై యునెస్కో చేసిన కొన్ని సూచనలకు అనుగణంగా.. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు మంచి స్పందన కనిపించింది. విద్యార్ధులు, యువత, మేధావులు, అర్చకులు, వివిధ శాఖల అధికారులు, పాలంపేట గ్రామస్తులు రెండు వందల మంది వరకూ.. ఈ సదస్సులో ఉత్సాహంగా పాల్గొన్నారు.

వివిధ అంశాలపై నిపుణుల వివరణ: రామప్ప వైభవం, విశిష్టత, ఆలయాన్ని ఎలా కాపాడుకోవాలి.. ఇక్కడికి వచ్చే పర్యాటకులతో ఎలా మెలగాలి మొదలైన అంశాలపై నిపుణులు సోదాహరణంగా వివరించారు. ఎన్నో ప్రత్యేకతలున్న ప్రాచీన కట్టడ వైభవాన్ని భావితరాలకు అందచేసే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. రామప్ప వైభవం, విశిష్టతలపై పలు రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన వాలంటీర్లకు సెప్టెంబర్​లో 11 రోజులపాటు శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు స్ధానికులు, పరిసర ప్రాంత వాసులకు రెండ్రోజుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఆలయ పరిరక్షణలో భాగంగా నిర్వహించే ఈ సమావేశాలు, సదస్సుల వివరాలను.. నివేదిక రూపంలో పొందుపరిచి డిసెంబర్ 1న యునెస్కోకు పంపిస్తారు.

"రాష్ట్రం, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో రామప్ప ఆలయం గురించి విశ్లేషణ చేసి రిపోర్ట్ ఇవ్వాలి. మరో ముఖ్య విషయం ఏమిటంటే 15మంది నిష్ణాతులైన వ్యక్తుల తోటి అందుకు సంబంధించిన పవర్​పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించాం." -పాండురంగరావు, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యులు

"రామప్ప వచ్చే భక్తులతో ఏ విధంగా నడుచుకోవాలి. వారితో ఏ విధంగా ప్రవర్తించాలి. వారికి కావాల్సిన సమాచారాన్ని, సదుపాయాలను ఏ విధంగా అందించాలనేది శిక్షణలో తెలియజేశారు." -శ్రీనివాస్, స్థానికుడు

ఇవీ చదవండి: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేకంగా 26 రైళ్లు

మూత్రపిండంలో రాళ్లొచ్చాయని ఆస్పత్రికి వెళ్తే..​ కిడ్నీ మాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.