ETV Bharat / state

'20 ఏళ్లు మాట్లాడుకునేలా.. రాహుల్​ గాంధీ బహిరంగ సభ'

author img

By

Published : Apr 23, 2022, 7:27 PM IST

Rahul Gandhi Hanamkonda Tour
హనుమకొండలో రాహుల్​ గాంధీ పర్యటన

Rahul Gandhi Hanamkonda Tour: వచ్చే నెల 6న హనుమకొండ​లో కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ పర్యటన దృష్ట్యా ఏర్పాట్లన్నీ చురుగ్గా సాగుతున్నాయి. అందుకు సంబంధించి ఏర్పాట్లను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సభను విజయవంతంగా నిర్వహించేందుకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్​ఛార్జిలను నియమించారు. అదే విధంగా రాష్ట్రంలో జరుగుతున్న వైద్య విద్య సీట్ల దందాపై సీబీఐ విచారణ జరిపించాలని గవర్నర్​ తమిళిసైని విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు.

Rahul Gandhi Hanamkonda Tour: హనుమకొండలో జ‌ర‌గ‌నున్న 'రైతు సంఘ‌ర్షణ స‌భ‌'ను విజ‌య‌వంతం చేయాల‌ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. కాంగ్రెస్ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. మే 6,7 తేదీల్లో రాహుల్ గాంధీ రాష్ట్ర ప‌ర్యట‌న‌ దృష్ట్యా ఆ దిశగా టీపీసీసీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. హనుమకొండలో కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్‌ గాంధీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పీసీసీ.. కమిటీలను ఏర్పాటు చేసింది.

రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో హనుమకొండలో మే 6న జరిగే రైతు సంఘర్షణ సభ కోసం కో ఆర్డినేషన్, రిసెప్షన్‌, పబ్లిక్ మీటింగ్ పర్వవేక్షణ, జనసమీకరణ, ప్రొటోకాల్‌, మీడియా తదితర కమిటీలను ఏర్పాటు చేశారు. పీసీసీ అధ్యక్షుడితోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఉపాధ్యక్షులను ఈ కమిటీల్లో సభ్యులుగా నియమించారు. పార్లమెంట్​ నియోజకవర్గాల వారీగా ఇన్​ఛార్జ్​లను కూడా నియమించారు. భువనగిరి- జగ్గారెడ్డి, నల్గొండ- గీతారెడ్డి, ఖమ్మం- కుసుమ కుమార్, మహబూబాబాద్- శ్రీధర్ బాబు, కరీంనగర్​కు షబ్బీర్ అలీలను పార్లమెంట్‌ పరిధి ఇన్​ఛార్జిలుగా నియమించారు.

20 ఏళ్లు మాట్లాడుకోవాలి: కాంగ్రెస్ డిజిటల్ స‌భ్యత్వ న‌మోదులో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. స‌భ్యత్వం త‌రువాత మొద‌టి స‌మావేశం హనుమకొండలో మే 6 న నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వరంగల్‌లో బహిరంగ సభలు పెట్టి తాము బలంగా ఉన్నామని ప్రతిసారి నిరూపించుకునే పరిస్థితి ఉంద‌ని తెరాసకు వచ్చిందని ఎద్దేవా చేశారు. 2002లో అప్పటి పీసీసీ అధ్యక్షుడు హనుమంతరావు పెట్టిన బీసీ గర్జన సభ 20 సంవ‌త్సరాలైనా... ఇప్పటికీ చర్చ జ‌రుగుతోంద‌ని ఉత్తమ్​ కుమార్​ రెడ్డి అన్నారు. సోనియాగాంధీ ఆ సభకు వచ్చి కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తెచ్చార‌ని గుర్తు చేశారు. ఈ సారి జరగబోయే సభ మరో 20 ఏళ్లు చర్చకు వచ్చేట్లు జరగాల‌న్నారు. రైతు సంఘర్షణ సభను విజయవంతం చేయడానికి అందరు శాయశక్తులా కృషి చేయాల‌ని రేవంత్​, ఉత్తమ్​ కోరారు. రైతు గర్జన సభగా నామకరణం చేస్తే బాగుంటుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. రైతు సమస్యలు లేవనెత్తుతూ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ ఏమి చేస్తుందో కూడా చెప్పాల్సి ఉంద‌న్నారు.

గవర్నర్​కు లేఖ: రాష్ట్రంలో జ‌రుగుతున్న వైద్య విద్య సీట్ల దందాపై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని రేవంత్ రెడ్డి.. గవర్నర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేర‌కు ఆయ‌న గ‌వ‌ర్నర్‌కు బ‌హిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో తెరాస నేత‌లు, ఇతర ప్రైవేటు వైద్య, విద్య కళాశాలల్లో పీజీ సీట్లలో దందాపై చర్య లు తీసుకోవాల‌ని కోరారు. రాష్ట్రంలో వారం రోజులుగా పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి విద్యార్ధులు.. పీజీ వైద్య, విద్య సీట్ల బ్లాక్ దందాపై రోడ్డెక్కి ధ‌ర్నాలు, ఆందోళ‌న‌లు చేస్తున్నార‌ని పేర్కొన్నారు. స్థానిక విద్యార్ధుల‌కు తీర‌ని అన్యాయం చేస్తూ కొన్ని ప్రైవేటు వైద్య క‌ళాశాల‌ల సీట్లను బ్లాక్ చేసి కోట్ల రూపాయిలకు అమ్ముకుంటున్నార‌ని లేఖలో ఆరోపించారు.

'వైద్య సీట్ల దందాలో మంత్రులు కూడా భాగ‌స్వామ్యం కావ‌డం దారుణం. మంత్రులు మ‌ల్లారెడ్డి, పువ్వాడ అజ‌య్‌కుమార్‌, ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వర రెడ్డిలు సీట్ల దందాకు పాల్పడుతున్నట్లు విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. నీట్ ర్యాంక్ ఆధారంగా చిన్న చిన్న లొసుగుల‌ను ఆస‌రా చేసుకుని ఏటా రూ. వంద కోట్ల మేర సీట్లను బ్లాక్ చేస్తున్నారు. క‌న్వీన‌ర్ కోటాలో మెరిట్ ఆధారంగా పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి విద్యార్ధుల‌కు రావాల్సిన సీట్లను మేనేజ్​మెంట్ కోటాలోకి మార్చి అమ్ముకుంటున్నారు. బ్లాక్ మార్కెట్‌లో వైద్య సీట్లు అమ్మి సొమ్ము చేసుకుంటున్న దందాపై క‌ఠిన చ‌ర్యలు తీసుకోవాల‌'ని రేవంత్​ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

ఇవీ చదవండి: 'ప్రగతిభవన్​ను భవిష్యత్​లో​ తెలంగాణ ప్రజాభవన్​గా మారుస్తాం'

KA Paul Comments: 'నాకు ఉప ప్రధాని పదవి ఇస్తా అంటే.. నేనే వద్దన్నా..'

హనుమాన్ చాలీసా సవాల్​.. నటి నవనీత్ కౌర్​ ఇంటిపై రాళ్ల దాడి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.