ETV Bharat / state

క్యాంపస్​ ప్లేస్​మెంట్స్​లో కొలువు.. వరంగల్‌ నిట్‌లో సులువు

author img

By

Published : Dec 26, 2022, 12:34 PM IST

Warangal NIT
Warangal NIT

Warangal NIT : వరంగల్‌ జాతీయ సాంకేతిక విద్యా సంస్థలో ఆకర్షణీయ వేతనాలతో కొలువులు సాధిస్తున్న విద్యార్థుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. ఈ ఏడాది 1050 మందికి ఉద్యోగాలు దక్కాయి. వచ్చే మార్చి వరకు ఎంపిక ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో వీరి సంఖ్య మరింత పెరగనుంది.

Warangal NIT : దేశంలోని నిట్​లలో వరంగల్‌కు మంచి గుర్తింపు ఉంది. కొందరు విద్యార్థులు ఐఐటీల్లో సీట్లు వచ్చినా కాదనుకొని ఇక్కడ సీఎస్‌ఈ, ఈసీసీ, మెకానికల్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌లను ఏరికోరి ఎంపిక చేసుకుంటారు. ఇందులో సీటు వస్తే కొలువు ఖాయమని విద్యార్థులు భావిస్తున్నారు. ఏటా ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు పొందుతున్న వారి సంఖ్య పెరగడం శుభ పరిణామం. గత సంవత్సరం వెయ్యి మంది ఉద్యోగాలు పొందగా, అత్యధిక వార్షిక ప్యాకేజీ రూ. 62.5 లక్షలు. ఈ ఏడాది డిసెంబరు పూర్తి కాకముందే 1050 మంది ఎంపికైనట్లు నిట్ ‘సెంటర్‌ ఫర్‌ కెరీర్‌ ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్’ అధికారి డేవిడ్‌సన్‌ తెలిపారు.

సగటు ప్యాకేజీ రూ. 19.5 లక్షలు ఉందన్నారు. కంప్యూటర్‌ సైన్స్‌ విభాగానికి చెందిన ఆదిత్య సింగ్‌ అనే దిల్లీకి చెందిన విద్యార్థికి రూ.88 లక్షల ప్యాకేజీ దక్కింది. తెలుగు విద్యార్థులూ సత్తా చాటుతున్నారు. సుశిత్‌రెడ్డి(సీఎస్‌ఈ) రూ. 62.75 లక్షలు, లిఖిత(ఈసీఈ) రూ. 51 లక్షలు, అభితారావు, రుచితరెడ్డికి రూ. 29 లక్షల చొప్పున ప్యాకేజీలు దక్కాయి. ఉద్యోగాలకు అర్హులైన వారు సుమారు 1500 మంది వరకు ఉండగా, వీరిలో కొందరు ఉన్నత చదువులకు ప్రాధాన్యం ఇస్తుండగా, మరికొందరు సొంత అంకుర సంస్థలను ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

నైపుణ్యాల పెంపు: నిట్లో నాణ్యమైన బోధన, పరిశోధనపై దృష్టి పెట్టడం వల్లే విద్యార్థులు కొలువులు సాధిస్తున్నారనని డైరెక్టర్‌ ఆచార్య ఎన్‌.వి.రమణారావు చెబుతున్నారు. ఇప్పుడు ఉద్యోగాలకు ఎంపికవుతున్న వారు కొవిడ్‌ సమయంలో ఆన్‌లైన్‌ తరగతులే విన్నారు. అధ్యాపకులు పాఠాలను తగ్గించకుండా ప్రత్యక్ష తరగతుల్లో బోధించినట్టు ఆన్‌లైన్‌లోనూ పూర్తి సమయం కేటాయించడం వల్లే మంచి ఫలితాలు వస్తున్నాయి.

* ఈ ఏడాది ఆర్థిక మాంద్యంతో పాత కంపెనీలు ఎంపిక కోసం రాకున్నా, నిట్ ప్లేస్‌మెంట్ విభాగం వారు కొత్త సంస్థలను ఆహ్వానించారు.

* విద్యార్థులు సైతం తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంపొందించుకొంటున్నారు. మంచి వేతనాలు పొందేందుకు కావాల్సిన విధంగా ముందు నుంచే సిద్ధమవుతున్నారు. రోబోటిక్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, కృత్రిమ మేధ క్లబ్బుల ఏర్పాటుతో పాటు, వేసవి సెలవుల్లో కళాశాల స్థాయిలో కోడింగ్‌ కాంపిటీషన్లు పెట్టుకొంటూ తమ బుర్రలకు పదును పెడుతున్నారు.

ఎంపిక చేసుకోవడానికి వస్తున్న కంపెనీలు..

* ప్రభుత్వ రంగ సంస్థలు: బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, సి-డాక్‌, బీహెచ్‌ఈఎల్‌, గెయిల్‌

* ఐటీ రంగ సంస్థలు: మైక్రోసాఫ్ట్‌, విప్రో, టీసీఎస్‌తోపాటు, అనేక విదేశీ బహుళజాతి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు.

* ఈకామర్స్‌ తరహాలో: ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌

* బీమా, బ్యాంకింగ్‌, విద్యా రంగ, అంకుర సంస్థలు

కొత్త కంపెనీలను ఆహ్వానిస్తున్నాం: వచ్చే ఏడాది మార్చి వరకు ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. మాంద్యం ప్రభావంతో గతంలో వచ్చిన కంపెనీలు రాలేదు. వెంటనే కొత్త సంస్థలను పిలిచాం. తెలుగు విద్యార్థులకు కూడా మేటి ప్యాకేజీలు దక్కాయి. - డాక్టర్‌ ఎంజే డేవిడ్‌సన్‌, సీసీపీటీ అధికారి

బోధనలో రాజీ ఉండదు: నాకు రూ. 29 లక్షల వార్షిక ప్యాకేజీ దక్కింది. హైదరాబాద్‌లో ఒక కంపెనీలో ఎంపికయ్యా. కొవిడ్‌ సమయంలోనూ ఆన్‌లైన్‌ తరగతులను అధ్యాపకులు రాజీ లేకుండా బోధించారు. మా నైపుణ్యాలకు ఎప్పటికప్పుడు సానపట్టుకుంటూ సిద్ధం కావడం వల్లే మంచి వేతనాలు దక్కుతున్నాయని భావిస్తున్నా. - రుచితరెడ్డి, ఈసీఈ

సీనియర్ల నుంచి తెలుసుకున్నాం: నాకు రూ. 62.75 లక్షల ప్యాకేజీ దక్కడం సంతోషంగా ఉంది. అధ్యాపకుల సహకారం, సీసీపీటీ కేంద్రం చొరవ వల్ల మాకు మంచి అవకాశాలు దక్కుతున్నాయని భావిస్తున్నాం. కంపెనీలు ఎంపిక చేసే ముందు సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకుంటున్నాం. -సుశిత్‌రెడ్డి, సీఎస్‌ఈ

అందుకే ఎంపిక చేసుకుంటాం: నేను ఎన్‌ఐటీ పూర్వ విద్యార్థినే. హైదరాబాద్‌లో పనిచేస్తున్నా. మా కంపెనీలోకి విద్యార్థులను ఎంపిక చేసుకోవడానికి వచ్చా. ఇక్కడ బోధన ప్రమాణాలు బాగా తెలుసు. ఈ సంస్థలో సీటు వచ్చిందంటేనే విద్యార్థులకు మంచి తెలివితేటలు ఉంటాయి. ఉద్యోగాల్లో బాగా రాణిస్తారని ఆకర్షణీయ వేతన ప్యాకేజీలు కంపెనీలు ఇస్తాయి. - వరుణ్‌, ప్రొడక్ట్‌ మేనేజర్‌, సారస్‌ అనలిటిక్స్‌, హైదరాబాద్‌

..

ఇవీ చదవండి: కేంద్రం నివేదిక: వైద్యసీట్లలో తెలంగాణకు ఆరో స్థానం

మహాత్మా గాంధీ సహా మాజీ ప్రధానులకు రాహుల్​ గాంధీ నివాళి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.