ETV Bharat / state

ఆ జిల్లాలో ఫ్రీజర్లు లేక మృతదేహాలు కుళ్లిపోతున్నాయ్‌..!

author img

By

Published : Jan 30, 2023, 5:31 PM IST

Mortuaries in Vanaparthi
Mortuaries in Vanaparthi

Mortuaries in Vanaparthi Government Hospital: వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన శీతలీకరణ పెట్టేలు లేక మృతదేహాలు కుళ్లిపోతున్నాయి. రోడ్డు, అగ్ని ప్రమాదాలు, ఇతరత్రా ఘటనల్లో ప్రాణాలు కోల్పోయినవారు, బలవన్మరణాలకు పాల్పడినవారి మృతదేహాలను తప్పనిసరి పరిస్థితుల్లో ఒకటి, రెండు రోజుల పాటు భద్రపర్చాల్సివస్తే మరింత కష్టం అవుతోంది. దీంతో బాధితులు ఫ్రీజర్లు అద్దేకు తీసుకొచ్చి వాటికి రుసుం చెల్లించాల్సి వస్తోంది.

Mortuaries in Vanaparthi Government Hospital: జీవితంలో చివరి మజిలీ అత్యధికులకు తీవ్ర అసౌకర్యాల నడుమ బాధాకరంగా ముగుస్తోంది. ఎవరు ఏ రకంగా కన్నుమూసినా ప్రభుత్వ దవాఖానాల్లో మృతదేహాలను భద్రపర్చడానికి తగిన సౌకర్యాలు లోపిస్తున్నాయి. రోడ్డు, అగ్ని ప్రమాదాలు, ఇతరత్రా ఘటనల్లో ప్రాణాలు కోల్పోయినవారు, బలవన్మరణాలకు పాల్పడినవారి మృతదేహాలను తప్పనిసరి పరిస్థితుల్లో ఒకటి, రెండు రోజుల పాటు భద్రపర్చాల్సివస్తే అందుకు ప్రధానంగా అవసరమైన ఫ్రీజర్లు (శీతలీకరణ పెట్టెలు) అందుబాటులో లేవు.

ఈ కారణంగా ఆస్పత్రుల్లోని శవాగారాల్లో మృతదేహాలు కుళ్లిపోతున్నాయి. రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో శవాగారంలోకి వచ్చే పందికొక్కులు, ఎలుకలు కొరుక్కుతింటున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లావ్యాప్తంగా ప్రధాన ఆసుపత్రుల్లో శవాగారాల పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. వసతులు లోపించడంతో బాధితులు ప్రైవేటు వ్యక్తుల నుంచి అద్దెకు ఫ్రీజర్లు తెచ్చుకుంటున్నారు.

అద్దెల భారం..: ప్రభుత్వపరంగా శీతలీకరణ పెట్టెలు అందుబాటులో లేకపోవడంతో బాధితులు ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు. అలాగే శవాగారంలో భద్రపరుస్తున్నారు. గంటలు, ఒకటి, రెండు రోజుల పాటు అలాగే ఉంచి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి దహన సంస్కారాలు పూర్తిచేసే వరకు ఫ్రీజర్లు అవసరమవుతున్నాయి.

ఒక్కో రోజుకు రూ.2000 నుంచి రూ.3000 వరకు ఈ పెట్టెల కోసం ఖర్చు చేయాల్సివస్తోంది. అంత అద్దె చెల్లించలేనివారు శవాగారంలో అలాగే వదిలేస్తున్నారు. ఇక గుర్తుతెలియని వ్యక్తుల దేహాలను జాగ్రత్త చేయడానికి నానా అవస్థలు పడాల్సివస్తోంది. శవాగారంలో ఒకవైపు అలాంటి మృతదేహాల నుంచి దుర్వాసన వ్యాపిస్తుండగానే అక్కడే మరో శవానికి పోస్టుమార్టం చేయాల్సి వస్తోంది.

నెలకు 30 మృతదేహాలు..: వనపర్తి జిల్లా కేంద్రానికి సమీపంలోనే 44వ నంబరు జాతీయ రహదారి ఉంది. ఈ మార్గంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రమాదాల్లో గాయపడిన, ప్రాణాలు కోల్పోయినా జిల్లా ఆసుపత్రికే తరలిస్తుంటారు. ఇలా రోడ్డు ప్రమాదాలు, బలవన్మరణాలు, హత్యలు, గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలు నెలలో దాదాపు 30 వరకు వస్తుంటాయి. ఒక్కోసారి రోజుకు రెండైనా వస్తుంటాయి.

శవాగారంలో భద్రపరిచేందుకు శీతలీకరణ పెట్టెలు అందుబాటులో లేకపోవడంతో అనాటమీ విభాగంలోని గద్దెల మీదనే శవాలను వదిలేస్తున్నారు. గంటలు గడుస్తున్నకొద్దీ మృతదేహాలు కుళ్లిపోయే స్థితిలోకి చేరుకుంటున్నాయి. తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, సహాయకులు ముక్కు మూసుకుని మౌనంగా రోదిస్తున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఇటీవల ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభం కావడంతో ఆసుపత్రిలో పడకల సంఖ్యను పెంచినా శవాగారాన్ని మాత్రం అలాగే వదిలేశారు.

వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి ఇటీవల రెండు శీతలీకరణ పెట్టెలు మంజూరయ్యాయి. అయితే అవి ఇంకా వాడుకలోకి రాలేదు. మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రిలో మూడున్నాయి. రెడ్‌క్రాస్‌ సంస్థవి అయిదు ఉన్నాయి. గద్వాల ఆసుపత్రిలో ఉన్నవి పనిచేయడంలేదు. నాగర్‌కర్నూలులో రెండున్నాయి. నారాయణపేట జిల్లాలో ఇంకా వీటిని సమకూర్చలేదు. ప్రైవేటుగా కూడా ఇక్కడ అందుబాటులో లేవు.

"జిల్లా కేంద్ర ఆసుపత్రికి రెండు శీతల పెట్టెలు మంజూరయ్యాయి. అవి కూడా వచ్చేశాయి. అయితే వాటిని ఇంకా సిద్ధం చేయలేదు. ఎలక్ట్రీషియన్‌ను త్వరలోనే పిలిపించి వాటిని అందుబాటులోకి తీసుకువస్తాం."- శివకుమార్‌, ఏఈ, వనపర్తి ఆసుపత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.