చితి మంటలను చూసైనా స్పందించరా: రఘునందన్​ రావు

author img

By

Published : Jun 18, 2021, 7:04 PM IST

mla, raghunandan rao
ఎమ్మెల్యే, రఘునందన్​ ()

మండుతున్న చితి మంటలను చూసైనా స్పందించరా అంటూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​ రావు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లాలో వేములఘాట్​కు చెందిన రైతు మల్లారెడ్డి తన చితిని తానే పేర్చుకొని తనువు చాలించడం హృదయ విదారకమని అన్నారు.

సిద్దిపేట జిల్లాలోని వేములఘాట్ గ్రామానికి చెందిన రైతు మల్లారెడ్డి తన చితిని తానే పేర్చుకొని తనువు చాలించడం బాధాకరమని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం చనిపోయిన రైతు మృతదేహాన్ని సిద్దిపేట మార్చురీలో సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రైతు మల్లారెడ్డి గ్రామం, తన ఇంటితో ఉన్న అనుబంధాన్ని తెంచుకొలేక ఇంతటి అఘాయిత్యానికి పాల్పడడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాత తన చితి తానే పేర్చుకొని తనను తాను సజీవదహనం చేసుకున్నాడంటే నిర్మించే ప్రాజెక్టులు ఎవరి కోసమని ప్రశ్నించారు.

ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే అవహేళన చేసే తెరాస నాయకులకు రైతుల ఆత్మహత్యలు కనబడటం లేదా అని ప్రశ్నించారు. కుర్చీలు, ఏసీలు, రంగుల పేరిట వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే అధికారులు.. రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తమను తాము ప్రశ్నించుకోవాలని సూచించారు. పగులుతున్న గుండెలు, మండుతున్న చితి మంటలను చూసైనా జిల్లా అధికారులు మానవతా దృక్పథంతో స్పందించాలని కోరారు. ఇలాంటి ఘటనలు మీ కుటుంబాల్లో జరిగితే ఎలా ఉంటుందో అధికారులు ఆలోచించాలన్నారు.

ఇదీ చదవండి: ఇంటి ఆవరణలో చితి పేర్చుకుని నిప్పంటించుకున్న వృద్ధుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.