ETV Bharat / state

సిద్దిపేటలో 'జైభీమ్' స్టోరీ... 20 ఏళ్లుగా తల్లడిల్లుతున్న మన ‘సిన్నతల్లి’!

author img

By

Published : Nov 28, 2021, 7:08 AM IST

Updated : Nov 28, 2021, 8:03 PM IST

ఇటీవల విడుదలైన జైభీమ్ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. పోలీసులు ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? అన్న ఆలోచన సైతం రేకెత్తిస్తోంది. తమిళనాడులో ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతంలో జరిగిన యాథార్థ గాథ జైభీమ్ అయితే.. దీనికి ఏమాత్రం తీసిపోని ఘటన మన దగ్గర జరిగింది. అక్కడ భర్త కోసం భార్య న్యాయ పోరాటం చేస్తే.. ఇక్కడ తమ్ముడు కోసం ఓ అక్క రెండు దశబ్దాలుగా పోరాటం చేస్తోంది. న్యాయం కోసం సుప్రీం కోర్టు వరకు వెళ్లిన ఆ అక్కపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Woman fighting for lockup death case, lakshmi narsavva fighting
20 ఏళ్లుగా తల్లడిల్లుతున్న మన ‘సిన్నతల్లి’..

సిద్దిపేటలో జైభీమ్ స్టోరీ... 20 ఏళ్లుగా తల్లడిల్లుతున్న మన ‘సిన్నతల్లి’!

Fighting for lockup death case in siddipet district : దొంగతనం అనుమానంతో అమాయకులను పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లి క్రూరంగా హింసించడం.. దెబ్బలకు తట్టుకోలేక వారిలో ఒకరు చనిపోతే తప్పు కప్పిపుచ్చుకోడానికి కట్టుకథలల్లడం.. చివరకు న్యాయస్థానంలో దోషులుగా తేలడం.. ఇటీవల విడుదలైన ‘జైభీమ్‌’ సినిమాలో కథాంశమిది. ఎప్పుడో తమిళనాడులో జరిగిన యథార్థగాథ ఆధారంగా తీసిన ఆ సినిమాలో ‘సిన్నతల్లి’ పోరాటం ఫలించి లాకప్‌డెత్‌ బాధ్యులకు శిక్ష పడుతుంది. సరిగ్గా అలాంటి ఘటనే సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగింది. తమిళనాడులో భర్త కోసం సిన్నతల్లి పోరాడితే ఇక్కడ తన తమ్ముడి లాకప్‌డెత్‌కు కారకులైన పోలీసులకు తగిన శిక్ష పడాలని పోరాడుతోంది అతడి సోదరి లక్ష్మీనర్సవ్వ. దాదాపు 20 ఏళ్లు అవుతున్నా ఆమెకు మాత్రం ఇంకా న్యాయం జరగలేదు. న్యాయం కోసం మరో పదేళ్లయినా పోరాడతానని చెబుతున్నారు.

ఏం జరిగింది?

సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట గ్రామంలో 2002 ఏప్రిల్​లో ప్రభాకర్ అనే వ్యక్తి అనుమానస్పద స్థితిలో చనిపోయాడు. ఈ ఘటనతో గ్రామంలో ఘర్షణలు చేలరేగాయి. హత్య కేసుల విచారణలో భాగంగా ఇదే గ్రామానికి చెందిన పలువురిని ఏప్రిల్ 5, 2002న పోలీసులు తొగుట పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్లారు. వారిలో యాదగిరి అనే యువకుడు ఉన్నాడు.. రాత్రి అయినా యాదగిరిని పోలీసులు ఇంటికి పంపకపోవడంతో అతని అక్క లక్ష్మీనర్సవ్వ మరునాడు ఉదయం స్టేషన్​కు వెళ్లారు. హత్య చేసినట్లు ఒప్పుకోమ్మని పోలీసులు ఒత్తిడి చేస్తున్నట్లు యాదగిరి తనకు చెప్పాడని ఆమె తెలిపారు. తన తమ్ముడికి హత్యతో ఎలాంటి సంబంధం లేదని.. అతను అమాయకుడని.. ఇంటికి పంపించాలంటూ పోలీసులను ప్రాథేయపడినట్లు పేర్కొన్నారు. అయినా పోలీసులు పంపలేదని.. చేసేదిలేక ధైర్యం చెప్పి ఇంటికి వచ్చానని వివరించారు.

'రెండు ముచ్చట్లు అడిగి పంపుతాం అంటూ మా తమ్మున్ని తొగుట పోలీస్ స్టేషన్​కు తోలుకపోయిన్రు. నేను బస్సు ఎక్కి స్టేషన్​కు పోయినా. ప్రభాకర్ కేసు ఒప్పుకోమని పోలీసులు అడుగుతున్నారని మా తమ్ముడు అప్పుడు చెప్పిండు. మనం చేయనిది మనం ఎట్లా ఒప్పుకుంటాం అని నేను అన్నాను. సచ్చినా సరే మనం ఎందుకు ఒప్పుకుంటాం అని వాడు అన్నాడు. నేను కూడా సరే అన్నాను. నేను మళ్లీ ఇంటికి వచ్చిన.' -లక్ష్మీనర్సవ్వ

'మరుసటి రోజు మరికొందరిని స్టేషన్​కు తీసుకుపోయారు. మూడో రోజు ఇంకొందరిని తీసుకుపోయారు. నాలుగో నాడు భోజనం తీసుకుని స్టేషన్​కు పోయిన. మా తమ్ముడిని నడవలేకుండా కొట్టిన్రు. ఆ దెబ్బలకు నడువస్తలేడు. ఏం తప్పు చేసిండని మా తమ్మున్ని కొట్టిన్రు అని నేను అడిగినా. ఏం చేయలేదు. నువ్వు ఇంటికి పో... మేం టిఫిన్ ఇస్తామంటూ పోలీసులు మాట్లాడిన్రు. ఏం చేయలేక నేను ఇంటికి పోయినా. మళ్లీ మరుసటి రోజు పోయినా. మిగతా ఆరుగురిని ఇంటికి తోలిన్రు. మా తమ్ముడు ఎక్కడ అని నేను అడిగితే పారిపోయిండని చెప్పిన్రు. మా తమ్ముడు అట్ల పోడు అంటూ నేను గట్టిగా అడిగినా. రెండు ముచ్చట్లు అంటూ స్టేషన్​కు తీసుకొచ్చి పారిపోయిండని చెబుతున్నారని పోలీసులను గట్టిగా అడిగిన.' -లక్ష్మీనర్సవ్వ

'పోలీసులే చంపేశారు'

తమ్ముడి ఆచూకీ కోసం పోలీసులను నిలదీసిన సరైన సమాధానం రాలేదని లక్ష్మీనర్సవ్వ ఆవేదన వ్యక్తం చేశారు. బంధువుల ఇళ్లలో వెతికినా సమాచారం లభించలేదని తెలిపారు. పోలీసులే తన తమ్ముడిని ఏదో చేశారన్న అనుమానంతో ఉన్నతాధికారులను ఆశ్రయించానని వివరించారు. అక్క లక్ష్మీనర్సవ్వ పోరాటంతో ఈ కేసు సంచలనంగా మారింది. యాదగిరి ఆదృశ్యంపై సిద్దిపేట అప్పటి డీఎస్పీ ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఏప్రిలో 8న స్టేషన్​లో యాదగిరి మృతి చెందగా.. పోలీసులే అతడి మృతదేహాన్ని తీసుకెళ్లి కొండపాక మండలంలోని పెద్ద గుట్టపై పాతి పెట్టారని గుర్తించారు. హైకోర్టు ఆదేశాలతో మూడు నెలల తర్వాత యాదగిరి మృతదేహాన్ని వెలికితీసి... రీపోస్టుమార్టం నిర్వహించారు. ఇందులో మరణించడానికి ముందు తీవ్రంగా కొట్టినట్లు గుర్తించారు. సీఐ మధుకర్ స్వామి, ఎస్సై కరీముల్లాషావలితో పాటు మరో నలుగురు కానిస్టేబుళ్లు బాధ్యులుగా గుర్తించి కేసు నమోదు చేసి.. అరెస్టు చేశారు.

'మా తమ్ముడు పోరిపోయిండని అంటే మా బంధువులను అడిగినం. ఎవరూ కూడా రాలేదు అన్నారు. మా తమ్మున్ని ఏమో చేసిన్రని మా ఊరి సర్పంచ్​తో అన్నాను. పోలీస్ స్టేషన్ అంటే తల్లిగారింటితో సమానం అని ఆయన చెప్పారు. అట్ల ఎవరు చేయరని.. పిచ్చిదానివా అంటూ నన్నే అన్నరు. సరే అనుకున్నా. ఆ తర్వాత మాకు దొరికిండు.. పోలీస్ స్టేషన్​లో ఉంచినం అని డీఎస్పీ అన్నారు. ఇక జీపులో పోయినం. అధికారులందరూ వచ్చారు. వేరే వ్యక్తికి పంచనామా అని చెప్పి... మా తమ్ముడికి దగ్గరకు తీసుకుపోతం అని చెప్పిన్రు. మా తమ్ముడే అక్కడ ఉంది అని నాకు తెల్వదు. ఆ తర్వాత వాడి కాలివేళ్లు చూసి నేను గుర్తుపట్టిన.' -లక్ష్మీనర్సవ్వ

ప్రలోభాలకు గురిచేసినా..

తన సమక్షంలో పంచనామా నిర్వహించాలని చూశారని ఆమె చెప్పారు. మూడు రోజుల పాటు మృతదేహాన్ని అక్కడే ఉంచారని తెలిపారు. ఊర్లో టెంట్లు వేసి ధర్నా చేశామని పేర్కొన్నారు. పోస్టుమార్టం చేసి.. ఖననం చేద్దామని ఒప్పకోమని ఒత్తిడి చేశారని అన్నారు. తాను మాత్రం అందుకు నిరాకరించానని తెలిపారు. డబ్బులు ఇస్తామని కూడా చెప్పారని వివరించారు. న్యాయం కోసం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. తన తమ్ముడి చావుకు కారకులైన పోలీసులుపై సరైన చర్యలు తీసుకోలేదంటూ 2005లో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సమగ్ర విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టు.. హైకోర్టును ఆదేశించింది. ఈ కేసును సీఐడీకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. విచారణ మళ్లీ మొదలై... సీఐడీ సంగారెడ్డిలోని జిల్లా కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేసింది. నాటి నుంచి సుదీర్ఘంగా విచారణ సాగింది. సరైన సాక్ష్యాధారాలు లేవంటూ ఇటీవలే కోర్టు కేసును కొట్టేసింది.

'మూడు నెలల తర్వాత గాంధీలో పోస్టుమార్టం చేసిన్రు. ఉరి పెట్టుకొని చనిపోయిండని అన్నారు. మేం ఉస్మానియా తీసుకుపోయాం. అక్కడ కొట్టి సంపినట్లు వచ్చింది. అక్కడి నుంచి తీసుకొచ్చి మా జాగాలో ఇక్కడ సమాధి కట్టినం. మా అమ్మనాన్న చనిపోతే కేసు కొట్టేసిన్రు. నేను సుప్రీం కోర్టుకు పోయిన. హైకోర్టు, సంగారెడ్డి కోర్టుకు పోయినం. నన్ను మస్తు చిత్రకథలు పెట్టిన్రు. నన్ను సాక్ష్యం పెట్టు అన్నారు. పైసలు ఇస్తాం అన్నారు. నా ఒక్క పైసా వద్దు అని తేల్చిచెప్పిన. సంగారెడ్డికి పోయినప్పుడు నేను కేసు పెట్టలేదు. మొన్న అడిగితే కొట్టేసిన్రు అని లాయర్ చెప్పారు. తెలుసుకొని చెప్తానని అన్నారు. నాకు న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తా.' -లక్ష్మీనర్సవ్వ

పోలీసుల కారణంగా యాదగిరి లాకప్‌లో చనిపోయారంటూ సమాధిపై శిలాఫలకం

సమాధిపై చరిత్ర లిఖితం

రీపోస్టుమార్టం నిర్వహించిన తర్వాత తమ్ముడి శరీరభాగాలను తీసుకెళ్లి.. మిరుదొడ్డిలోని వెంకట్రావుపేటలో సమాధి కట్టించారు లక్ష్మీనర్సవ్వ. అంతేకాదు దానిపై ఓ శిలాఫలకాన్ని పెట్టించారు. ‘'8.04.2002 రోజున పోలీస్‌ సీఐ మధుకర్‌స్వామి వలన లాకప్‌డెత్‌లో మరణించాడని. వాడిని పూడ్చిపెట్టిన స్థలం బంజేరుపల్లి పెద్దగుట్ట. కొండపాక మండలం’' అంటూ సమాధిపై రాయించారంటేనే ఆమె తెగువ, పట్టుదల అర్థమవుతోంది. తన తమ్ముడిని పోలీసులు దారుణంగా హింసించి చంపిన ఘటన అందరికీ తెలియాలనే ఇలా రాయించానని ఆమె చెప్పారు.

20ఏళ్ల న్యాయపోరాటం

తన తమ్మడి మరణానికి కారణమైన వారికి శిక్ష పడాలన్న లక్ష్యంతో 20 ఏళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నారు లక్ష్మీనర్సవ్వ. ఈ సమయంలో అనేక ఇబ్బందులు, ఒత్తిళ్లు ఎదుర్కొన్నానని తెలిపారు. కేసు వాపసు తీసుకోవాలంటూ డబ్బులను సైతం ఆశచూపారని ఆమె చెప్పారు. తనకు బంధువులను నానా రకాలుగా ప్రలోభాలకు గురిచేశారని... తమ్ముడి మరణానికి కారణమైన వారికి శిక్ష పడే వరకు న్యాయపోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఈ సుదీర్ఘ న్యాయపోరాటంలో చంద్రు లాంటి ఓ న్యాయవాది అండ దొరికితే.. నర్సవ్వకు న్యాయపోరాటంలో విజయం దక్కుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Last Updated :Nov 28, 2021, 8:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.