ETV Bharat / state

Farmers Protest in Telangana : ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. రోడ్డెక్కిన రైతాంగం

author img

By

Published : May 19, 2023, 6:55 PM IST

Farmers Protest in Telangana : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితులను నిరసిస్తూ.. రాష్ట్రంలో పలుచోట్ల అన్నదాతలు రోడ్డెక్కారు. లారీల కొరత, కొనుగోళ్లలో జాప్యానికి తోడు తరుగు పేరుతో కోతలు విధిస్తున్నారంటూ ఆందోళనలు చేపట్టారు. కొన్నిచోట్ల ధాన్యాన్ని రోడ్డుపై పోసి నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రకటన మేరకు ఇబ్బందులకు గురి చేయకుండా.. వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని రైతులు డిమాండ్‌ చేశారు.

Farmers Protest
Farmers Protest

Farmers Protest in Telangana : కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా.. తూకం వేయడం లేదంటూ మెదక్ జిల్లా నర్సాపూర్‌ చౌరస్తాలో రైతులు ధర్నా చేశారు. అన్నదాతల ఆందోళనకు కాంగ్రెస్, బీజేపీ నేతలు మద్దతు తెలిపారు. పనులను వదిలిపెట్టి కొనుగోలు కేంద్రాల వద్ద అవస్థలు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ధర్నాతో నర్సాపూర్‌ చౌరస్తాలో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. అధికారులు, పోలీసులు నచ్చజెప్పినా దిగిరాకపోవటంతో.. అధికారులు సమస్య పరిష్కరిస్తామని హామీతో ఆందోళన విరమించారు.

మెదక్‌ జిల్లా తూప్రాన్‌ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద కొందరు గ్రామస్థులు నిరసన చేపట్టారు. చిన్న శంకరంపేటలో హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై ధాన్యం పోసిన రైతులు.. నిప్పంటించి తగులబెట్టారు. అకాల వర్షాలతో కష్టమంతా నీటి పాలైందని.. మిగిలిన కొద్ది ధాన్యాన్నీ కొనుగోలు చేసేందుకు కొర్రీలు పెట్టడం ఎంత వరకు సమంజసమని రైతులు ప్రశ్నించారు.

ధాన్యం కొనుగోళ్లలో కోతకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి..: తరుగు పేరుతో ధాన్యం కోతను నిరసిస్తూ జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో రహదారిపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. కొనుగోళ్లలో జాప్యం వల్ల కర్షకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో కోతకు పాల్పడుతున్న మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సకాలంలో కొనుగోళ్లు పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

అకాల వర్షాలతో వడ్లన్నీ తడిసిపోయాయి: పెద్దపల్లి జిల్లా మంథని వ్యవసాయ మార్కెట్ వద్ద అన్నదాతలు ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారిపై ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన తెలిపారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదని.. ఇప్పటికే మూడుసార్లు అకాల వర్షాలతో వడ్లు తడిశాయని వాపోయారు. ప్రధాన రహదారిపై గంటపాటు ధర్నా చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. తహసీల్దార్, జిల్లా పౌర సరఫరాల అధికారుల హామీతో రైతులు ఆందోళన విరమించారు.

రైతన్నల నిరసనలు.. రోడ్లపై నిలిచిన వాహనాలు..: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట వద్ద రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం స్పందించాలంటూ స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల ఆందోళనతో మణుగూరు-ఏటూరునాగారం ప్రధాన రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. నల్గొండ జిల్లా పెద్దవూర మార్కెట్‌ సబ్‌ యార్డులో వివిధ గ్రామాలకు చెందిన అన్నదాతలు ఆందోళనకు దిగారు. పులిచర్ల, చలకుర్తి, పెద్దవూరల నుంచి తరలివచ్చిన కర్షకులు.. కోదాడ-జడ్చర్ల రహదారిపై ధాన్యం పోసి నిప్పంటించారు. పురుగుల మందు డబ్బాలతో నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై రైతులు బైఠాయించటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం నెలకొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.