ETV Bharat / state

Wipro Consumer Care: 'అజీమ్‌ ప్రేమ్‌జీ వ్యక్తిత్వం అందరికీ ఆదర్శం'

author img

By

Published : Apr 5, 2022, 7:18 PM IST

Wipro Consumer Care: విప్రో సంస్థల అధినేత అజీజ్‌ ప్రేమ్‌ జీ అరుదైన వ్యాపారి అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన జీవితం ఆదర్శప్రాయమని కొనియాడిన కేటీఆర్... కొవిడ్ సమయంలో తెలంగాణకు కోట్లాది రూపాయలు విరాళంగా ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారని ప్రశంసించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సమీపంలోని ఈ-సిటీలో 30 ఎకరాల్లో విప్రో సంస్థ ఏర్పాటు చేసిన కన్జ్యూమర్‌ కేర్ పరిశ్రమను మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అజీజ్‌ ప్రేమ్‌జీతో కలిసి కేటీఆర్​ లాంఛనంగా ప్రారంభించారు.

Wipro
Wipro

'అజీమ్‌ ప్రేమ్‌జీ వ్యక్తిత్వం అందరికీ ఆదర్శం'

Wipro Consumer Care: టీఎస్‌ ఐపాస్‌ ద్వారా సరళతర వాణిజ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఈ-సిటీలో విప్రో సంస్థ నూతన పరిశ్రమను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అజీమ్‌ ప్రేమ్‌జీ వంటి వ్యక్తి మన మధ్య ఉండటం గొప్ప విషయమన్నారు. ఆయన జీవితం అందరికీ అనుసరణీయం, మంచి పాఠంలాంటిదని కొనియాడారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆయన తత్వం అందిరికీ ఆదర్శమన్నారు. ఈ పరిశ్రమ ద్వారా 900 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. విప్రో పరిశ్రమలో స్థానికంగా ఉన్న కందుకూరు, మహేశ్వరం ప్రాంతంలోని యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కేటీఆర్‌ వివరించారు.

దాదాపు రూ.300 కోట్లతో విప్రో పరిశ్రమ ఏర్పాటు చేశారని.. కాలుష్యం బయటకు విడుదల కాకుండా జర్మన్‌ సాంకేతికతను ఉపయోగిస్తూ అన్ని చర్యలు తీసుకున్నట్లు కేటీఆర్‌ వివరించారు. టీఎస్‌ ఐపాస్‌ విధానం ద్వారా రాష్ట్రంలో 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నట్లు చెప్పారు. కొత్త పరిశ్రమలకు రాయితీలు, మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ.2,20,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. తద్వారా ఏడేళ్లలో 16 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని వివరించారు. కరోనా సమయంలో అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ ద్వారా చేసిన సేవా కార్యక్రమాలను అభినందించిన కేటీఆర్.. ప్రేమ్‌జీ దాతృత్వాన్ని కొనియాడారు. ఎల్‌ఈడీ పరిశ్రమతో పాటు ప్రైవేటు విశ్వవిద్యాలయాన్ని కూడా తెలంగాణలో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు. సబ్బులు, హ్యాండ్‌ వాష్‌, మరుగుదొడ్లు శుభ్రపరిచే ఉత్పత్తులను ఈ పరిశ్రమలో తయారు చేస్తారు.

'అజీమ్‌ ప్రేమ్‌జీ వంటి గొప్ప వ్యక్తి మన మధ్య ఉండటం గొప్ప విషయం. అజీమ్‌ ప్రేమ్‌జీ జీవితం అందరికీ అనుసరణీయం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆయన తత్వం అందరికీ ఆదర్శం. రాష్ట్రంలో రూ.300 కోట్లతో విప్రో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారు. విప్రో పరిశ్రమ ద్వారా 900 మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. కందుకూరు, మహేశ్వరం యువతకు 90 శాతం ఉపాధి అవకాశాలు వస్తాయి. కాలుష్యం బయటకు విడుదల కాకుండా జర్మన్‌ సాంకేతికతను వినియోగించారు. టీఎస్‌ఐపాస్‌ ద్వారా సరళతర వాణిజ్యం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నాం. కొత్త పరిశ్రమలకు రాయితీలు, మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నాం.'

-- కేటీఆర్, మంత్రి

కార్యక్రమంలో ముచ్చటిస్తున్న అజీజ్ ప్రేమ్‌జీ, కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకంగా ఉందని విప్రో అధినేత అజీజ్‌ ప్రేమ్‌ జీ అన్నారు. కరోనా నియంత్రణలో తెలంగాణ కీలకంగా నిలిచిందని ప్రశంసించారు. తెలంగాణలో నిరంతరంగా పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నామని చెప్పారు. పెట్టుబడులతో ఉద్యోగాలు కల్పించాలనుకుంటున్నామని తెలిపారు.

'రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకంగా ఉంది. కరోనా నియంత్రణలో తెలంగాణ కీలకంగా నిలిచింది. తెలంగాణలో నిరంతరంగా పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నాం. పెట్టుబడులతో ఉద్యోగాలు కల్పించాలనుకుంటున్నాం.'

-- అజీమ్‌ ప్రేమ్‌జీ, విప్రో అధినేత

విప్రో సంస్థ రాకతో మహేశ్వరం రూపురేఖలు మారిపోయాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడుల సమీకరణ, ఉద్యోగ అవకాశాల కోసం మంత్రి కేటీఆర్ క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నారన్నారు.

అజీజ్ ప్రేమ్‌జీకి జ్ఞాపిక అందజేస్తున్న కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.