ETV Bharat / state

Ramanuja Sahasrabdi Utsav : ప్రపంచంలోనే అద్భుత పర్యాటక కేంద్రంగా సమతామూర్తి కేంద్రం: కేసీఆర్​

author img

By

Published : Feb 4, 2022, 5:30 AM IST

Updated : Feb 4, 2022, 6:46 AM IST

Ramanuja Sahasrabdi Utsav : సమతామూర్తి కేంద్రం ప్రపంచంలోనే మంచి పర్యాటక కేంద్రంగా విరాజిల్లనుందని ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్నారు. శ్రీ రామానుజచార్య సహస్రాబ్ది ఉత్సవాలు తెలంగాణకే కాకుండా దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నాయని తెలిపారు. సహస్రాబ్ది ఉత్సవాల్లో రెండో రోజు సాయంత్రం సమతామూర్తి కేంద్రాన్ని సతీసమేతంగా సందర్శించిన కేసీఆర్​.. చినజీయర్​ స్వామితో విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై సమీక్షించారు. ఉత్సవాల్లో భాగంగా నేడు యాగశాలలో శ్రీ లక్ష్మీనారాయణ యాగం యథాతథంగా కొనసాగనుండగా... లక్ష్మీనారాయణ అష్టోత్తర శతనామ పూజలు జరగనున్నాయి.

statue of equality
statue of equality

Ramanuja Sahasrabdi Utsav : ప్రపంచంలోనే అద్భుత పర్యాటక కేంద్రంగా సమతామూర్తి కేంద్రం: కేసీఆర్​

Ramanuja Sahasrabdi Utsav : సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్​లో వైభవంగా జరుగుతున్నాయి. 12 రోజుల ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు త్రిదండి చినజీయర్​ స్వామి.. శ్రీలక్ష్మీనారాయణ మహాయాగాన్ని వేలాది మంది రుత్వికుల హవనం మధ్య ప్రారంభించారు. మంత్రపూర్వకంగా అగ్నిహోత్రాన్ని రగిలించి 114 యాగ మండపాల్లోని 1035 కుండలాల్లో.. ఏకకాలంలో 5 వేల మంది రుత్వికులు హోమాలను మొదలుపెట్టారు. ఉదయం 10 గంటలకు మొదలైన శ్రీలక్ష్మీనారాయణుడి మహాయజ్ఞం మధ్యాహ్నాం ఒంటిగంట వరకు సాగింది. ఆ తర్వాత చినజీయర్​ స్వామి ప్రవచన మండపంలో రామానుజచార్యుల అష్టోత్తర శతనామావళి పూజను ఆరంభించారు. సుమారు 200 మంది భక్తులు ఈ పూజలో పాల్గొన్నారు.

నాలుగు దిక్కుల్లో నాలుగు పేర్లతో మండపాలు: చినజీయర్‌ స్వామి
యాగశాలలను నాలుగు భాగాలుగా విభజించినట్లు చినజీయర్‌ స్వామి తెలిపారు. ఉదయం హోమాల ప్రారంభం సందర్భంగా ఆయన భక్తులనుద్దేశించి ప్రసంగించారు. శ్రీరంగ క్షేత్రానికి సూచికగా భోగ మండపం, తిరుమలకు పుష్ప మండపం, కాంచీపురానికి త్యాగమండపం, మేల్కొటె క్షేత్రానికి జ్ఞాన మండపంగా పేర్లు నిర్ణయించినట్లు వివరించారు. ఈ నాలుగు క్షేత్రాలతో రామానుజాచార్యులకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. యాగాల సందర్భంగా భక్తులందరూ భగవన్నామస్మరణపైనే దృష్టి పెట్టాలన్నారు. దేవుడిని భయంతో కాకుండా భక్తితో కొలవాలన్నారు.

ఇక్కడ నుంచే ప్రపంచానికి శాంతి సందేశం..

సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్​ కుటుంబసమేతంగా సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు. చినజీయర్ స్వామితో కలిసి సమతామూర్తి విగ్రహ ప్రాంగణంలోని ఆవిష్కరణ ఏర్పాట్లను, భద్రతను పరిశీలించారు. అనంతరం యాగశాలకు చేరుకొని పెరుమాళ్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సమతామూర్తి కేంద్రం ప్రాధాన్యతను వెల్లడించిన కేసీఆర్​.. ప్రపంచంలోనే అద్భుత పర్యాటక కేంద్రంగా విరాజిల్లనుందని ఆకాంక్షించారు. ప్రపంచానికి ఇక్కడి నుంచి శాంతి సందేశం వెళ్తుందన్న ముఖ్యమంత్రి.. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని చినజీయర్ స్వామి మరింత అభివృద్ధి చేస్తారన్నారు.

అష్టోత్తర శతనామ పూజ...

సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన శ్రీలక్ష్మీనారాయణ మహాయాగం ఈనెల 14 వరకు నిరంతరం కొనసాగనుండగా... ప్రవచన మండపంలో వేదపండితుల ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి. ఇవాళ చినజీయర్ స్వామితోపాటు ఏడుగురు జీయర్ స్వాముల సమక్షంలో పెద్ద ఎత్తున శ్రీలక్ష్మీనారాయణ అష్టోత్తర శతనామ పూజ జరగనుంది.

శ్రీరామనగరంలో నేటి కార్యక్రమాలు

  • శుక్రవారం ఉదయం 6.30 నుంచి 7.30 వరకు అష్టాక్షరీ మహామంత్ర జపం.
  • 8.30 గంటలకు హోమాలు.
  • మధ్యాహ్నం 12.30 గంటలకు పూర్ణాహుతి.
  • సాయంత్రం 5 గంటలకు మరోమారు హోమాలు.
  • ఇష్టిశాలల వద్ద శ్రీ లక్ష్మీనారాయణేష్టి, వైనతేయేష్టి నిర్వహిస్తారు.
  • ప్రవచన మండపంలో లక్ష్మీనారాయణ అష్టోత్తరశతనామ పూజ, ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.
  • ఉదయం 10.30కు భద్రాచల ప్రధాన అర్చకులు గుడిమెళ్ల మురళీకృష్ణమాచార్య ప్రవచనాలు.

ప్రధాని రాక.. హెలికాప్టర్​తో ట్రయల్​ రన్..​

శనివారం.. సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్న నేపథ్యంలో కేంద్ర బలగాలు... సమతామూర్తి కేంద్రంపై ప్రత్యేక హెలికాప్టర్‌తో ట్రయల్‌రన్ నిర్వహించాయి. ప్రధాని విహంగ వీక్షణం చేయనుండటంతో... హెలిపాడ్ నుంచి ముమ్మరంగా ట్రయల్ రన్ సాగించాయి.

6న ఏపీ సీఎం జగన్‌ రాక
శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ వేడుకలకు ఈ నెల 6న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విచ్చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని జగన్‌ సందర్శిస్తారని, లక్ష్మీనారాయణ మహాయాగ క్రతువులో పాల్గొంటారని పేర్కొన్నారు.

ఇదీచూడండి: CM KCR in Muchital: సహస్రాబ్ది ఉత్సవాల్లో సీఎం కేసీఆర్​.. విగ్రహావిష్కరణ ఏర్పాట్ల పరిశీలన

Last Updated :Feb 4, 2022, 6:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.