సంప్రదాయ గ్రామీణ క్రీడలను వెలికి తీయడమే గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ లక్ష్యమని గాంధీ సంస్థల ఛైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా కుంట్లూరులోని గాంధీ కుటీర్లో 'సుస్థిర క్రీడలు సుస్థిర ఆరోగ్యం' సదస్సు నిర్వహించారు. మేజర్ ధ్యాన్ చంద్ జయంతి వేడుకల్లో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ధ్యాన్చంద్ జీవితాన్ని ప్రతి క్రీడాకారుడు ఆదర్శంగా తీసుకుని దేశానికి సేవ చేయాలని రాజేందర్రెడ్డి తెలిపారు. సుశిక్షితులైన వ్యాయామ ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తూ... భారత సంప్రదాయ క్రీడలను వెలుగులోకి తీసుకురావడానికి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఎల్లవేళల కృషి చేస్తుందన్నారు. వినోబా నగర్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో సుస్థిర క్రీడా మైదానాలు ఏర్పాటుచేసి క్రీడాకారులకు ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ప్రో కబడ్డీ క్రీడాకారులు సిద్ధార్థ్ దేశాయ్, భారత జాతీయ కబడ్డీ క్రీడాకారుడు మల్లికార్జున్, సౌత్ సెంట్రల్ రైల్వే కోచ్ అయ్యప్ప రెడ్డి తదితరులు పాల్గొన్నారు.