ETV Bharat / state

క్షణికావేశంలో భర్త ఆత్మహత్యాయత్నం.. మనస్తాపంతో తల్లీకుమార్తె బలవన్మరణం

author img

By

Published : Mar 30, 2023, 11:09 AM IST

Mother and Daughter Suicide in Rangareddy
Mother and Daughter Suicide in Rangareddy

Mother and Daughter Suicide in Rangareddy : దంపతుల మధ్య జరిగిన గొడవతో క్షణికావేశంలో భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇదంతా తన వల్లే జరిగిందనే పశ్చాత్తాపంతో భార్య బలవన్మరణానికి పాల్పడింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె చనిపోవడంతో తట్టుకోలేక ఆమె తల్లీ తనువు చాలించింది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

Mother and Daughter Suicide in Rangareddy : రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. తన భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి తనే కారణమనే పశ్చాత్తాపంతో భార్య బలవన్మరణానికి పాల్పడగా.. కుమార్తె మృతిని తట్టుకోలేక ఆమె తల్లి సంపులో దూకి ప్రాణాలు తీసుకుంది. హృదయ విదారకమైన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

రంగారెడ్డి జిల్లా షాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి హైతాబాద్ గ్రామానికి చెందిన మల్లేశ్-యాదమ్మ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె సుమిత్ర అలియాస్ శిరీష ఉన్నారు. మల్లేశ్ కొన్నేళ్ల క్రితం మృతి చెందగా.. యాదమ్మ పిల్లలిద్దరికీ ఏలోటూ రాకుండా చూసుకుంది. ఎదిగొచ్చిన కుమార్తెను ఓ అయ్య చేతిలో పెట్టి తన బాధ్యతను నెరవేర్చుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే రుద్రారం గ్రామానికి చెందిన కుమ్మరి శివ కుమార్‌ అనే వ్యక్తితో బిడ్డ పెళ్లి నిశ్చయించింది. అల్లుడు కోరిన కట్నకానుకలు ఇచ్చి.. తనకు చేతనైనంతలో గొప్పగా పెళ్లి చేసి తన గారాలపట్టీని అత్తవారింటికి సాగనంపింది.

కొత్త జంట పండంటి కాపురాన్ని చూసి యాదమ్మ మురిసిపోయింది. పండుగల వేళ అల్లుడు-కుమార్తె ఇంటికొస్తే సంబురపడిపోయింది. తీరొక్క వంటకాలు చేసి వారికి కొసిరి కొసిరి తినిపిస్తూ తన కడుపు నింపుకుంది. సజావుగా సాగుతోన్న కుమార్తె కాపురంలో మెల్లిమెల్లిగా కలహాలు మొదలవడంతో ఆమె మనసులో ఆందోళన మొదలైంది. వివాహం జరిగి మూడేళ్లు కావస్తున్నా కూతురికి పిల్లలు కలగకపోవడంతో మనస్తాపానికి గురైంది. చివరకు కుటుంబ తగాదాలతో తన కుమార్తె ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోగా.. అది తట్టుకోలేక ఆ కన్నతల్లీ తనువు చాలించింది.

తనే కారణమనే పశ్చాత్తాపంతో..: ఆదివారం రాత్రి శివకుమార్‌-సుమిత్ర దంపతుల మధ్య జరిగిన గొడవతో భర్త శివకుమార్‌ పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. గమనించిన కుటుంబసభ్యులు శివను వెంటనే వికారాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శివ కుమార్ చికిత్స పొందుతున్నాడు. తన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా సుమిత్ర.. హైతాబాద్‌లోని తన తల్లి యాదమ్మ వద్దకు వెళ్లింది. అప్పటికే తీవ్ర మనస్తాపం చెందిన సుమిత్ర..తన భర్త ఆత్మహత్యాయత్నానికి తనే కారణమనే పశ్చాత్తాపంతో మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

విషయాన్ని ఉదయం గమనించిన తల్లి యాదమ్మ.. కుమార్తె మృతిని తట్టుకోలేక ఇంటి ముందున్న సంపులో దూకి తన ప్రాణాలను తీసుకుంది. గంటల వ్యవధిలోనే ఒకే కుటుంబంలో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి..

రెండు రోజుల క్రితమే నిశ్చితార్థం.. అంతలోనే...

బీమా కథా చిత్రమ్.. డబ్బు కోసం తండ్రికి ఇన్సూరెన్స్ చేయించి మరీ చంపేశాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.