‘సెస్‌’ ఎన్నికల్లో భారాస హవా.. 15కు 15 క్లీన్​స్వీప్​..

author img

By

Published : Dec 27, 2022, 7:47 AM IST

cess elections

ఈ నెల 24వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెస్​ డైరెక్టర్ల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో భారత్​ రాష్ట్ర సమితి విజయ దుందుభి మోగించింది. మొత్తం 15 డైరెక్టర్​ స్థానాలకు ఎన్నికలు జరగగా.. అన్నింటా గెలుపొందింది.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సెస్‌ (సహకార విద్యుత్తు సరఫరా సంస్థ) డైరెక్టర్ల స్థానాలను భారత్‌ రాష్ట్ర సమితి మద్దతుదారులు క్లీన్‌స్వీప్‌ చేశారు. మొత్తం 15 డైరెక్టర్‌ స్థానాలనూ కైవసం చేసుకున్నారు. ఈ నెల 24న ఎన్నికలు నిర్వహించగా.. సోమవారం వేములవాడలో ఓట్లు లెక్కించారు.

వేములవాడ గ్రామీణ స్థానంలో ఉత్కంఠ: వేములవాడ గ్రామీణ స్థానం ఫలితంపై అర్ధరాత్రి వరకు ఉత్కంఠ నెలకొంది. తొలుత బీఆర్​ఎస్​ బలపరిచిన అభ్యర్థి ఆకుల దేవరాజుపై బీజేపీ బలపరిచిన అభ్యర్థి జక్కుల తిరుపతికి 6 ఓట్ల మెజారిటీ వచ్చినట్లు సమాచారం. ఫలితం వెల్లడించక ముందే రీకౌంటింగ్‌ చేపట్టాలని అధికారులను బీఆర్​ఎస్​ అభ్యర్థి దేవరాజు కోరారు. రాత్రి 11.15 వరకూ కొనసాగిన రీకౌంటింగ్‌లో దేవరాజు విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు.

చందుర్తి స్థానం లెక్కింపులో చివరి రెండు రౌండ్లు మిగిలి ఉండగా అధికార పార్టీ వారితో ఎన్నికల సిబ్బంది లాబీయింగ్‌ చేస్తున్నారంటూ బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో కొద్దిసేపు లెక్కింపు నిలిచిపోయింది. ఆ సమయంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి అల్లాడి రమేశ్‌ 18 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. ఆందోళనకారులతో ఎన్నికల అధికారులు మాట్లాడిన తరవాత లెక్కింపు తిరిగి ప్రారంభించారు. అన్ని రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి బీఆర్​ఎస్​ బలపరిచిన శ్రీనివాస్‌రావుకు రెండు ఓట్ల మెజారిటీ వచ్చింది.

కేంద్రం బయట ఉన్న రెండు పార్టీల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు లాఠీలు ఝుళిపించి ఇరువర్గాలను చెదరగొట్టారు. రీకౌంటింగ్‌ చేపట్టాలని అల్లాడి రమేశ్‌ విన్నవించుకోగా ఎన్నికల అధికారి తిరస్కరించారు. బీఆర్​ఎస్​ బలపరిచిన శ్రీనివాసరావు గెలిచినట్లు రాత్రి 10 గంటల సమయంలో అధికారులు ప్రకటించారు. గంభీరావుపేట స్థానం ఓట్ల లెక్కింపునకు స్ట్రాంగ్‌ రూం నుంచి తీసుకొచ్చిన బ్యాలెట్ పెట్టెకు సీలు తీసి ఉందంటూ స్వతంత్ర అభ్యర్థి ఏజెంట్లు ఆందోళనకు దిగారు.

'ఐదు చోట్ల ఫలితాలు తారుమారు': సెస్‌ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు ఐదు చోట్ల గెలిచినప్పటికీ ఫలితాలను తారుమారు చేశారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఫలితాల వెల్లడిలో అధికార బీఆర్​ఎస్​ అక్రమాలకు పాల్పడిందన్నారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని అధికారపక్షం అపహాస్యం చేసింది. బీఆర్​ఎస్​ వాళ్లే ఓట్లేసుకున్నారు. ఫలితాలనూ వాళ్లే ప్రకటించుకున్నారు. ఈ మాత్రం దానికి ఎన్నికలు ఎందుకు? సాధారణ ఎన్నికల్లో ఈ ఆటలు చెల్లవు. కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు’’ అని సంజయ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ విజయం మాపై నమ్మకానికి నిదర్శనం: సెస్‌ ఎన్నికల్లో బీఆర్​ఎస్​కు ఘన విజయం కట్టబెట్టిన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంపై తెలంగాణ ప్రజలకు ఉన్న అపూర్వ నమ్మకానికి ఈ గెలుపు నిదర్శనమన్నారు. రైతన్నలు, నేతన్నలు, దళితులు, గిరిజనులకు, కుల వృత్తులకు అందిస్తున్న విద్యుత్‌ సంక్షేమ కార్యక్రమాలకు జనామోదం లభించిందని పేర్కొన్నారు.

బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా సెస్‌ ఎన్నికల్లో గెలువలేకపోయిందని, మరోసారి ప్రజల తిరస్కారానికి గురైందని చెప్పారు. అడ్డదారిన గెలిచేందుకు సాధారణ ఎన్నికల మాదిరిగా భాజపా అన్ని ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. ఈ విజయంతో బీఆర్​ఎస్​ నాయకత్వంపై, ప్రభుత్వంపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. దీంతో ఉప్పొంగిపోకుండా సెస్‌ పరిధిలో మరింత నాణ్యమైన విద్యుత్‌ సరఫరా, మౌలిక వసతుల కల్పన వంటి కార్యక్రమాలపై దృష్టి పెడతామని కేటీఆర్‌ తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.