ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకి బదిలీ.. ఆదేశించిన హైకోర్టు

author img

By

Published : Dec 26, 2022, 4:12 PM IST

Updated : Dec 26, 2022, 5:12 PM IST

HIGHCOURT
HIGHCOURT ()

14:58 December 26

సీబీఐకి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు

ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తుపట్ల నమ్మకం లేదని బీజేపీ, నిందితులు రామచంద్ర భారతి, నందు కుమార్, సింహయాజి వేసిన పిటిషన్లు పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కేసును సీబీఐకి అప్పగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని సిట్‌ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో పురోగతి ఉన్నందున సిట్‌తో దర్యాప్తు చేయించాలని ఆయన కోరారు. అయితే, అడ్వకేట్‌ జనరల్‌ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తు వివరాలను సీబీఐకి అందజేయాలని సిట్‌ను ఆదేశించింది. ఈ తీర్పుపై సిట్ స్పందించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్​లో సవాలు చేసే యోచనలో ఉంది.

గత అక్టోబర్‌ 26న హైదరాబాద్‌ శివారులోని మెయినాబాద్‌లో బీఆర్​ఎస్​కు చెందిన ఎమ్మెల్యేల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపీలో చేరాలంటూ తనతో పాటు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రేగా కాంతారావులను కొందరు ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ అక్టోబర్‌ 26న తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొయినాబాద్‌ పోలీసులు బేరసారాలకు జరుగుతున్న ఫాంహౌజ్‌పై దాడులు నిర్వహించారు. ఈ వ్యవహారంలో రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిలను అదే రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కేసు విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ నేతృత్యంలో ఏర్పాటైన సిట్‌.. న్యాయస్థానం అనుమతితో నిందితులను పలుమార్లు కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఈ క్రమంలోనే లభించిన ఆధారాలతో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్‌తో పాటు కేరళకు చెందిన తుషార్‌, జగ్గుస్వామిని విచారించేందుకు నోటీసులు జారీచేసింది. ఈ నేపథ్యంలో వారు హైకోర్టును ఆశ్రయించటంతో వీరికి ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన నోటీసులతో స్టే విధించింది.

ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న నందకుమార్, రామచంద్రభారతి, సింహయాజిలు బెయిల్‌ కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా పలు దఫాలుగా విచారణ జరిపిన న్యాయస్థానం 20రోజుల క్రితం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు పట్ల నమ్మకం లేదంటూ ఈ కేసు నిందితులతో పాటు బీజేపీతో పాటు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారించిన ధర్మాసనం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఇవాళ ఆదేశాలు జారీచేసింది.

ఇవీ చూడండి

Last Updated :Dec 26, 2022, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.