ETV Bharat / state

సౌరవిద్యుత్‌ ఉత్పత్తిపై దృష్టిపెట్టిన ఎన్టీపీసీ

author img

By

Published : Mar 13, 2021, 3:17 AM IST

సౌరవిద్యుత్‌ ఉత్పత్తిపై దృష్టిపెట్టిన ఎన్టీపీసీ
సౌరవిద్యుత్‌ ఉత్పత్తిపై దృష్టిపెట్టిన ఎన్టీపీసీ

దేశంలో విద్యుత్‌ డిమాండ్‌ ఎప్పటికప్పుడు పెరిగిపోతోంది. ఐతే మన అవసరాలు తీరేందుకు మాత్రం థర్మల్‌ విద్యుత్‌పైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. బొగ్గు ఆధారిత ఉత్పత్తి కేంద్రాల వల్ల కాలుష్యంతో పాటు ఇతర సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని నివారిస్తూ భవిష్యత్‌ డిమాండ్‌ను అందుకునేందుకు సౌరవిద్యుత్‌పై ప్రభుత్వాలు దృష్టిసారించాయి. ఇందులో భాగంగా ఎన్టీపీసీ రామగుండంలో నీటిపై తేలియాడే సోలార్‌ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తోంది.

సౌరవిద్యుత్‌ ఉత్పత్తిపై దృష్టిపెట్టిన ఎన్టీపీసీ

పెరిగిపోతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా థర్మల్‌తో పాటుగా సంప్రదాయేతర విద్యుత్‌ ఉత్పత్తిపై ఎన్టీపీసీ దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలోని బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌పై దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్‌-నీటిపై తేలియాడే ఉత్పత్తి కేంద్రం నిర్మాణం శరవేగంగా సాగుతోంది. 100 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్లాంటులో మే నెల నుంచి ఉత్పత్తి ప్రారంభం కానుంది.

పెద్దగా భూసేకరణ అవసరం ఉండదు..

దేశవ్యాప్తంగా 450 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని ఎన్టీపీసీ నిర్ణయించింది. వీటిలో రిజర్వాయర్లపైనే 217 మెగావాట్ల సామర్థ్యంతో ఫ్లోటింగ్‌ సోలార్ ప్లాంట్ల నిర్మాణాన్ని తలపెట్టింది. ఇందులో రామగుండం ఎన్టీపీసీలోని బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ఉపరితలంపై 100మెగావాట్ల ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతోంది. 450 ఎకరాల విస్తీర్ణంలో 430కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ ఫ్లోటింగ్‌ ప్లాంటు నిర్మాణం ఇప్పటికే పూర్తి కావల్సి ఉండగా... కొవిడ్ కారణంగా ఆలస్యమైనట్లు సమాచారం. సాధారణంగా ఒక మెగావాట్ ఉత్పత్తికి ఐదెకరాలు అవసరమైతే నీటిపై తేలియాడే ప్లాంట్లకు పెద్దగా భూసేకరణ అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు.

మరింత ముందుకెళ్తాం..

ఇది అద్వితీయమైన ప్రగతి. ఇతర అవసరాలకు ఉపయోగించని నీటిప్రాజెక్టులను సౌరవిద్యుత్‌ ఉత్పత్తి కోసం వినియోగిస్తున్నాం. ఈ ప్రాజెక్టు ఫలితాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్‌లో మరింత ముందుకెళ్తాం. తెలంగాణలో భారీ నీటి ప్రాజెక్టులు ఉండటం వల్ల రానున్న రోజుల్లో మరిన్ని సౌరవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పే అవకాశం ఉంది. -సునీల్‌, ఎన్టీపీసీ, చీఫ్ జనరల్ మేనేజర్

రామగుండంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో మరిన్ని ఫ్లోటింగ్‌ సోలార్ యునిట్లు ఏర్పాటు చేసే దిశగా ఎన్టీపీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. కేరళలోని కయంకుళంలో 92 మెగావాట్లు, సింహాద్రిలో 25 మెగావాట్ల యూనిట్లను ఎన్టీపీసీ ఏర్పాటు చేస్తోంది.

ఇదీ చదవండి: ‍‌స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ సాకారం: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.