ETV Bharat / state

ఇందూరు నుంచి విదేశాలకు పిండి వంటలు

author img

By

Published : Jan 13, 2021, 10:18 AM IST

ఇందూరు నుంచి విదేశాలకు పిండి వంటలు
ఇందూరు నుంచి విదేశాలకు పిండి వంటలు

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు పిండి వంటలే అందరికీ గుర్తొస్తాయి. ఒకప్పుడు ఇంటిల్లిపాది ఒకచోట చేరి పిండి వంటలు తయారు చేసేవారు. చిన్నా పెద్దా అంతా పిండి వంటల తయారీలో పాలు పంచుకునేవారు. హడావుడి జీవన ప్రయాణంలో అంత తీరిక లభించడం లేదు. దీంతో బయటి నుంచి కొనుగోలు చేస్తున్నారు. పిండి వంటలు తయారీ ఓ కుటీర పరిశ్రమగా మారిపోగా.. పదుల సంఖ్యలో మహిళలకు ఉపాధి లభిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో తయారైన పిండి వంటలు ఖండాంతరాలు దాటి పోతున్నాయి. సంక్రాంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో మహిళలకు ఉపాధి మార్గంగా మారిన పిండి వంటల తయారీపై ప్రత్యేక కథనం...

సంక్రాంతి పండుగకు ప్రతి ఇంట్లో పిండి వంటలు తయారు చేసుకుంటారు. ప్రస్తుతం చాలా మంది రెడిమేడ్ పిండి పదార్థాలపై ఆధారపడుతున్నారు. పదేళ్ల కింద వరకు అంతా ఇంట్లోనే తయారు చేసుకునేవారు. గత కొన్నేళ్లుగా బయట ఆర్డర్ ఇచ్చి తయారు చేసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. సంక్రాంతి పురస్కరించుకుని తయారీ కేంద్రాలు రద్దీగా మారిపోయాయి. చెకోడీలు, మురుకులు, అరిసెలు, గవ్వలు, లడ్డులు, సకినాలు, గరిజెలు... ఇలా 20 వరకు పిండి వంటలు తయారు చేస్తున్నారు.

మహిళలకు ఉపాధి కేంద్రాలు..

నగర ప్రాంతాల్లో ఎక్కువ మహిళలు ఉద్యోగాలు చేస్తుండటం, అందరికీ అన్ని పిండి వంటలు రాకపోవడం వల్లే తయారీ కేంద్రాల నుంచి తెచ్చుకోవాల్సి వస్తోంది. దీంతో తయారీ కేంద్రాలు కుటీర పరిశ్రమగా మారిపోయాయి. నిజామాబాద్ నగరంలోనే దాదాపు 20 వరకు పిండి వంటల తయారీ కేంద్రాలు ఉండగా ఒక్కో దాంట్లో 10 నుంచి 15 మంది వరకు మహిళలు పని చేస్తూ ఉపాధి పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 50వరకు ఈ కేంద్రాలు ఉంటాయి. ఏడాది పొడవునా ఈ కేంద్రాల్లో మహిళలకు ఉపాధి లభిస్తోంది. శుభకార్యాలు, సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకంగా ఆర్డర్లు వస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఒక్కో కేంద్రంలో ఐదు నుంచి పది మందికి అధికంగా ఉపాధి లభిస్తోంది. ప్రతి రోజూ రూ.300 నుంచి రూ.500 వరకు వీరికి కూలీ లభిస్తోంది. దీంతో మహిళలు తమ కుటుంబాలకు అదనపు ఆదాయం అందించగలుగుతున్నారు.

ఇందూరు నుంచి విదేశాలకు..

నిజామాబాద్ జిల్లా నుంచి అనేక మంది దేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాల్లో ఉంటున్నారు. దీంతో ఇందూరు నుంచి బంధువులు, కుటుంబ సభ్యుల కోసం అనేక మంది పిండి వంటలను పంపిస్తున్నారు. ఇంటర్నేషనల్ కొరియర్ ద్వారా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్, దుబాయ్ తోపాటు ఇతర దేశాలకూ ఇందూరు నుంచి పిండి వంటలు వెళ్తున్నాయి. ఆయా దేశాల్లో ఉన్న తమ బంధువులు, కుటుంబ సభ్యులు సైతం పిండి వంటలతో సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు ఇక్కడి నుంచి పంపిస్తున్నారు. ఇందుకోసం కొరియర్ సంస్థలు ఆరు కిలోల బరువుకు రూ.800నుంచి రూ.1200వరకు రుసుము వసూలు చేస్తున్నాయి. అందుబాటు ధరలో తయారీ ప్రయాస లేకుండా రెడిమేడ్​గా పదార్థాలు లభిస్తుండటం పట్ల కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నిత్యం పని ఉంటుంది...

ప్రతి రోజూ నాకు పని లభిస్తోంది. మేము పది నుంచి పన్నెండు మందిదాక పని చేస్తాం. సంక్రాంతి పండుగ వేళ మరో ఐదారుగురికి ఎక్కువ పని దొరుకుతుంది. సాధారణ రోజుల్లో రూ.300, పండుగలు, పెళ్లిళ్ల సీజన్లలో రూ.500 వరకు కూలీ లభిస్తుంది. స్థానికంగానే పని లభించడం సంతోషంగా అనిపిస్తుంది. - లక్ష్మి, నిజామాబాద్

ఇళ్లల్లో తయారీ లేక...:

ఇళ్లలో తయారు చేసుకోవడం బాగా తగ్గిపోయింది. ఉద్యోగం చేసే మహిళలు అధికంగా ఉండటం, తీరిక లేని జీవితాల కారణంగా మా దుకాణాల్లోనే ఎక్కువగా కొంటున్నారు. పదిహేనేళ్ల కింద మొట్టమొదట దుకాణం నిజామాబాద్​లో మాదే. ఈ గత ఐదారేళ్లుగా తయారీ కేంద్రాల సంఖ్య పెరిగింది. అన్ని రోజుల్లోనూ గిరాకీ ఉంటోంది. అలాగే విదేశాల నుంచి ఆర్డర్లు వస్తుంటాయి. ఇంటర్నేషనల్ కొరియర్ ద్వారా ఇక్కడి నుంచి నేరుగా విదేశాలకు పంపిస్తాం.- శోభ, పిండి వంటల కేంద్రం నిర్వాహకురాలు

అందరికీ అన్నీ రాక....:

ఇంట్లో మహిళలు అన్ని రకాల పిండి వంటలు చెయ్యలేరు. కొందరికి కొన్ని మాత్రమే వస్తాయి. కేంద్రంలో విభిన్న రకాల పిండి వంటలు లభిస్తాయి. తయారీ కోసం అధిక సమయం పడుతోంది. అధిక ప్రయాస పడాల్సి వస్తోంది. కొనుక్కొని వెళ్లడం వల్ల పండుగ వేళ అందరూ సంతోషంగా గడిపేందుకు సమయం ఆదా అవుతోంది. రుచి కూడా బాగుంటోంది. ప్రతి ఏటా ఇక్కడే కొని ఇంటికి తీసుకెళ్తాం. ముంబయిలో ఉండే మా బంధువులకు సైతం పంపిస్తాం. - భూమయ్య, బోధన్, నిజామాబాద్ జిల్లా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.