ETV Bharat / state

ఎడతెరిపిలేని వర్షం.. వాననీటిలో కొట్టుకుపోయిన ధాన్యం

author img

By

Published : May 16, 2022, 4:39 PM IST

Paddy Damage Due to Rain in Nizamabad : నిజామాబాద్‌ జిల్లాలో ఆదివారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యమంతా కళ్లముందే తడిసిపోతుంటే నిస్సహాయ స్థితిలో ఉన్న కర్షకులు కన్నీరుమున్నీరయ్యారు. ఆరుగాలం పడిన కష్టమంతా నీళ్లలో కొట్టుకుపోతుంటే.. కాపాడుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించారు.

Paddy Damage Due to Rain in Nizamabad
Paddy Damage Due to Rain in Nizamabad

ఎడతెరిపిలేని వర్షం.. వాననీటిలో కొట్టుకుపోయిన ధాన్యం

Paddy Damage in Nizamabad : నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షం అన్నదాతలకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నెలకొరిగింది. అలాగే పంట కోసి అమ్మకం కోసం 20రోజులుగా ఆరబెట్టిన వరిధాన్యం సైతం తడిసి....కొట్టుకుపోయింది. రైతులు తమ ధాన్యాన్ని రక్షించుకోవడానికి టార్పాలిన్లు కప్పినా ప్రయోజనం లేకుండాపోయింది. వర్షానికి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు నిరసన చేపట్టారు.

Paddy Damage in Kamareddy : కామారెడ్డి జిల్లాలో వర్షాలకు గాంధారి మార్కెట్ యార్డులో ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. ధాన్యం కొట్టుకుపోయింది. గాంధారిలో సెల్లార్ దుకాణాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. తడిసి పోయిన సామగ్రి, నీటిని ఎత్తిపోసేందుకు దుకాణాదారులు అవస్థలు పడ్డారు. జుక్కల్‌లో ధాన్యం కొట్టుకుపోగా.. జొన్న పంట నేలకొరిగింది. బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. దోమకొండలో వర్షానికి వరి ధాన్యం కొట్టుకుపోయింది.జోరు వానకు చాలా ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.ఈ అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

Heavy Rain in Nizamabad : జుక్కల్ నియోజకవర్గంలో బిచ్కుంద, పిట్లం, నిజాంసాగర్, జుక్కల్ మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లోనే వరిదాన్యం కుప్పలుగా ఉంటడంతో నష్టం జరిగింది. బిచ్కుంద మండలంలో ని పుల్కల్, పెద్ద దేవాడ, వాజీద్ నగర్, గోపన్ పల్లి గ్రామాల్లో రాత్రి కురిసిన వర్షానికి వరిదాన్యం మొత్తం వర్షపునీటీతో నిండిపోయింది. పిట్లం మండలం రాంపూర్ కలాన్‌లో వర్షానికి కుప్పగా ఉన్న వరిదాన్యం కొట్టుకుపోయింది. నిజాంసాగర్ మండలం కోమలంచ లో బస్తాలు తడిసిపోయాయి.

Heavy Rain in Kamareddy : తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణ శివారులోని దోబీ ఘాట్ సమీపంలో నిజామాబాద్-ఆర్మూర్ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. రైతులకు పోలీసులు సర్ది చెప్పారు. భాజపా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నుతుల శ్రీనివాస్ రెడ్డి మద్దతు తెలిపారు.

"మేం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి రెండు నెలలవుతోంది. 200 సంచుల వరకు ధాన్యాన్ని కాంటా వేశారు. కానీ.. లారీల కొరత వల్ల ధాన్యమంతా ఇక్కడే ఉంది. ఇప్పటికి వర్షానికి రెండు సార్లు ధాన్యమంతా తడిచిపోయింది. టార్పాలిన్లు కప్పి కాపాడుకోవడానికి చాలా ప్రయత్నించాం. కానీ వర్షం ధాటిని టార్పాలినట్లు తట్టుకోలేకపోయాయి. ధాన్యం బస్తాలన్ని నీటిలో తేలుతున్నాయి. ఈ ధాన్యం ఎండబోసినా.. ఉపయోగం ఉంటుందో లేదో తెలియడం లేదు. అధికారులు వీలైనంత త్వరగా లారీలను పంపించాలి. హమాలీలు కూడా దొరకడం లేదు. కూలీ ఎక్కువైనా సరే.. ధాన్యం త్వరగా పంపిద్దామనుకుంటే.. లారీలు లేవు. హమాలీలు లేరు. ఇప్పటికైనా అధికారులు కొనుగోలు కేంద్రాలకు వచ్చి మా ధాన్యాన్ని మిల్లులకు పంపించాలి. "

- ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.