Reservoirs: కొనసాగుతోన్న వరద ప్రవాహం.. నిండుకుండల్లా జలాశయాలు

author img

By

Published : Sep 9, 2021, 4:23 PM IST

flood continuing to Sriram sagar and nizamsagar in Nizamabad

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాల్లో జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఎగువ నుంచి ఇప్పటికీ వరద ప్రవాహం అలాగే కొనసాగుతోంది. శ్రీరాంసాగర్​, నిజాంసాగర్​ జలాశయాలు పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోగా.. గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు.

కొనసాగుతోన్న వరద ప్రవాహం.. నిండుకుండల్లా జలాశయాలు

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాల్లోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. కుండపోతగా కురిసిన వర్షాలతో చెరువులు అలుగులు పారటం, వాగులువంకలు పోటెత్తటం వల్ల.. జలాశయాలకు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులు నిండుకుండల్లా మారగా... గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు వదులుతున్నారు. ఈ సుందర దృశ్యాలను వీక్షించేందుకు ప్రజలు పోటెత్తున్నారు.

శ్రీరాంసాగర్​ జలాశయం..

నిజామాబాద్​ జిల్లా శ్రీరాంసాగర్ జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 3 లక్షల 50 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు నుంచి 33 గేట్లు ఎత్తి... 3 లక్షల 52 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1087.7 అడుగుల నీటి మట్టం ఉంది. ప్రాజెక్టు దిగువన గోదావరి ఉగ్రరూపం దాల్చడం వల్ల ప్రజలెవరూ నదీ తీరం వైపు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

నిజాంసాగర్​ జలాశయం..

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ జలాశయానికి కూడా వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద వల్ల.. సింగూర్ జలాశయం నుంచి 44 వేల 600 క్యూసెక్కుల నీళ్లు వస్తున్నాయి. ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి మొత్తంగా 54416 క్యూసెక్కులు ఇన్​ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు ఎనిమిది గేట్లు ఎత్తి 52 వేల 416 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి వదులుతున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా. ప్రస్తుతం 1404.54 అడుగుల చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 17.282 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ఇదీ చూడండి:

Reservoirs: రాష్ట్రంలో భారీ వర్షాలు... నిండుతున్న జలాశయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.