Reservoirs: రాష్ట్రంలో భారీ వర్షాలు... నిండుతున్న జలాశయాలు

author img

By

Published : Sep 7, 2021, 10:18 AM IST

Updated : Sep 7, 2021, 2:04 PM IST

projects-filled-with-flood

తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు భారీ వరద చేరుతోంది. వరద నీటితో జలశయాలు కళకళలాడుతున్నాయి. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, పార్వతి బ్యారెజ్, మూసీ, తాలిపేరు, కడెం జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో జలాశయాలు నిండుతున్నాయి. దాదాపు అన్ని జలాశయాల్లో నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరుకుంది.

నిండుతున్న జలాశయాలు

30 గేట్లు ఎత్తి నీటి విడుదల

శ్రీరాంసాగర్ జలాశయానికి వరద పోటెత్తింది. ప్రస్తుతం 2.04 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1,091 అడుగులు కాగా... ప్రస్తుతం 1,089.4 అడుగుల నీటిమట్టం ఉంది. నీటి నిల్వ సామర్థ్యం విలువ 90 టీఎంసీలు ఉండగా... ప్రస్తుతం 81.69 టీఎంసీలు నిల్వ ఉంది. వరద ఉద్ధృతి నేపథ్యంలో అధికారులు 30 గేట్లు ఎత్తి... 1,96,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరిగింది. ప్రస్తుతం 15,480 క్యూసెక్కుల ఇన్​ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా... ప్రస్తుత నీటి మట్టం 1403 అడుగులు ఉంది. నీటి సామర్థ్యం 17 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 15 టీఎంసీలు సామర్థ్యం ఉంది. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయాలని భావిస్తున్నారు. ముందుగా మంజీరా పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.

వరద నీరు వస్తే సమాచారం ఇవ్వాలి: డీసీపీ

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో ఎల్లంపల్లి జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టుకు 4.14 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో ఉండగా... 4.3 లక్షల క్యూసెక్కుల ఔట్​ ఫ్లో ఉంది. ప్రస్తుతం 18.5 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వరదనీరు ఇళ్లల్లోకి వస్తే సమాచారం ఇవ్వాలని మంచిర్యాల డీసీపీ తెలిపారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

జంట జలాశయాల్లో..

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్​లోని జంట జలాశయాలకు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. హిమాయత్‌సాగర్‌ జలాశయంలోకి 750 క్యూసెక్కులు నీరు వస్తోంది. గరిష్ఠ నీటిమట్టం 1,763.50 అడుగులు కాగా.. జలాశయంలో ప్రస్తుతం 1,762.10 అడుగులకు నీరు చేరింది. అధికారులు రెండు గేట్లు ఎత్తి... మూసీలోకి 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్​సాగర్​లోకి 1,200 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఉస్మాన్‌సాగర్ గరిష్ఠ నీటిమట్టం 1,790 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 1,789.35 అడుగులుగా ఉంది. నాలుగు గేట్ల ద్వారా మూసీలోకి 1,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ పరివాహాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

గోదావరి నీటిమట్టం పెరుగుతోంది...

గోదావరి ఎగువ ప్రాంతంలో ఉన్న చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. స్థానికంగా కురుస్తున్న వర్షాలకు తోడు... ఛత్తీస్‌గఢ్​ రాష్ట్ర అడవి ప్రాంతం నుంచి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. అప్రమత్తమైన అధికారులు 21 గేట్లు ఎత్తి 54,385 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 53,984 క్యూసెక్కుల నీరు వస్తుందని... వరద పెరిగితే మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని డీఈ తిరుపతి తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. సోమవారం ఉదయం 23 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం... ఈరోజు ఉదయానికి 30 అడుగుల దాటి ప్రవహిస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు 32.3 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో నీటిమట్టం ఇంకా పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.

భద్రాద్రిలోని చర్ల మండలంలోని తాలిపేరుకు వరద పెరుగుతుంది. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో తాలిపేరు నిండుకుండను తలపిస్తోంది. ఉద్దృతి ఎక్కువగా ఉండడంతో అధికారులు... 21 గేట్లు ఎత్తి 54,385 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.

పరవళ్లు తొక్కుతున్న జలాశయాలు

నిర్మల్ జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని జలాశయాలు పరవళ్లు తొక్కుతున్నాయి. కడెం జలాశయానికి వరద నీరు చేరుతుంది. 41,287 క్యూసెక్కుల వరద నీరు జలాశయంలో చేరుతుంది. దీని పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా... ప్రస్తుతం 697.550 అడుగుల నీటిమట్టం ఉంది. 5 వరద గేట్ల ద్వారా 53,683 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. జిల్లాలోని స్వర్ణ జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది. 10,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో 5 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. స్వర్ణ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో... కౌట్ల(కె)-సిద్ధాపూర్ వంతెన మునిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జీఎన్‌ఆర్‌, సిద్ధాపూర్ కాలనీ వాసులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

పెరుగుతున్న వరద

పెద్దపల్లి జిల్లాలోని పార్వతీ బ్యారేజ్‌కు వరద ఉద్ధృతి పెరిగింది. పార్వతీ బ్యారేజ్ ఇన్‌ఫ్లో 4,35,350 క్యూసెక్కులు ఉండగా...4.70 లక్షల క్యూసెక్కుల నీటిని 65 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీలో 3.01 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

రాగల మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: Rainfall Warning: వాతావరణ శాఖ హెచ్చరిక.. రాష్ట్రానికి అత్యంత భారీ వర్షసూచన

Last Updated :Sep 7, 2021, 2:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.