పోలీసు శాఖ వినియోగిస్తున్న వాహనాలను కండిషన్లో ఉంచాలని నిర్మల్ జిల్లా ఇంఛార్జీ ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నిర్మల్ జిల్లా పోలీసు సాయుధ దళ ఆవరణలో పోలీసు వాహనాలను తనిఖీ చేశారు. ఎప్పటికప్పుడు వాహనం, ఇంజిన్ ను పరిశీలించాలని, అవసరమైన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించడం వల్ల వాహన జీవన కాలం పెరుగుతుందన్నారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని, పనితీరుతో పోటీపడాలని ఆయన సూచించారు. వాహనం నడిపే డ్రైవర్లకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. మోటారు వాహన చట్టంపై అవగాహన కల్గి ఉండాలన్నారు. హైవే పెట్రోలింగ్ వాహనం ఎల్లప్పుడూ హైవేపై తిరుగుతూ నిఘా ఉంచాలన్నారు. పరిమిత వేగంతో ప్రయాణించాలని, ఆరోగ్య పరిరక్షణపై శ్రద్ధ వహించాలని తెలిపారు. ద్విచక్ర వాహనాలు నడిపే పోలీస్ సిబ్బంది తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్ఐ వెంకట్, ఎంటీఓ కృష్ణ ఆంజనేయులు, ఆర్ఎస్సై వినోద్ తదితరులు పాల్గొన్నారు.