ETV Bharat / state

మెట్ట పద్ధతిలో వరిసాగు.. చేసేను రైతుకు మేలు.!

author img

By

Published : Jan 14, 2023, 9:15 AM IST

method
మెట్ట పద్ధతితో మేలు

Paddy Cultivation New Method: సంప్రదాయంగా వరిసాగుచేయాలంటే నారుపోసి, మడుల్లో నీటిని నింపి దమ్ము చేసిన తర్వాత బురదలో నాటువేయాలి. ఇందుకు నీటి వినియోగంతో పాటు పెట్టుబడి ఎక్కువే. వాతావరణ మార్పులకు అనుగుణంగా అవేవి లేకుండా సాగులో నీటి వినియోగాన్ని, పెట్టుబడి ఖర్చులను తగ్గిస్తూ.. పర్యావరణ హితంగా మెట్ట పద్ధతిలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైతులు వరిలో వినూత్న సాగు పద్ధతులను అవలంభిస్తున్నారు. ఈ ప్రయోగాత్మక పద్ధతిని డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌, ఫిలిఫ్పిన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నాయి.

మెట్టపద్ధతిలో సాగు మేలు

New Method Of Paddy Cultivation In Nalgonda District:పెట్టుబడి ఖర్చులు తగ్గించుకుంటూ పర్యావరణ హితంగా మెట్ట పద్ధతిలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైతులు వరిలో వినూత్న సాగు పద్ధతులు అవలంభిస్తున్నారు. ఇందులో భాగంగా.. తాజాగా ముగిసిన వానాకాలం సీజన్‌లో నల్గొండ జిల్లాలో 10 వేల ఎకరాల్లో వరిని ఆ పద్ధతిలో సాగు చేయగా.. సంప్రదాయ సాగుతో పోలిస్తే మంచి దిగుబడులు వచ్చాయని అన్నదాతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కూలీల ఖర్చు లేకపోవడం, ఎరువులను తగిన మోతాదులో వినియోగించడం వల్ల ఎకరానికి తక్కువలో తక్కువగా 10 వేల నుంచి 2 వేల రూపాయల వరకు మిగులుతున్నాయని వెల్లడిస్తున్నారు.

శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పరిశీలన: మెట్ట పద్ధతిలో వానాకాలం సీజన్‌లో తొలకరికి ముందేభూమి చదును చేసి ఆ తర్వాత విత్తనాలు వేసి, వరిని పండిస్తారు. యాసంగిలో డ్రమ్‌సీడర్‌ సాయంతో.. విత్తనాలు చల్లుతారు. డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ వాతావరణ విభాగం శాస్త్రవేత్తలతో పాటు ఇరి భాగస్వామ్యంతో ఇక్కడి రైతులు ఈ ప్రయోగాత్మక సాగుకు శ్రీకారం చుట్టారు. ఈ పద్ధతిలో నాటు వేసినప్పటి నుంచి కోతల వరకు రైతులకు.. రెడ్డీస్‌ ఫౌండేషన్, ఇరి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. సంప్రదాయ సాగుకంటే ఈ విధానంలో ఎకరాకు సగటున ఐదు నుంచి ఏడు బస్తాల దిగుబడి ఎక్కువగా వస్తోందని రైతులు చెబుతున్నారు.

భూమి సురక్షితంగా ఉంటుంది: ఎరువులు, నీటి వినియోగంతగ్గడంతో సహజంగానే పర్యావరణంతోపాటూ నీటి కాలుష్యం తగ్గుతోందని తద్వారా భూసారం కోల్పోకుండా ఉంటుందని రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు వెల్లడించారు. దిగుబడులు బాగా ఉండటం, శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండటంతో ఈ పద్ధతిలో ఈ యాసంగిలో సాగు 50 వేల ఎకరాలకు పెరిగిందని చెప్పారు వచ్చే వానాకాలం సీజన్‌ నాటికి సుమారు రెండు లక్షల ఎకరాల్లో ఈ పద్ధతిలో వరి సాగుచేసే విధంగా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆ పద్ధతిని పరిశీలించడానికి ఫిలిఫ్పిన్స్, ఇజ్రాయిల్, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్‌కి చెందిన శాస్త్రవేత్తలు రెండునెలలక్రితం క్షేత్రస్థాయిలో పర్యటించారు. సాగులోని కష్టనష్టాలు రైతులను అడిగి తెలుసుకున్నారు.

"సాగర్​ ఆయకట్టు వల్ల రైతులు అందరం ఒకేసారి నాటుకు సిద్ధం చేశాము. నాటు వేసేటప్పుడు కూలీలు దొరికేవారు కాదు. దీనివల్ల మేము చాలా ఇబ్బందులు పడేవారిమి. పైసలు ఎక్కువ ఇచ్చినా సరే వారు దొరికే పరిస్థితే లేదు." - రైతు

"మెరుగైన దిగుమతులు సాధించడానికి డా.రెడ్డీస్​ ఫౌండేషన్​వారి ఆధ్వర్యంలో గత యాసంగిలో డ్రమ్​ సీడ్​ వేశాము. ఆ డ్రమ్​ సీడ్​ నాటు వేసినప్పుడు వానాకాలం పంట కన్నా 6లేదా7 బస్తాలు అధికంగా వస్తున్నాయి. తరవాత వానాకాలం మెట్టవరి వేశాము. మెట్టవరిలో కూలీలకు డబ్బులు చెల్లించేది లేకుండా రూ.6000 మిగిలింది. దిగుమతిలో కూడా 6 బస్తాలు ఎక్కువగానే వచ్చింది. అంతకుముందు 36 బస్తాలు వచ్చిన వరి మెట్టవరి వేసిన తరవాత 42బస్తాలు దిగుబడి వచ్చింది." - రైతు

"ఎక్కువ మోతాదులో ఎరువులు వాడడంవల్ల పంట క్షీణిస్తుంది. కానీ ఈ పద్ధతిలో ఒక బస్తా మాత్రమే వేస్తాము. దీని వల్ల డబ్బులు మిగులుతున్నాయి. ఎక్కువ మోతాదులో పొలంలో ఎరువులను వేయడం వల్ల ఈ రసాయనం భూమిలో ఉండిపోయి రానురాను క్షీణిస్తుంది. ఈ మెట్టపద్ధతిలో అయితే ఎంత రసాయనం కావాలో అంతే వినియోగించుకోవడం వల్ల భూమి సురక్షితంగా ఉంటుంది. సాల పద్ధతిలో వస్తాయి కాబట్టి పురుగులు చీడ పురుగులు తక్కువగా సోకే అవకాశం ఉంది." - వీరాస్వామి, ఏరియా మేనేజర్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.