నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో అనారోగ్యంతో ఉన్న భాజపా జిల్లా ప్రధానకార్యదర్శి దుర్గాప్రసాద్ను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. తెరాస పార్టీలో అభ్యర్థులు లేక కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఇచ్చిన ఘనత కేసీఆర్దని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది భాజపా ప్రభుత్వమేనని.. తెరాస పతనం ఆరంభమైందని సంజయ్ పేర్కొన్నారు. 2014 ఉద్యమ సమయంలో పీవీ నర్సింహరావును తీవ్రంగా విమర్శించిన నాయకులే ఇప్పుడు పీవీ ఫొటోతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
టీఎన్జీవో ఉద్యోగుల ద్వారా శ్రీనివాస్ గౌడ్ మంత్రి పదవిని పొందారని... ఆయన మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని కుటుంబ సభ్యుల కోసం సొంత జీవోలు తీసుకొచ్చారని బండి సంజయ్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, భాజపా జిల్లా అధ్యక్షుడు సుధాకర్రావు, ఇతర నేతలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'తెరాస నిర్లక్ష్యం వల్లే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఆలస్యం'