ETV Bharat / state

70 ఏళ్ల వయసులో కొడుకు కోసం 140 కి.మీ.నడక

author img

By

Published : Apr 30, 2020, 10:47 AM IST

Updated : Apr 30, 2020, 6:03 PM IST

పేగుబంధమే ఆ తల్లికి శక్తినిచ్చింది. కన్నకొడుకు క్షేమ సమాచారం కోసం పరితపించిన ఆ వృద్ధురాలిని కిలోమీటర్లకొద్దీ నడిపించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కుమారుడి కుటుంబం ఎలా ఉందోనన్న బెంగతో 70 ఏళ్ల వృద్ధురాలు ఏకంగా 140 కిలోమీటర్లు నడిచింది. ఆ తల్లి ప్రేమను మనమూ చదివేస్తూ.. ఆస్వాదిద్దామా...

70-years-old-women-walked-120km-nagarkurnool
70 ఏళ్ల వయసులో 140 కి.మీ.నడక

నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం కోమటికుంటకి చెందిన రామచంద్రమ్మ(70) కుమారుడు రాములు(40) హైదరాబాద్‌లోని షేక్​పేట్​ ప్రాంతంలోని దర్గా వద్ద ఉంటున్నాడు. ఇక్కడే కూలి పని చేసుకుంటూ భార్యాబిడ్డలను పోషించుకుంటున్నాడు. తన తల్లి కూడా ఇక్కడే తనతో ఉండేది. లాకౌడౌన్​కు ముందు మరో కొడుకు దగ్గరికని ఊరెళ్లింది. కానీ లాక్​డౌన్​తో పరిస్థితులు మారిపోవటంతో కొడుకుపై ఉన్న మమకారంతో ఒక్కసారిగా ఆ తల్లి గుండెల్లో ఆందోళన పెరిగింది. గ్రామంలో తన కుటుంబీకులు ఉన్నా.. కరోనా లాక్​డౌన్​ పరిస్థితుల్లో బతుకుదెరువుకు హైదరాబాద్ వెళ్లిన తన కొడుకు ఎలా ఉన్నాడో అని అల్లాడిపోయింది. ఎలాగైనా కొడుకు చేరాలనుకుంది.

కొడుకు యోగక్షేమాలు తెలుసుకుందామని ప్రయత్నిస్తే ఆయన సెల్‌ఫోన్‌ కూడా పనిచేయలేదు. లాకౌడౌన్​ మొదలయ్యే సమయంలోనే ఫోన్​లో రీఛార్జ్ అయిపోయింది. కరువు కాలంలో ఫోన్​ రీఛార్జ్ కూడా చేయించుకునే స్థోమత లేక రాములు అలానే వదిలేశాడు. కొడుకు ఫోన్​ కలవకపోవటంతో తన కొడుక్కు ఏమైందో, కొడుకు కుటుంబం కరోనా విపత్తులో ఎలాంటి పరిస్థితుల్లో ఉందోనన్న ఆందోళన పెరిగింది. డబ్బులు లేకున్నా.. ఊళ్లోంచి వెళ్లొద్దని వారించినా.. ఎలాగైనా కొడుకును కలవాలని తలంచి.. ఊళ్లో ఎవరికీ చెప్పాపెట్టకుండా కాలినడకన రామచంద్రమ్మ హైదరాబాద్​ నగరానికి బయలుదేరింది.

140 కిలోమీటర్లు నడిచి హైదరాబాద్​ చేరాక ఫోన్​ చేద్దామనుకున్న ఆ తల్లికి ఇక్కడికి వచ్చాక నిరాశే ఎదురైంది. కొడుకు చిరునామా తెలియక.. మహానగరంలో దారితప్పి చాంద్రాయణగుట్టకు వచ్చింది. ఎటుపోవాలో తెలీని దుస్థితి.. దానికితోడు కడుపులో ఆకలి. రెండు మూడు రోజులు గడిచాయి. బుధవారం ఉదయం తన ఇంటి ముందు భిక్షాటన చేస్తున్న ఆ వృద్ధురాలిని.. స్థానిక తెదేపా నాయకుడు గాజుల వెంకటరమణ కదిలించగా విషయం చెప్పింది.

వెంటనే రంగంలోకి దిగిన వెంకటరమణ సామాజిక మాధ్యమంలో ఆమె వివరాలను పొందుపర్చారు. ఆ వివరాలను చూసిన భాజపా నాయకుడు నవీన్‌యాదవ్​.. వెంకటరమణను సంప్రదించి.. రాములు ఆచూకీ కనిపెట్టారు. ఇద్దరూ కారులో ఆమెను తీసుకెళ్లి కుమారుడి వద్దకు చేర్చారు. ఫోన్ కలవకపోవటంపై ఆరా తీస్తే.. తినేందుకే కష్టంగా ఉందని, డబ్బులు లేకనే​ ఫోన్ రీఛార్జ్ చేయించనందునే కలవలేదని రాములు చెప్పగా చలించిపోయారు.

కుమారుడిని చూసిన రామచంద్రమ్మ ఆనందానికి అవధుల్లేవు.

ఇదీ చూడండి: 'పోస్ట్​ ఇన్ఫో'​తో ఔషధాలు, మాస్కులు డోర్​ డెలివరీ

Last Updated :Apr 30, 2020, 6:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.