మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలోని ఓ వ్యక్తి తన నెలరోజుల పిల్లలతో కమల ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య చనిపోయిందని, పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మృతురాలి భర్త ఆరోపించారు.
ప్రసవం కోసం వెళ్తే...
బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని ఎన్ఐఎన్ కాలనీకి చెందిన సంతోషి కుమారి అనే మహిళ సెప్టెంబర్ 28 న ఫిర్జాదిగూడలోని కమల ఆస్పత్రికి ప్రసవం కోసం వెళ్లింది. ఇద్దరు కవలలకు జన్మనిచ్చిన తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఎల్బీనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సంతోషి చనిపోవడంతో కమల ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే సంతోషి చనిపోయిందని ఆస్పత్రి ఎదుట ఆమె భర్త, బంధువులు ఆందోళన చేపట్టారు.
న్యాయం చేస్తామని ఆస్పత్రి యాజమాన్యం చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. వైద్యులపై కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. నెల రోజులు గడిచినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, యాజమాన్యం నష్ట పరిహారం చెల్లించలేదని బంధువులు మౌనపోరాటం చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రాజేంద్రనగర్లో మరో కిడ్నాప్ కలకలం