రాష్ట్రంలో 90 స్థానాలే లక్ష్యంగా.. బీజేపీ వ్యూహాలు

author img

By

Published : Dec 29, 2022, 9:12 PM IST

bjp

BJP Pracharak Training Classes In Shamirpet: ఎమ్మెల్యేలకు ఎర కేసులో తన పేరును ఇంటింటికీ తీసుకెళ్లినవారే ఆరోపణలపై జవాబు చెప్పాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్ స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు చేసినవారు పర్యవసానాలు ఎదుర్కొనక తప్పదని.. ఆయన హెచ్చరించారు. రాష్ట్ర అసెంబ్లీలో 90 స్థానాలే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో మరింత బలపడాలని స్థానిక నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో 90 స్థానాలే లక్ష్యంగా.. బీజేపీ వ్యూహాలు

BJP Pracharak Training Classes In Shamirpet: తెలంగాణ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో 90 స్థానాలు గెలవడమే లక్ష్యంగా మరింత గట్టిగా పనిచేయాలని బీజేపీ అగ్రనాయకులు.. తెలంగాణ నాయకత్వానికి ఉద్బోధించారు. ఈ మేరకు శామీర్‌పేటలో జరిగిన బీజేపీ ప్రచారక్ శిక్షణ తరగతులకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, సునీల్ బన్సల్‌.. ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మిషన్ 90 పేరుతో ప్రత్యేకంగా జరిగిన ఈ సమావేశంలో నేతలకు.. బీఎల్‌ సంతోష్‌ దిశానిర్దేశం చేశారు.

ఒక్కో నియోజకవర్గంలో.. ప్రభారి, కన్వీనర్, పాలక్, విస్తారక్ అని నియమించగా.. అందరూ సమన్వయంతో పనిచేయాలని బీఎల్ సంతోష్ సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు ఎర కేసుపై స్పందించిన బీఎల్‌ సంతోష్‌.. తనపై ఆరోపణలు చేసిన వారే సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఆరోపణలు చేసిన వారు పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించినట్లు సమాచారం. ప్రజలకు తానెవరో తెలియకపోయినా.. ప్రతి ఇంటికి తన పేరు తీసుకెళ్లారని సంతోష్‌ చెప్పినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని సమావేశం తర్వాత ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల బాధ్యుడు తరుణ్ చుగ్ అన్నారు.

"తెలంగాణ ప్రజలు అహంకారి, కుటుంబ రాజకీయవాది, అవినీతిమయమైన కేసీఆర్‌ సర్కార్‌ను తప్పించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలు నవంబరులో వచ్చినా, డిసెంబరులో వచ్చినా, 2024 లోక్‌సభ ఎన్నికలు వచ్చినా తెలంగాణలో టీఆర్ఎస్/బీఆర్‌ఎస్‌ పోయి బీజేపీ వస్తుంది." - తరుణ్ చుగ్, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌

రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా వ్యూహాల అమలు: తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసి.. 90 స్థానాల్లో విజయం సాధిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విశ్వాసం వ్యక్తంచేశారు. తమ పార్టీకి అభ్యర్థులేరని.. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్న బీజేపీ.. ఆ దిశలో మరో అడుగు వేసింది. రాష్ట్రంలోని 119 నియోజక వర్గాలకు పాలక్‌లను ప్రకటించింది.

కుత్బుల్లాపూర్‌కు డీకే అరుణ, ఎల్లారెడ్డికి రఘునందన్ రావు, రామగుండంకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కల్వకుర్తికి రాంచందర్ రావు,.. వరంగల్ తూర్పునకు.. ఈటల రాజేందర్, ములుగుకు సోయం బాపూరావు, మేడ్చల్‌కు లక్ష్మణ్, శేరిలింగంపల్లికి కిషన్ రెడ్డి, పరిగికి విజయశాంతి, మెదక్‌కు ధర్మపురి అర్వింద్‌లను పాలక్‌లుగా నియమించింది. ప్రతి నెల పాలక్‌లు.. మూడు రోజులు తప్పకుండా నియోజకవర్గంలో పనిచేయాలని బీజేపీ ఆదేశించింది.

కేసీఆర్ బిహర్‌లో, తమిళనాడు, కేరళ, కర్నాటకలో ఎక్కడా ఎన్నికలు జరిగినా నాయకులకు డబ్బులు ఇస్తారు. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి డబ్బులు ఇస్తారు. కానీ రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అందుకే ప్రజలను మార్పును కోరుకుంటున్నారు. రాష్ట్రంలో 90 స్థానాలు కచ్చితంగా గెలుస్తాం. - బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి: బీఆర్‌ఎస్‌ సర్కార్‌, నాయకులు ప్రజాస్వామ్యానికి శాపం: బీఎల్‌ సంతోష్‌

బుద్ధగయలో దలైలామా.. నిఘా పెట్టిన 'చైనా మహిళ'.. పోలీసులు అలర్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.