ETV Bharat / state

YS Sharmila Deeksha: వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకు వద్దు: వైఎస్​ షర్మిల

author img

By

Published : Dec 11, 2021, 4:36 PM IST

మెదక్‌ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు రవికుమార్‌ కుటుంబాన్ని వివిధ పార్టీల నేతలు పరామర్శించారు. మృతుని కుటుంబానికి అండగా ఉంటానని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అన్నారు. మరోవైపు రవికుమార్​ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని వైతెపా అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. బొగుడ భూపతిపూర్‌లో రవి కుటుంబసభ్యులను పరామర్శించిన షర్మిల... ఇంటి వద్ద దీక్ష చేపట్టారు. రైతు కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

YS Sharmila Deeksha: వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకు వద్దు: వైఎస్​ షర్మిల
YS Sharmila Deeksha: వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకు వద్దు: వైఎస్​ షర్మిల

మెదక్ జిల్లా బొగుడ భూపతిపూర్‌లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పరామర్శించారు. రవికుమార్ కుమారుడు, తండ్రి, కుటుంబసభ్యులతో ఫోన్​లో మాట్లాడిన రేవంత్‌.... అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రవికుమార్ కుమారుడి వైద్య చికిత్సకు సాయం చేస్తామని... ఆయన తండ్రికి పింఛను వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు.

రవికుమార్ కుమారుడి వైద్య చికిత్సకు సాయం చేస్తాం: రేవంత్

తమ కుటుంబ సమస్యల గురించి రవికుమార్​ కుమార్తై రేవంత్​రెడ్డికి వివరించింది. ఐదెకరాల్లో వరి పంట వేస్తే దిగుబడి రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తమ కుటుంబానికి ఎప్పుడూ కష్టాలేనని బాధపడింది. తమ్ముడికి ఆరోగ్యం కూడా బాగా ఉండట్లేదని బాధను వెలిబుచ్చింది. ఈ నేపథ్యంలో రేవంత్​ రెడ్డి వారిని ఓదార్చారు. రవికుమార్​ కుటుంబానికి సాయం చేస్తానని హామీ ఇచ్చారు.

మెదక్ జిల్లాలో రైతు కుటుంబానికి రేవంత్‌రెడ్డి పరామర్శ

వైఎస్​ షర్మిల దీక్ష భగ్నం

వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకు వద్దని వైఎస్సార్​ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. కేసీఆర్ యాసంగిలో వరి వేయెుద్దని అనడంతోనే రవికుమార్(40) అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. మెదక్ జిల్లా హవేలిఘనపూర్ మండలం బొగుడ భూపతిపూర్ గ్రామంలోని రవికుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని దీక్షలో కూర్చున్నారు. షర్మిల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. మూడున్నర గంటల పాటు దీక్ష చేశారు. షర్మిలతో పాటు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

రవికుమార్​ లేఖలో తన పొలంలో వరి తప్ప మరే పంట పండదని.. కానీ ఇప్పుడు వరి వేయొద్దని అంటున్నారనే ఆవేదన కనిపించిందని షర్మిల వెల్లడించారు. ఇప్పటికే పెట్టుబడి ఎక్కువైందని.. నష్టాలపాలైనట్లు రవికుమార్​ లేఖలో రాశారన్నారు. తన భూమిలో వేరే పంట వేసే పరిస్థితి లేదని.. వరి వేసుకోకపోతే తాను ఉరి వేసుకోవాలి అంటూ బాధతో రాశాడని వైఎస్​ షర్మిల తెలిపారు. తెరాస సర్కారు వానాకాలం వడ్లు కొనకపోవడం, యాసంగి వరి వేయొద్దని చెప్పడంతో దాదాపు 30 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆమె ఆరోపించారు. కామారెడ్డి జిల్లాలో చిన్న బీర్లయ్య వరి కుప్పపైనే కుప్ప కూలిపోయాడని.. అదే జిల్లాలో రాజయ్య ఆ కుప్పల మీదే చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.

వరి వేయొద్దనే హక్కు కేసీఆర్​కు ఎక్కడిది?

మద్దతు ధరకు వరి కొనుగోలు చేస్తామని తెరాస ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వరి వేయవద్దనే హక్కు కేసీఆర్​కు ఎక్కడిదని వైఎస్​ షర్మిల ప్రశ్నించారు. ఒకసారి రైతులకు హామీనిచ్చిన తర్వాత వరి పంట కొనాల్సిన బాధ్యత మీకు లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ అన్న కేసీఆర్​... రైతులకు బతుకే లేకుండా నిరంకుశ పాలన చేస్తున్నారని షర్మిల విమర్శించారు. ఇది న్యాయమేనా అంటూ ప్రశ్నించారు. వానాకాలం వడ్లతో పాటు యాసంగి వడ్లు కూడా కేసీఆర్ కొనాల్సిందే అని డిమాండ్ చేశారు. రైతు ఎన్ని వడ్లు పండించినా వాటికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్​ చేశారు. అన్ని బాధ్యతలు తీసుకొచ్చి మీద వేస్తే రైతు ఏమిచేస్తాడని మండిపడ్డారు.

ఇది ప్రభుత్వ హత్యే..

వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకు వద్దు. ఇది ఒక నినాదం కావాలి. ఆత్మహత్యకు పాల్పడిన రవికుమార్ కుటుంబ సభ్యులను కలిశాం. చాలా దయనీయ పరిస్థితిలో ఆ కుటుంబం ఉంది. రవికుమార్ భార్యకు గుండెనొప్పి ఉంది. తల్లిదండ్రులు వృద్ధులు. రవికుమార్​కు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు. ఒక బిడ్డ పెండ్లి చేశాడు. ఇంకో బిడ్డ చదువుకుంటోంది. కొడుకు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. హిమా ఫాలింగ్ వ్యాధి వల్ల రక్తం వస్తే ఆగే పరిస్థితి ఆ అబ్బాయికి లేదు. ఆ అబ్బాయికి మెడికల్ ఖర్చు చాలా అవుతుంది. రవికుమార్ కుటుంబానికి దాదాపు రూ.50 లక్షల వరకు అప్పులే ఉన్నాయి. వరి వేసుకోవద్దంటే ఇంకో దారి మాకు లేదని రవికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఆత్మహత్య కాదు. కేసీఆర్ చేసిన హత్యే. ఆత్మహత్య చేసుకున్న రవికుమార్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత కేసీఆర్​పై ఉంది. ఇంత వరకు కలెక్టర్ రాలేదు. ఎమ్మెల్యే వచ్చిందంట. భిక్షమేసినట్టు పది వేల రూపాయలు ఇచ్చారు. ఇదేమైనా మెహర్బానీ అనుకుంటున్నారా..?. ఆ కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా..?. రవికుమార్ కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించేంత వరకు ఇక్కడే కూర్చుని నిరాహార దీక్ష చేస్తా. -వైఎస్​ షర్మిల, వైఎస్సార్​ తెలంగాణ పార్టీ అధినేత్రి

వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకు వద్దు: వైఎస్​ షర్మిల

ఇదీ చదవండి:

Bhupatipur Farmer Suicide : సీఎం కేసీఆర్​కు లేఖ రాసి రైతు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.