సింగూరు కాలువ అంచనా రూ.2 వేలకోట్లు తగ్గింది.. ఎందుకంటే?

author img

By

Published : Sep 16, 2021, 1:38 PM IST

singur

సింగూరు కాలువల అంచనా వ్యయం భారీగా తగ్గింది. రూ.6,500 కోట్ల నుంచి రూ.4,400 కోట్లకు తగ్గినట్లు తెలిసింది.

సింగూరు కాలువ అంచనా వ్యయం రూ. 6,500 కోట్ల నుంచి రూ.4,400కోట్లకు తగ్గినట్లు సమాచారం. సింగూరు నుంచి ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 3.84 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే పని అంచనా వ్యయాన్ని నీటిపారుదలశాఖ పరిశీలించింది. పలు పనులకు అంచనాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పడంతో ఈ మేరకు మార్పులు చేసినట్లు సమాచారం. అయితే, ఇది ఏకంగా రూ.రెండువేల కోట్లకు పైగా తగ్గినట్లు తెలిసింది. సింగూరు నుంచి రెండు ఎత్తిపోతలు, కాలువల ద్వారా 20 టీఎంసీల నీటిని ఎత్తిపోసే ఈ పనులకు సుమారు రూ.6,500 కోట్ల వ్యయమవుతుందని సంబంధిత ఇంజినీర్లు అంచనా వేశారు.

కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా మళ్లించే నీటిని సింగూరుకు పంపి అక్కడి నుంచి సంగమేశ్వర ఎత్తిపోతల ద్వారా 12 టీఎంసీలతో 2.19 లక్షల ఎకరాలకు, బసవేశ్వర ద్వారా ఎనిమిది టీఎంసీలతో 1.65 లక్షల ఎకరాలకు నీరందించడానికి ఇంజినీర్లు అంచనాలు తయారు చేశారు. వీటిని పరిశీలించిన ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌.. ఎక్కువగా ఉన్నాయని, పలుమార్పులు చేయాలని సూచించడంతో అంచనాలను సవరించినట్లు సమాచారం. మొదట కాలువలకు లైనింగ్‌ ఉండేలా ప్రతిపాదించగా.. తాజాగా దాన్ని తొలగించినట్లు తెలిసింది.

ఎత్తిపోతలకు ఒక్కో మెగావాట్‌కు అయ్యే వ్యయ అంచనాను రూ.కోటి 40 లక్షల నుంచి రూ.కోటి పది లక్షలకు తగ్గించినట్లు సమాచారం. డిస్ట్రిబ్యూటరీ, పిల్లకాలువల పనికి ఎకరాకు పేర్కొన్న రూ.22 వేలు ఖర్చును రూ.17 వేలకు తగ్గించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ప్రెషర్‌మెయిన్‌ను తగ్గించి అప్రోచ్‌కాలువను ఎక్కువ చేయనున్నట్లు సమాచారం. భూసేకరణకు అయ్యే రూ.800 కోట్ల వ్యయాన్నీ అంచనా నుంచి తొలగించినట్లు తెలిసింది. ఇలా పలు మార్పులతో అంచనా వ్యయం భారీగా తగ్గినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: ‘సింగూరు కాలువ ద్వారా.. కాళేశ్వరం జలాలు అందిస్తాం’

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.