ETV Bharat / state

Revanth reddy comments on KCR: కేసీఆర్ ఆ పని చేసిఉంటే.. ఏపీ సీఎం జగన్​తో జల వివాదం ఉండేదా?

author img

By

Published : Oct 13, 2021, 8:08 AM IST

Updated : Oct 13, 2021, 8:26 AM IST

pcc-chief-revanth-reddy-allegations-on-cm-kcr-that-is-kcr-selfishness-is-the-curse-to-irrigation-projects
pcc-chief-revanth-reddy-allegations-on-cm-kcr-that-is-kcr-selfishness-is-the-curse-to-irrigation-projects

పాలమూరు వెనుకబాటుతనానికి సీఎం కేసీఆర్‌నే బాధ్యుడని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టులను ఆయన నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూరు మండలం అమిస్తాపూర్‌లో మంగళవారం విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌ సభలో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ జంగ్ సైరన్

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వల్లే ప్రస్తుతం పాలమూరు పొలాలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెరాస అధికారంలోకి వచ్చాక పాలమూరును అభివృద్ధి చేయాల్సిందిపోయి.... ఎడారిగా మార్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రాజెక్టులను ఆయన నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఈ ఏడేళ్లలో వాటిని పూర్తి చేసి ఉంటే వివాదాలకు ఆస్కారమే ఉండేది కాదన్నారు. అవి అక్రమమని, అనుమతులు లేవని పేర్కొంటూ ఏపీ సీఎం జగన్‌ కేంద్రానికి ఫిర్యాదు చేయడానికి అసలు వీలుండేది కాదన్నారు. సీఎం కేసీఆర్‌ స్వార్థం, దోపిడీ, అవినీతే ఇందుకు కారణమని విమర్శించారు. పాలమూరు వెనుకబాటుతనానికి ఆయనే సీఎం కేసీఆర్‌. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూరు మండలం అమిస్తాపూర్‌లో మంగళవారం విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌ సభలో మాట్లాడారు.

మంత్రి పదవుల కోసమే మిన్నకున్నారా?

‘‘2004లో కాంగ్రెస్‌ హయాంలో రాష్ట్రంలో అరడజను, కేంద్రంలో రెండు మంత్రి పదవులు తీసుకున్న కేసీఆర్‌ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. అప్పుడు కృష్ణా జలాలను రాయలసీమకు తరలించుకుపోతే ఎందుకు ప్రశ్నించలేదు? వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మంత్రి పదవుల కోసమే మిన్నకున్నారా? సమైక్యవాదులతో ఆయన చీకటి ఒప్పందాలు నచ్చకనే 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో తెరాస 16 చోట్ల పోటీ చేస్తే ఏడుగుర్నే ప్రజలు గెలిపించారు. 2009లో తెదేపాతో పొత్తు పెట్టుకుని 45 ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేస్తే పది మందే గెలిచారు. 35 సీట్లలో డిపాజిట్లు కోల్పోయారని, తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని శాసనసభలో నాడు వైఎస్‌ అడిగినప్పుడు మీ పౌరుషం ఎక్కడికి పోయింది?’’ అని కేసీఆర్‌ను రేవంత్‌ ప్రశ్నించారు.

తెరాస అధికారంలోకి వచ్చాక ఇసుక దందాలు

‘ఒకప్పుడు పాలమూరు జిల్లా అంటే సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు తదితరులు గుర్తుకు వచ్చేవారు. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక దందాలు, భూ కబ్జాదారులు, కమీషన్ల కోసం పాకులాడే ఎంపీలు, ఎమ్మెల్యేలు పాలమూరు జిల్లా పరువును గంగలో కలిపారు. రూ. 4 వేల కోట్ల ఫీజు రీఇంబర్స్‌మెంటు ఇవ్వాలన్నా, 1.91 లక్షల ఉద్యోగాలు రావాలన్న కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలి’

-రేవంత్‌రెడ్డి

కృష్ణాపై ఒక్క ప్రాజెక్టూ కట్టని తెరాస: భట్టి

నీళ్ల కోసం తెలంగాణ తెచ్చుకుంటే కృష్ణా నది మీద తెరాస ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదని కాంగ్రెస్‌ పార్టీ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలోనే జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులు కట్టామని చెప్పారు. రోజుకు 11 టీఎంసీలు తరలించేలా సంగమేశ్వరం వద్ద ఏపీ ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్టుపై ఏడాది కిందటే హెచ్చరించినా పట్టించుకోలేదన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే శ్రీశైలం, నాగర్జునసాగర్‌కు నీళ్లు రావడమే కష్టమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు మధుయాస్కీ, షబ్బీర్‌ అలి, గీతారెడ్డి, నాగం జనార్దన్‌ రెడ్డి, చిన్నారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్‌, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్‌, మల్‌రెడ్డి రంగారెడ్డి, వేంరెడ్డి నరేందర్‌రెడ్డి, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కాన్వాయ్‌ను అడ్డుకోవడంతో ఉద్రిక్తత

జడ్చర్ల ప్లైఓవర్‌ నుంచి కొత్త బస్టాండ్‌ మీదుగా మహబూబ్‌నగర్‌కు రేవంత్‌రెడ్డి వస్తుండగా పోలీసులు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని బారికేడ్లు పెట్టారు. ఒక్కసారిగా కార్యకర్తలు బారికేడ్లు తీసివేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం ఆయన మహబూబ్‌నగర్‌కు బయలు దేరారు. ఈ సందర్భంగా కాన్వాయ్‌లోని ఓ వాహనం అద్దాలు పగిలిపోయాయి. మహబూబ్‌నగర్‌ శివారులోనూ బారికేడ్లు ఏర్పాటు చేయగా వాటిని తొలగించి రేవంత్‌రెడ్డి, కార్యకర్తలు ముందుకు వెళ్లారు. ఇదే క్రమంలో జిల్లా పార్టీ కార్యాలయానికి వెళ్లకుండా అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. అయినా డీసీసీ కార్యాలయానికి వెళ్లి ఆయన జెండాను ఎగురవేశారు.

ఇదీ చదవండి: Saddula Bathukamma 2021: గడగడపనా పూల సంబురం.. బతుకు పండుగకు నీరాజనం!

Last Updated :Oct 13, 2021, 8:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.