ETV Bharat / state

NGT on Palamuru Rangareddy Project: 'పాలమూరు-రంగారెడ్డి'కి ఎన్జీటీ బ్రేక్​...

author img

By

Published : Oct 30, 2021, 6:56 AM IST

Updated : Oct 30, 2021, 10:34 AM IST

పర్యావరణ అనుమతులు పొందేదాకా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేయాలని చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అనుమతుల్లేకుండా ముందుకెళ్తే పర్యావరణానికి పూడ్చలేని నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు లభించేదాకా పనులను చేపట్టరాదని తెలిపింది.

ngt
ngt

పర్యావరణ అనుమతులు పొందేదాకా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్‌ఎల్‌ఐఎస్‌) పనులపై ముందుకెళ్లరాదంటూ చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) శుక్రవారం తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రాథమిక ఆధారాలతో సంతృప్తి చెందిన ఎన్జీటీ ఈ పథకం పనులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం అనుమతుల్లేకుండా ముందుకెళ్తే పర్యావరణానికి పూడ్చలేని నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. కేంద్ర పర్యావరణ శాఖ వద్ద అనుమతుల కోసం చేసిన దరఖాస్తుకు ఆమోదం లభించేదాకా పనులను చేపట్టరాదంది. పనులు ప్రారంభించిన ఆరేళ్లకు పిటిషన్‌ వేశారని, కాలపరిమితి ముగిసినందున విచారణార్హం కాదన్న తెలంగాణ వాదనను తిరస్కరించింది. సంయుక్త కమిటీ నివేదికపై అభ్యంతరాలుంటే దాఖలు చేయవచ్చంటూ.. తదుపరి విచారణను నవంబరు 24వ తేదీకి వాయిదా వేసింది.

పీఆర్‌ఎల్‌ఐఎస్‌ పనులు చట్టవిరుద్ధంగా కొనసాగుతున్నాయంటూ ఏపీ రైతులు చంద్రమౌళీశ్వరరెడ్డి మరో 8 మంది పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఎన్జీటీ జ్యుడిషియల్‌ సభ్యులు జస్టిస్‌ కె.రామకృష్ణన్‌, డాక్టర్‌ కె.సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం ఈనెల 7న వాదనలు విని శుక్రవారం ఉత్తర్వులను వెలువరించింది. ప్రాజెక్టు 2015లో ప్రారంభమైందని, ఆరు నెలల్లో పిటిషన్‌ వేయాల్సి ఉండగా ఆరేళ్ల తరువాత దాఖలు చేసినందున అది విచారణార్హం కాదన్న తెలంగాణ వాదనను తోసిపుచ్చింది. గతంలో ఇదే అంశంపై హర్షవర్ధన్‌ అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారని, అప్పట్లో తాగునీటి అవసరాలకేనంటూ తెలంగాణ హామీని రికార్డు చేసిన విషయాన్ని ప్రస్తావించింది. అనుమతుల్లేకుండా ప్రాజెక్టును కొనసాగించరాదంటూ గత ఏడాది జూన్‌లో కేంద్రం, అపెక్స్‌ కౌన్సిల్‌లు ఆదేశాలు జారీ చేశాయని పేర్కొంది. అప్పటినుంచి 6 నెలల్లోగా పిటిషన్‌ దాఖలు చేయవచ్చంది. ఈ పిటిషన్‌ను ఈ ఏడాది జులైలో దాఖలు చేశారని, కొవిడ్‌ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఏడాది కాలాన్ని మినహాయిస్తే దీని కాలపరిమితి ముగిసిపోలేదని పేర్కొంది. అందువల్ల పిటిషన్‌ విచారణార్హమేనని ధర్మాసనం తేల్చి చెప్పింది.

కాలువలు తప్ప ఏమీ మిగలవు...

‘‘తాగునీటి అవసరాలకే పనులు చేపడుతున్నామన్న తెలంగాణ హామీని గతంలో ఈ ట్రైబ్యునల్‌ అనుమతించింది కానీ కేసు పూర్వాపరాల్లోకి వెళ్లలేదు. తాగునీటి అవసరాలకు ఎంత నీరు కావాలి? అందుకే ఈ పనులు చేపడుతున్నారా? అనే అంశాలను అప్పట్లో పరిశీలించలేదు. వీటిని తెలుసుకోవడానికి సంయుక్త కమిటీని ఏర్పాటు చేశాం. కమిటీ నివేదిక ప్రకారం తాగునీటికి అవసరమైన 7.5 టీఎంసీల కోసం 90 టీఎంసీల సామర్థ్యంతో 6 రిజర్వాయర్లు నిర్మించాల్సిన పనిలేదు. తాగునీటికే కాకుండా నీటిపారుదల కోసం ప్రభుత్వం పనులు చేపట్టింది. ప్రస్తుతం అనుమతుల కోసం దరఖాస్తు చేసింది. ఇది సమీకృత ప్రాజెక్టు అయితే తాగు, నీటి పారుదల ప్రయోజనాలు ఉంటాయి. పర్యావరణ అనుమతుల మినహాయింపు నిమిత్తం ప్రాజెక్టులో కొంత భాగాన్ని విడదీయలేం. మొత్తం ప్రాజెక్టు ప్రయోజనాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. ఇది కేవలం తాగునీటి అవసరాలకేనన్న తెలంగాణ వాదనను అంగీకరించి 90 టీఎంసీల ప్రాజెక్టు పనుల కొనసాగింపునకు అనుమతిస్తే తరువాత నీటిపారుదల అవసరాల పనులకు కాలువలు తప్ప ఏమీ మిగలవు. ఎత్తిపోతల పథకంలో రిజర్వాయర్లు అంతర్భాగం. నీటిపారుదల అవసరాలు లేకపోతే వీటి వల్ల ప్రయోజనం లేదు. అంతేగాకుండా సంయుక్త కమిటీ నివేదిక ప్రకారం 120 టీఎంసీల నీటి ఎత్తిపోతల కోసం పంపులు బిగిస్తున్నారు. అందువల్ల సమీకృత ప్రాజెక్టుగా పరిగణించి పనులకు ముందు పర్యావరణ అధ్యయనాన్ని నిర్వహించకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అంతేగాకుండా గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోనే పర్యావరణ చట్టాలను ఉల్లంఘించి పరిహారం చెల్లించారు. తాగునీటిని అందించడం ప్రభుత్వ బాధ్యత అయినప్పటికీ పర్యావరణ చట్టాలను ఉల్లంఘించరాదు. ఒకసారి దరఖాస్తు సమర్పించాక పర్యావరణ అనుమతులు అవసరం లేదని వెనక్కి వెళ్లరాదు. సంయుక్త కమిటీలో ఇద్దరు సభ్యులు ప్రాజెక్టు కేవలం తాగునీటి అవసరాలకేనంటూ విభేదించినా మిగిలినవారంతా సమీకృత ప్రాజెక్టుగానే అభిప్రాయపడ్డారు. పనులను కొనసాగిస్తే పర్యావరణ నోటిఫికేషన్‌కు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వాన్ని నియంత్రించకపోతే పర్యావరణానికి నష్టం వాటిల్లుతుంది’’ అని ధర్మాసనం పేర్కొని పర్యావరణ అనుమతులు పొందేదాకా పనులను కొనసాగించరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రాజెక్టులపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదన్న డీకే అరుణ..

కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేక పోవడం వల్లనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై ఎన్జీటీ స్టే ఇచ్చిందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. కృష్ణా నదిని పక్క రాష్ట్రానికి కట్టబెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. దక్షిణ తెలంగాణను ఎడారి చేయాలనే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్జీటీ ముందు బలమైన వాదనలు వినిపించకపోవడం వల్లే స్టే వచ్చిందని అన్నారు. కృష్ణా పూర్తిగా దారిమళ్లిపోతే గోదావరిపై మరిన్ని లిఫ్టులు పెట్టి దోచుకోవాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. రీ డిజైన్ చేసి కమీషన్లు దండుకోవడం తప్ప కేసీఆర్‌కు ప్రాజెక్టులపై చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.

Last Updated : Oct 30, 2021, 10:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.