పచ్చటి పచ్చిక బయళ్లు, అందమైన పూల మొక్కలు, ఆహ్లాదకర వాతావరణం, అరకను పట్టిన రైతన్న ప్రతిమ, ఒంగోలు జాతి ఎద్దుల ప్రతిమలు, ఎడ్ల బండి ఇవన్ని చూస్తే ఉద్యావనంలా కనిపిస్తోంది కదూ.. కానీ ఇది ఉద్యానవనం కాదు. ఆరుగాలం కష్టపడి మన ఆకలి తీర్చే అన్నదాత రైతు వేదిక. ప్రభుత్వ సాయం, దాతల విరాళంతో దాదాపు రూ.40లక్షలతో రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా అత్యాధునిక సౌకర్యాలతో జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ మండలం ఉత్తనూర్ రైతు వేదికను నిర్మించారు.
అత్యాధునిక డిజిటల్ సౌకర్యాలు..
రైతు వేదిక ప్రాంగణంలోకి అడుగుపెట్టిన రైతన్నను.. మైమరిపించే విధంగా, వ్యవసాయాధికారులు విధులు నిర్వహించుకునేందుకు అనువుగా, అత్యాధునిక డిజిటల్ సౌకర్యాలతో వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలతో రైతు వేదికను ఏర్పాటు చేశారు. దీనికి రూ.22 లక్షల ప్రభుత్వ నిధులు, మరో రూ. 18.50లక్షల దాతలు అందించిన నిధులు ఖర్చు చేశారు. రాష్ట్రానికే ఆదర్శంగా ఉండేలా ప్రత్యేకంగా నిర్మించి.. సుందరంగా ముస్తాబు చేసి, ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు.
రాష్ట్రంలోనే మోడల్ రైతువేదికగా..
ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీల వివరాలు, రైతుబంధు, రైతుబీమా వివరాలు ఈ వేదిక ద్వారానే చర్చించనున్నారు. ప్రత్యేకమైన సౌండ్ సిస్టం, స్టీల్ రేయిలింగ్, పచ్చిక బయళ్లు, మొక్కలు, ఎద్దుల ప్రతిమలు, ఫెన్సింగ్, రెడ్ సాయల్ గ్యావలింగ్ , ప్రభుత్వ లోగో తదితర అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఉత్తనూర్ రైతు వేదికను రాష్ట్రంలోనే మోడల్ రైతువేదికగా తీర్చిదిద్దారు.
రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ రైతు వేదికను పురపాలక మంత్రి కేటీఆర్ ప్రారంభించాలని గ్రామస్థులు ఆశిస్తున్నారు.
ఇవీ చూడండి: దసరా రోజున రైతు వేదికలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు: మంత్రి ఎర్రబెల్లి