ETV Bharat / state

IT Corridar: ప్రారంభోత్సవానికి సిద్ధమైన మహబూబ్‌నగర్‌ ఐటీ టవర్‌

author img

By

Published : May 4, 2023, 9:11 AM IST

IT Corridar
IT Corridar

Mahabubnagar IT Tower Ready For Launch: మహబూబ్‌నగర్‌లోని ఐటీ టవర్‌ని మే 6వ తేదీన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఐటీ సేవల ప్రారంభంతో ఉపాధికల్పనపై నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పారిశ్రామికవాడ పనులు పూర్తైతే ప్రతక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.

ప్రారంభానికి సిద్ధమైన మహబూబ్‌నగర్‌ ఐటీ టవర్‌

Mahabubnagar IT Tower Ready For Launch: ద్వితీయశ్రేణి నగరాల్లో సాఫ్ట్‌వేర్‌ సేవల విస్తరణ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అందులో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లా ఎదిర, దివిటిపల్లి వద్ద 2018 జులై 7న శంకుస్థాపన చేసిన ఐటీ, మల్టీపర్పస్‌ ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ పనులు తుదిదశకు చేరాయి. యువతకు ఉపాధి కల్పన కోసం అయిదెకరాల్లో చేపట్టిన ఐటీ టవర్‌ నిర్మాణపనులు పూర్తయ్యాయి. ఆ టవర్‌లో సంస్థల ఏర్పాటుకు అమెరికా, లండన్‌కు చెందిన సంస్థలు ముందుకొచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరికొన్ని సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది.

10 వేల మందికి ఉపాధి లభించే అవకాశం: 40 కోట్లతో నాలుగు అంతస్థుల్లో నిర్మించిన ఐటీ టవర్‌లో 19 వేల 370 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. పారిశ్రామికవాడ పనులు పూర్తైతే 100కు పైగా ఐటీ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనా. నాలుగేళ్ల పాటు స్థానికులకు ఏటా 10 వేల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఐటీ రంగం అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. పరోక్షంగా మరో 10 వేల మందికి ఇక్కడ ఉపాధి లభించే అవకాశముందని చెబుతోంది. ఇక్కడ ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

అమెరికా, లండన్‌లో స్థిరపడిన వారు ఇక్కడకి వచ్చేయండి: అందులో సాధారణ డిగ్రీ, పీజీ కోర్సులు చదివిన వారికి సాఫ్ట్‌వేర్‌ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఐటీ టవర్‌, అమరరాజాతో పాటు, ఇతర పరిశ్రమల ఏర్పాటు పూర్తైతే మహబూబ్‌నగర్‌ రూపురేఖలు పూర్తిగా మారే అవకాశముందన్న అభిప్రాయ వ్యక్తమవుతోంది. ఉద్యోగాలకు ఇతర దేశాలకు వెళ్తున్న యువతకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న కల సాకారం కానుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. అమెరికా, లండన్‌లో స్థిరపడిన వారు ఇక్కడకి వచ్చి కంపెనీలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు.

371 ఎకరాల్లో చేపట్టిన ఐటీ, మల్టీపర్పస్‌ ఇండస్ట్రీయల్‌ కారిడార్‌లో ఐటీ టవర్‌ నిర్మాణానికి అయిదేళ్లు పట్టింది. తొలి ఏడాదిలో ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు 18 సంస్థలు ముందుకొచ్చినా.. ఇప్పటి వరకు ఏ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించలేదు. ఐటీ టవర్‌ అందుబాటులోకి రావడం వల్ల సాప్ట్‌వేర్‌ సంస్థలు కార్యకలాపాలు మొదలు పెట్టేందుకు మార్గం సుగమం అవుతుంది.

'ఇక్కడ దాదాపు 400 ఎకరాల్లో మెగా ఐటీ ఇండస్ట్రీయల్ కారిడార్ బిల్డింగ్ పూర్తయింది. విదేశాలలో ఉన్నటువంటి మా మహబూబ్​నగర్ వాళ్లతో మాట్లాడుతున్నాం. మీరు ఇక్కడ కంపెనీలు పెట్టుకోండి. విదేశాలలో ఎంత సంపాదిస్తున్నారో.. ఇక్కడ కూడా అంత కల్పిస్తున్నామని చెప్పి, లాండన్​లో కూడా చాలామంది మహబూబ్​నగర్​ వారితో మాట్లాడడం జరిగింది. భవిష్యత్తులో 20-30 వేల మందికి ఉద్యోగాలు వచ్చేలాగా చూస్తాం.' -శ్రీనివాస్ ​గౌడ్​, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.