ETV Bharat / state

పూజల పేరుతో మహిళల నగ్న ఫొటోలు తీశారు.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు

author img

By

Published : Feb 23, 2023, 10:36 PM IST

Fraudsters Cheat with Nude Photos: ప్రస్తుత ఆధునిక కాలంలో ఎంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందో అంతకంటే ఎక్కువే దుర్వినియోగమవుతోంది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఆశతో.. ఎదుటివారి అమాయకత్వాన్ని, బలహీనతలను సొమ్ము చేసుకుంటూ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. వారికి తగినట్లు పోలీసులు తమ వ్యూహాలకు పదునుపెడుతూ కేటుగాళ్లను పట్టుకుంటున్నారు. తాజాగా మహబూబ్​నగర్​లో నగ్న ఫొటోల పేరుతో నయా దందాకు తెరలేపిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Fraudsters Cheat with Nude Photos
Fraudsters Cheat with Nude Photos

Fraudsters Cheat with Nude Photos: మహబూబ్​నగర్​ జిల్లాలో చర్చనీయాంశంగా మారిన మహిళల నగ్న ఫొటోల వ్యవహారంలో పోలీసులు ముందడుగు వేశారు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. నలుగురి నిందితులను విచారించగా కొన్ని విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. ప్రధాన నిందితుడు దొరికితే మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.

పూజకు ఎంపికైతే కోట్లు వచ్చిపడతాయి. కానీ ఆ పూజకు ఎంపిక కావాలంటే శరీరాకృతి చూపే నగ్నఫొటోలు అవసరమని చెప్పారు. అలా మాయ మాటలు చెప్పి 20 నుంచి 25 మంది అమాయక మహిళల ఫొటోలు సేకరించిన ముఠాను మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. అతని కోసం గాలింపు చేపడుతున్నామన్నారు. ఈ నెల 18న జడ్చర్ల పట్టణం పాతబజారులో గొడవ జరుగుతుందని డయల్-100కు ఫోన్​ వచ్చింది. అక్కడకు చేరుకున్న పోలీసులు ఓ మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మొదట జైనుల్లావుద్దీన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మహిళ ఫొటోలు తీశారన్న ఆరోపణపై అతన్ని విచారించగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వనపర్తికి చెందిన జైనుల్లావుద్దిన్ జడ్చర్లలో అద్దెకు నివాసం ఉంటున్నారు. ఆయనతో పాటు రాములు, శంకర్ అలీ, రాములు నాయక్ కలిసి మహిళల శరీరాకృతికి సంబంధించి నగ్న ఫోటోలు సేకరిస్తున్నారు. నిరుపేద మహిళల్ని ఎంచుకుని తమకు తెలిసిన గురువు ఉన్నారని.. ఆయన పూజకు ఎంపికైతే కోట్లలో డబ్బులు వస్తాయని ఆశచూపారు. పూజకు ఎంపిక కావాలంటే శరీరాకృతికి చెందిన నగ్నఫొటోలు తిరుపతి అనే వ్యక్తికి పంపాలని చెప్పారు.

అలా 2 నెలలుగా 20 నుంచి 25మంది మహిళల నగ్న ఫొటోలను సేకరించి తిరుపతికి పంపినట్లు దర్యాప్తులో తేలింది. అయితే పంపిన ఫొటోలు తిరుపతి ఏం చేస్తాడు ? తిరుపతి చెప్పిన గురువు ఎవరు ? ఈ ఫొటోలతో ఏం చేస్తారన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు వ్యక్తుల్ని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తిరుపతి అనే ప్రధాన నిందితుడిని పట్టుకుంటే అసలు విషయాలన్నీ బయటకు వస్తాయని, త్వరలోనే అతడిని పట్టుకుంటామని జడ్చర్ల సీఐ వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.