మంది మాటలు విని ఓటేస్తే ఐదేళ్లు ఇబ్బంది పడతాం : కేసీఆర్

మంది మాటలు విని ఓటేస్తే ఐదేళ్లు ఇబ్బంది పడతాం : కేసీఆర్
CM KCR at Praja Ashirvada Sabha at Palakurthi : తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఎవరు చేశారో ప్రజలు గుర్తుంచుకోవాలని కేసీఆర్ అన్నారు. పాలకుర్తి ప్రజా ఆశిర్వాద సభలో మాట్లాడిన ఆయన ప్రజలు గందరగోళానికి గురై ఓట్లు వేస్తే ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడాల్సి వస్తుందని సూచించారు.
CM KCR at Praja Ashirvada Sabha at Palakurthi : ప్రజలు ఎవరో చెప్పిన మాటలు విని ఆగమైతే ఐదేళ్ల పాటు కష్టాలపాలవుతామని బీఆర్ఎస్ అధిపతి కేసీఆర్ (KCR) హెచ్చరించారు. పాలకుర్తి ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ (BRS Party) పుట్టిందే తెలంగాణ ప్రజల బాగుకోసమన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైనా ఓటర్లలో రావాల్సినంతా పరిణతి రాలేదని పేర్కొన్నారు. ఎన్నికలు అనగానే ఎందరో వచ్చి ఏవేవో మాట్లాడుతున్నారని తెలిపారు. నియోజకవర్గం బాగుపడాలని ప్రతి ఒక్కరు కోరుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేసే ముందు అన్నీ ఆలోచించి ఓటు వేయాలని.. పార్టీల చరిత్ర, నడవడిక ఎలాంటిదో తెలుసుకొని అడుగువేయాలని సూచించారు.
'పదేళ్ల ముందు పాలకుర్తి ఎలా ఉంది.. ఇప్పుడెలా ఉందో ఆలోచించాలి. పదేళ్ల క్రితం పాలకుర్తి నుంచి వేలాదిమంది వలసపోయేవారు, ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి పాలకుర్తికి వచ్చి నాట్లు వేస్తున్నారు. ఏ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాయి.. అన్న విషయాన్ని ప్రజలు గమనించాలి'- కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత
CM KCR on Congress Past Ruling : పాలకుర్తికి లక్షా 30 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని కేసీఆర్ అన్నారు. రైతు బంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. వారిని ఏం చేయాలి అని ఓటర్లను ప్రశ్నించారు. 24 గంటలు కరెంట్ వద్దని.. 3 గంటలు చాలని పీసీసీ అధ్యక్షుడే (TPCC Chief Revanth Reddy) చెబుతున్నారని మండిపడ్డారు. నాయకుల మాటలు విని ప్రజలు గోల్మాల్ కాకూడదని తెలిపారు. 50ఏళ్ల పాటు కాంగ్రెస్ పరిపాలన చేసిందని.. దాని వల్ల ఎవరి వైన బతుకులు మారాయా అంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వస్తే ధరణి పోర్టల్ తీసేస్తామని రాహుల్, రేవంత్రెడ్డి అంటున్నారని విమర్శించారు.
'మంత్రిగా ఎర్రబెల్లి (Errabelli) ఏం చేశారో పాలకుర్తి ప్రజలు చూశారు. గిరిజన రిజర్వేషన్లు (Girijana Reservation) 10 శాతానికి పెంచుకున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన బంధు ఇస్తాం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా దళితులను ఆదుకుందా..? పాలకుర్తికి ఇంజినీరింగ్ కళాశాల ఇస్తాం'- కేసీఆర్, బీఆర్ఎస్ అధ్యక్షుడు
పాలకుర్తిలో ఎర్రబెల్లిని గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను కోరారు. ఆయన అడిగినవన్నీ ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పాలనలో తాగు, సాగునీరు కరెంట్ సంగతి ప్రజలకు తెలుసని గుర్తుచేశారు. రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్లాలన్నారు. అమెరికా నుంచి వచ్చేవారు ప్రజలకు టోపీ పెట్టి పోతారని సూచించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని ప్రజలను కేసీఆర్ కోరారు.
