ETV Bharat / state

దీక్షిత్ హత్యకు కారణమేంటి... అసలేం జరిగిందంటే?

author img

By

Published : Oct 22, 2020, 2:39 PM IST

మహబూబాబాద్‌ కిడ్నాప్‌ ఘటన విషాదాంతమైంది. అపహరణకు గురైన బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. దీక్షిత్‌రెడ్డిని కిడ్నాపర్‌ పొట్టనపెట్టుకున్నాడు. కేసముద్రం మండలం అన్నారం శివారులోని గుట్టపై బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నిందితుడు ఇంటిపక్కనే ఉండే మందసాగర్‌గా నిర్ధరించారు. ఒక్కసారిగా ధనవంతుడై పోవాలనే దురాశతోనే కిరాతకానికి ఒడిగట్టాడని పోలీసుల విచారణలో తేలింది.

mahabubabad-boy-kidnap-and-murder-brief-story
mahabubabad-boy-kidnap-and-murder-brief-story

ఐదు రోజులుగా అనేక మలుపులు తిరిగిన మహబూబాబాద్‌ కృష్ణాకాలనీకి చెందిన 9 ఏళ్ల బాలుడి కిడ్నాప్‌ ఘటన విషాదాంతమైంది. రంజిత్, వసంత పెద్ద కుమారుడు దీక్షిత్‌రెడ్డి.. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటివద్ద ఆడుకుంటుండగా దుండగుడు అపహరించాడు. బాలుడిని ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు.

కిడ్నాపర్‌ మంగళవారం రాత్రి బాలుడి తల్లికి ఫోన్ చేసి 45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కిడ్నాపర్లు చెప్పిన విధంగానే 35 లక్షల రూపాయల నగదు, కొంత బంగారాన్ని బ్యాగ్‌లో వేసుకొని బాలుడి తండ్రి రంజిత్‌.. కిడ్నాపర్లు చెప్పిన మూడుకోట్ల ప్రాంతానికి చేరుకున్నారు.

అంతలోనే ఆగంతకుడు మరోసారి పథకం మార్చాడు. మళ్లీ 9 గంటలకు మరో ప్రాంతానికి రావాలని ఫోన్ చేసి చెప్పాడు. బాలుడి తండ్రి అక్కడికి వెళ్లినా ఫలితం లేకుండాపోయింది. బాధిత కుటుంబం మహబూబాబాద్‌ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

బాలుడి కిడ్నాప్‌ కేసును ఎస్పీ కోటిరెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. ఆయన ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ యాంత్రాంగం విస్తృతంగా గాలింపు చేపట్టింది. బాలుడి ఆచూకీ కోసం 100 మందితో కూడిన 10 బృందాలు ఏర్పాటు చేసి వెతికారు. అపహరణకు గురైన కృష్ణా కాలనీని... వరంగల్ నుంచి వచ్చిన టాస్క్‌ఫోర్స్ బృందం.., హైద్రాబాద్ నుంచి ప్రత్యేకంగా వెళ్లిన ఐటీ కోర్ సిబ్బంది జల్లెడ పట్టారు.

ఐటీ కోర్ నిపుణులు, సైబర్ క్రైం నిపుణులు సీసీ కెమెరా దృశ్యాలను మరోసారి పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులను పట్టణ పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వాళ్లను విచారించారు. అయినా ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినా చివరకు ఘోరం జరిగిపోయింది. కేసముద్రం మండలం అన్నారం శివారులోని గుట్టపై బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

బాలుడి కిడ్నాప్ కేసు పురోగతిపై డీజీపీ మహేందర్‌రెడ్డి స్వయంగా మహబూబాబాద్‌ ఎస్పీ కోటిరెడ్డికి ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నట్లు తెలిసింది. ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో మంత్రి కేటీఆర్​ సైతం... ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. బుధవారం సాయంత్రం కిడ్నాపర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారించినట్లు తెలిసింది. ఇంతలోనే బాలుడు దారుణ హత్యకు గురయ్యాడనే వార్త తీవ్ర విషాదం నింపింది.

సంబంధిత కథనాలు...

  1. జర్నలిస్టు కుమారుడి కిడ్నాప్​.. రూ. 45 లక్షలు డిమాండ్!
  2. తండ్రి స్నేహితులే కిడ్నాప్‌ చేశారా?
  3. 24 గంటలు దాటినా లభించని బాలుడి ఆచూకీ
  4. మహబూబాబాద్‌లో అపహరణకు గురైన బాలుడు హత్య
  5. కిడ్నాప్ చేసిన గంటకే బాలుడి హత్య: ఎస్పీ కోటిరెడ్డి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.