తమ్మినేని కృష్ణయ్య హత్యకేసులో ఆరుగురి అరెస్టు

author img

By

Published : Aug 18, 2022, 10:42 AM IST

Tammineni krishnaiah murder update

Tammineni krishnaiah murder update మాజీ మంత్రి తుమ్మల ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. కృష్ణయ్య హత్యకు ఆయుధాలు సమకూర్చిన వారిని అదుపులోకి తీసుకుని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

Tammineni krishnaiah murder update : రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్యకు పాల్పడిన 8 మంది నిందితుల్లో ఆరుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి హత్యకు వాడిని కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాలు సమకూర్చిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఏ2 రంజాన్, ఏ4 గంజి స్వామి, ఏ5 నూకల లింగయ్య, ఏ6 బోడపట్ల శ్రీను, ఏ7 నాగేశ్వరరావు ఏ8 నాగయ్యలను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

హత్య ఎలా జరిగిందంటే.. ఖమ్మం జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవం రోజే తెల్దారుపల్లికి చెందిన తెరాస నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య (62) సోమవారం దారుణహత్యకు గురయ్యారు. సోమవారం ఉదయం కృష్ణయ్య పొన్నెకల్లు రైతు వేదిక వద్ద జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం తన అనుచరుడితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా తెల్దారుపల్లి సమీపంలో.. వెనుక నుంచి ఆటోలో వచ్చిన దుండగులు ఆయన వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో కృష్ణయ్య, ఆయన అనుచరుడు ముత్తేశం రహదారి పక్కన కాలువలో పడిపోయారు. దుండగులు ఆటోలో నుంచి దిగి వేటకొడవళ్లతో కృష్ణయ్యపై విచక్షణారహితంగా దాడి చేశారు. రెండు చేతులు నరికేశారు. తలపై కత్తులతో నరకడంతో తీవ్ర రక్తస్రావమై కృష్ణయ్య అక్కడికక్కడే మృతి చెందారు. కృష్ణయ్య టేకులపల్లి ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య మంగతాయి తెల్దారుపల్లి ఎంపీటీసీ సభ్యురాలు. వీరికి కుమారుడు నవీన్‌, కుమార్తె రజిత ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.