ETV Bharat / state

మాజీ మంత్రి తుమ్మల అనుచరుడి అంత్యక్రియలు పూర్తి

author img

By

Published : Aug 16, 2022, 12:28 PM IST

TRS Activist krishnaiah last rites completed in khammam district
మాజీ మంత్రి తుమ్మల అనుచరుడి అంత్యక్రియలు పూర్తి

TRS Activist krishnaiah last rites ఖమ్మం జిల్లాలో తెల్దారుపల్లిలో తమ్మినేని కృష్ణయ్య అంత్యక్రియలు నిర్వహించారు. కృష్ణయ్య అంతిమయాత్రకు శ్రేణులు భారీగా తరలివచ్చారు. సీపీ విష్ణు వారియర్‌ పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

TRS Activist krishnaiah last rites ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో హత్యకు గురైన తెరాస నేత తమ్మనేని కృష్ణయ్య అంత్రక్రియలు నిర్వహించారు. అంతిమయాత్రకు పెద్ద సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు. తెరాస కార్యకర్తలు, కృష్ణయ్య అనుచరులు భారీగా పాల్గొన్నారు. హత్యా ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు భారీగా మోహరించారు. సీపీ విష్ణు వారియర్‌ పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హత్యకు కోటేశ్వరరావుతో పాటు మరో ఏడుగురు కుట్ర చేశారని కృష్ణయ్య కుమారుడు నవీన్‌ ఫిర్యాదు చేశారు.

ఇదీ జరిగింది... ఖమ్మం జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవం రోజే తెల్దారుపల్లికి చెందిన తెరాస నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య (62) సోమవారం దారుణహత్యకు గురయ్యారు. ఈ ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కలకలం రేపింది. సోమవారం ఉదయం కృష్ణయ్య పొన్నెకల్లు రైతు వేదిక వద్ద జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం తన అనుచరుడితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా తెల్దారుపల్లి సమీపంలో.. వెనుక నుంచి ఆటోలో వచ్చిన దుండగులు ఆయన వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో కృష్ణయ్య, ఆయన అనుచరుడు ముత్తేశం రహదారి పక్కన కాలువలో పడిపోయారు. దుండగులు ఆటోలో నుంచి దిగి వేటకొడవళ్లతో కృష్ణయ్యపై విచక్షణారహితంగా దాడి చేశారు. రెండు చేతులు నరికేశారు. తలపై కత్తులతో నరకడంతో తీవ్ర రక్తస్రావమై కృష్ణయ్య అక్కడికక్కడే మృతి చెందారు. కృష్ణయ్య టేకులపల్లి ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య మంగతాయి తెల్దారుపల్లి ఎంపీటీసీ సభ్యురాలు. వీరికి కుమారుడు నవీన్‌, కుమార్తె రజిత ఉన్నారు.

హత్య విషయం తెలిసి.. నిమిషాల వ్యవధిలోనే గ్రామస్థులు, ఆయన అనుచరులు, అభిమానులు పెద్దసంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు సీపీఎం నాయకుడు తమ్మినేని కోటేశ్వరరావు ప్రధాన కారణమని ఆరోపిస్తూ ఆయన ఇంటిపై దాడికి పాల్పడ్డారు. కోటేశ్వరరావుకు చెందిన గ్రానైట్‌ క్వారీలోని పొక్లెయిన్‌ను తగలబెట్టారు. తెల్దారుపల్లి.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్వగ్రామం కాగా.. కోటేశ్వరరావు స్వయనా సోదరుడు. హతుడు కృష్ణయ్య సైతం బాబాయి కుమారుడే కావడం గమనార్హం. కృష్ణయ్య శరీరంపై 15 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూడేళ్ల క్రితం తమ్మినేని కృష్ణయ్య సీపీఎం నుంచి తెరాసలో చేరారు. సీపీఎంకు వ్యతిరేకంగా తన భార్యను స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీటీసీ ఎన్నికల బరిలో నిలిపి విజయం సాధించారు.

ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో కృష్ణయ్య మృతదేహానికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాళి అర్పించారు. హత్య ఘటనపై మంత్రి కేటీఆర్‌తో ఫోన్లో మాట్లాడారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా డీజీపీని ఆదేశించాలని కోరారు. తెల్దారుపల్లిలో కృష్ణయ్య కుటుంబీకులను పరామర్శించారు. ఈ హత్యలో తమ్మినేని వీరభద్రం, ఆయన సోదరుడు కోటేశ్వరరావు పాత్ర ఉందని కృష్ణయ్య భార్య మంగతాయి, కుమార్తె రజిత ఆరోపించారు. తమ్మినేని కోటేశ్వరరావు హత్య చేయించారని కృష్ణయ్య కుమారుడు నవీన్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో ఆరుగురి పేర్లు చేర్చారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.