దేశ రాజకీయాలను మలుపుతిప్పే సభగా ఖమ్మం సభ: హరీశ్​రావు

author img

By

Published : Jan 13, 2023, 4:04 PM IST

Updated : Jan 13, 2023, 4:36 PM IST

Harish Rao

Harish Rao on Khammam Public Meeting: దేశ రాజకీయాలను మలుపు తిప్పే భారాస సభకు ఖమ్మం ఆతిథ్యం ఇస్తోందని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. జాతీయనాయకులు సభకు వస్తున్నందున... విజయవంతానికి పార్టీ శ్రేణులు కృషిచేయాలని సూచించారు. తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతోందని హరీశ్​రావు ఆరోపించారు. 18న ఖమ్మంలో నిర్వహించే సభను విజయవంతం చేద్దామని మాజీ మంత్రి తుమ్మల తెలిపారు.

Harish Rao on Khammam Public Meeting: ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించే భారాస ఆవిర్భావ సభ దేశ రాజకీయాలను మలుపుతిప్పే దశగా నిలువబోతోందని రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు సన్నాహంగా కూసుమంచిలో శుక్రవారం పాలేరు నియోజకవర్గ స్థాయి సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్​రావు పాల్గొని మాట్లాడారు.

ఖమ్మం సభ బీఆర్​ఎస్​కు చాలా ముఖ్యమని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. జాతీయనాయకులు సభకు వస్తున్నందున... విజయవంతానికి పార్టీ శ్రేణులు కృషిచేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా తెలంగాణ నమూనాపై చర్చ జరుగుతున్న తరుణంలో జరుగుతున్న చారిత్రక సభకు ఎనలేని ప్రాధాన్యం ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు.

ఈ క్రమంలో దేశ ప్రజలంతా బీఆర్ఎస్ అవసరాన్ని కోరుతున్నారని మంత్రి హరీశ్​రావు అన్నారు. భారాస ఆవిర్భావ సభ ద్వారా తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. రైతు రుణమాఫీ, 24 గంటల విద్యుతు లాంటి పథకాలను ప్రవేశపెట్టి రైతులను ఆదుకున్న ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలను తీసుకువచ్చి వ్యవసాయాన్ని నిర్వీర్యం చేయాలని చూసిందని మండిపడ్డారు. పాలేరు నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందిందన్నారు. భక్త రామదాసు ప్రాజెక్టుతో సాగర్ జలాల అభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, పలువురు నాయకులు మాట్లాడారు.

'ఖమ్మం సభ భారాసకు చాలా ముఖ్యం. జాతీయస్థాయి నాయకులు సభకు వస్తున్నారు. జాతీయ రాజకీయాలను మలుపు తిప్పే సభ ఖమ్మం సభ. దేశంలో తెలంగాణ నమూనాపై చర్చ జరుగుతోంది. తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతోంది. ఖమ్మం సభకు పాలేరు నుంచి 50 వేల మందికి తగ్గకూడదు. తెలంగాణ, కేసీఆర్ సత్తాను ఖమ్మం సభ దేశానికి చాటాలి.'-హరీశ్​రావు, ఆర్థిక శాఖ మంత్రి

దేశ రాజకీయాలను మలుపుతిప్పే సభగా ఖమ్మం సభ: హరీశ్​రావు

18 న నిర్వహించే ఖమ్మం సభను విజయవంతం చేద్దాం : ఖమ్మం జిల్లా సత్తుపల్లి నిర్వహించిన సభలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. దేశ రాజకీయ పరిస్థితులు నిమిషానికి ఒకలా రూపాంతరం చెందుతూ అరచేతిలో కనిపిస్తున్నాయన్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే లేనటువంటి మిషన్ భగీరథ పథకాన్ని పూర్తి చేసి ఇంటింటికి మంచి నీళ్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. విద్యుత్ పునరుద్ధరణ ద్వారా రైతులు, పరిశ్రమలకు 24గంటలు విద్యుత్ అందిస్తున్నామని తుమ్మల అన్నారు. రాష్ట్రంలో 33 జిల్లాల్లో పామాయిల్ సాగు విస్తరించిన ఘనత సీఎం కేసీఆర్​దని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులందరూ పెద్ద పాల్గొని.. 18 న నిర్వహించే బీఆర్​ఎస్ సభను విజయవంతం చేద్దామని కార్యకర్తలకు తుమ్మల పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి:

Last Updated :Jan 13, 2023, 4:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.