Delay in Grain Purchase in Telangana : కాంటాలు కదలక.. కర్షకుల వెతలు

author img

By

Published : May 21, 2023, 7:15 AM IST

Updated : May 21, 2023, 11:49 AM IST

Farmers Waiting For Purchase of Grain

Delay in Grain Purchase in Telangana : కాలం కరిగిపోతోంది.. రోజులు గడుస్తున్నాయి.. కానీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల మనసు మాత్రం కరగడం లేదు. రైతు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించినా.. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో కాంటాలు కదలక పోవడంతో కర్షకుల వెతలు తీరడం లేదు. ఇష్టానుసారం తరుగు తీస్తామంటూ మిల్లర్లు బెదిరింపులకు గురి చేస్తున్నా.. బాధను పంటి బిగువున భరిస్తూ పంటను అమ్ముకునేందుకు అన్నదాత పడుతున్న వేదన గుండెను పిండేస్తోంది.

కాంటాలు కదలక.. కర్షకుల వెతలు

Delay in Grain Purchase in Telangana : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ధాన్యం రైతుల వెతలు తీరడం లేదు. ఓవైపు భానుడి భగభగలతో అల్లాడుతూ పంటను అమ్ముకునేందుకు కేంద్రాల్లోనే రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు. రైతులకు ఒకటి మీద ఒకటి అన్నట్లు కష్టాలు వెంటాడుతున్నాయి. కేంద్రాల్లో కొనుగోళ్లు సజావుగా సాగక.. వడ్లు అమ్ముకునేందుకు కేంద్రాలకు వచ్చిన రైతులు.. వారాల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. హమాలీలు, లారీల కొరతతో కాంటాలు పూర్తయినా రవాణా సాగడం లేదు. కాంటాలు వేసే సమయంలో మిల్లర్లు పెడుతున్న కొర్రీలతో ధాన్యం రైతు దగా పడుతున్నాడు.

కొనుగోలు కోసం ఎదురుచూస్తున్న రైతులు: తరుగు పేరిట నిలువు దోపిడీ చేస్తున్న మిల్లర్ల తీరుతో అన్నదాతలు నష్టాల పాలవుతున్నారు. మిల్లర్లు భారీగా తరుగు పేరిట దోపిడీకి దిగుతుండటంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో ధాన్యం సేకరణ లక్ష్యం 4 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే.. ఇప్పటి వరకు 90,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు మాత్రమే పూర్తయ్యాయి. భద్రాద్రి జిల్లాలో 1.50 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం ఉంటే.. 18,500 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు.

మొక్కజొన్న రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. మార్క్​ఫెడ్ కేంద్రాల ద్వారా మక్కలు కొనుగోలు చేసేందుకు ఇటీవలే ప్రభుత్వం కేంద్రాలు ప్రారంభించింది. కానీ చాలా వరకు కేంద్రాలు అలంకార ప్రాయంగానే ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 60,000 మెట్రిక్‌ టన్నులు.. భద్రాద్రి జిల్లాలో 19,082 మెట్రిక్‌ టన్నులు సేకరించాలన్న లక్ష్యం పెట్టుకున్నా.. ఇప్పటి వరకు కేవలం దాదాపు 6,000 మెట్రిక్‌ టన్నులు మాత్రమే సేకరించారు. అంటే.. కనీసం 10 శాతం కొనుగోళ్లు జరగకపోవడం మార్క్​ఫెడ్ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

మొక్కజొన్న కేంద్రాల వద్ద రైతులకు తప్పని పడిగాపులు..: అసలే కేంద్రాల్లో కాంటాలు సాగక రైతులు పడిగాపులు పడుతుంటే.. ఇంకా అనేక సమస్యలు రైతుల్ని వెంటాడుతున్నాయి. గన్నీ సంచుల కొరత ఉంది. సకాలంలో లారీలు రాకపోవడంతో కాంటాలు పూర్తయినప్పటికీ నిరీక్షణ తప్పడం లేదు. కొన్ని కేంద్రాల్లో తేమ శాతం రాలేదన్న సాకుతో కొనుగోలు చేసే అధికారులు, సిబ్బంది రావడమే లేదు. ఫలితంగా వారాల తరబడి రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇదంతా ఒకెత్తైతే.. అల్లీపురం ప్రభుత్వం కొనుగోలు కేంద్రంలోనే దర్జాగా ప్రైవేటు వ్యాపారులు మక్కలు కొనుగోలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యారు.

కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది లేకుండా షామియానా, తాగునీరు అందుబాటులో ఉంచాలన్న ఆదేశాలు ఎక్కడా పాటించకపోవడంతో.. రైతులు ఎండ వేడిమికి అల్లాడిపోతున్నారు. ఇప్పటికైనా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని.. ధాన్యం, మక్కల కొనుగోళ్లు ఊపందుకునేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :May 21, 2023, 11:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.