హుజూరాబాద్ ఉప ఎన్నిక(by-election)లో ఓటమి భయంతోనే తెరాస దొంగ ఓట్ల దందాను చేపడుతోందని మాజీ మంత్రి ఈటల రాజేందర్(etala rajender) ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్డీవో కార్యాలయం కేంద్రంగా ఈ వ్యవహరం కొనసాగుతోందన్నారు.
మున్సిపల్ ఛైర్పర్సన్ ఇంట్లోనే ఒకే ఇంటి నంబర్పై 34 ఓట్లు ఉన్నాయంటూ ఓటర్ల జాబితాను చూపారు. ఇది నీచ రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులన్నారు. ఎలాంటి ప్రలోభాలకు గురికారని ధీమా వ్యక్తం చేశారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. రెండు, మూడు రోజుల్లో కమలాపూర్ మండలం బత్తినివానిపల్లె నుంచి పాదయాత్ర(padayatra)కు శ్రీకారం చుట్టనున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో(by election) విజయమే లక్ష్యంగా ప్రచారం సాగిస్తున్న ఈటల... ప్రజలకు మరింత చేరువకావాలనే లక్ష్యంతో పాదయాత్రకు పూనుకున్నారు.