ఇంకొన్ని రోజుల్లో బడులు తెరిచేస్తారు. ఇంతకాలం ఆట, పాట, చదువులతో ఇంటి వద్ద గడిపిన చిన్నారులు సరదాగా క్రికెట్ ఆడుకుందామనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆట మొదలెట్టారు. ఒక్కక్కరుగా వచ్చి చేరుతున్నారు. ఇంతలో అటువైపుగా కాన్వాయ్ వెళ్తుంది. అదేమీ పట్టనట్టు పిల్లలు తమ ఆటలో నిమగ్నమై ఉన్నారు. ఇంతలో కాన్వాయ్ ఆగింది. ఒక్కసారిగా అటువైపు చూసిన పిల్లలు అందులోంచి దిగుతున్న వ్యక్తిని చూసి కాస్త కంగారు పడ్డారు. అతను నేరుగా పిల్లల వద్దకు వచ్చి.. నేనూ మీతో ఆడొచ్చా అన్న వెంటనే అవాక్కయ్యారు. అంత పెద్దమనిషి తమతో ఆడుతుంటే పిల్లలే కాదు.. పెద్దలు కూడా సంబ్రమాశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగింది.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని తన స్వగ్రామానికి వెళ్తున్న సభాపతి పోచారం... దేశాయిపేట్ వద్ద పిల్లలు క్రికెట్ ఆడుతుండడం చూసి ఆగారు. కారు దిగి.. వారితో కలిసి కాసేపు సరదాగా క్రికెట్ ఆడారు. పిల్లలు బౌలింగ్ చేయగా.. సభాపతి బ్యాటింగ్తో అదరగొట్టారు. చిన్నారులతో క్రికెట్ ఆడుతూ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు పోచారం. ఊహించని ఈ సంఘటనతో చిన్నారుతో పాటు పెద్దలు సంబ్రమాశ్చర్యానికి గురయ్యారు.
ఇదీ చూడండి: BULLET BANDI SONG: బుల్లెట్టు బండి పాటతో తల్లి మరణాన్ని మరిచిన కొండెంగ