కామారెడ్డి జిల్లాలోని బీబీపేట్ మండలం ఉప్పరపల్లి గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు గ్రామానికి చెందిన 100మంది రైతులు ట్రాన్స్ఫార్మర్ కోసం ఆందోళనకు దిగారు. గ్రామంలో పవర్ ట్రాన్స్ఫార్మర్ కంట్రోలర్ ఏర్పాటు చేయాలని లైన్మెన్కి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని నెలల క్రితం గ్రామంలోని పవర్ ట్రాన్స్ఫార్మర్ చెడిపోయినా.. లైన్మెన్, విద్యుత్ అధికారులు స్పందించడం లేదని రైతులు వాపోయారు.
ట్రాన్స్ఫార్మర్ చెడిపోవడం వల్ల పంటలకు నీరు పెట్టడం ఇబ్బందిగా మారిందని రైతులు అడిగితేే.. బీబీపేట్ నుంచి వచ్చే విద్యుత్ లైన్ని ఉప్పరపల్లి గ్రామానికి కలిపారు. కాగా.. గ్రామంలో మొత్తం 11 ట్రాన్స్ఫార్మర్లు ఉండగా.. వాటికి 200 బోరుబావులు నడుస్తున్నాయి. ట్రాన్స్ఫార్మర్ల మీద లోడ్ ఎక్కువ కావడం వల్ల, విద్యుత్ సరిపోక.. నిత్యం మోటార్లు కాలిపోతున్నాయని రైతులు మొర పెట్టుకుంటున్నారు. గ్రామానికి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేంత వరకు అక్కడి నుంచి కదలమని రైతులు భీష్మించుకొని కూర్చున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పగా.. ఆందోళన విరమించారు. అనంతరం రైతులు ఏఈకి వినతి పత్రం సమర్పించారు.
ఇవీ చూడండి: మంత్రి హరీశ్రావుకు కరోనా పాజిటివ్