ETV Bharat / state

శ్రీధర్‌ను సీఎండీగా కొనసాగించడం వెనుక ఆంతర్యమేంటి: రేవంత్​రెడ్డి

author img

By

Published : Feb 28, 2023, 11:44 AM IST

రేవంత్​రెడ్డి
రేవంత్​రెడ్డి

Reavanthreddy gate meeting with singareni labours: రూ.వేలాది కోట్లు కొల్లగొట్టేందుకే తప్ప కార్మికుల సమస్యలు తీర్చడానికి సీఎం కేసీఆర్ కుటుంబం ప్రయత్నించడం లేదని టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా ఆయన భూపాలపల్లి సింగరేణి 5వ గనిలో సింగరేణి కార్మికులతో గేట్ మీటింగ్‌లో పాల్గొన్నారు.

Reavanthreddy gate meeting with singareni labours: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి కార్మికుల పొట్ట కొడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వస్తే ఆర్టీసీ, విద్యుత్, సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆనాటి తెలంగాణ ఉద్యమంలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ శాఖ కార్మికుల పాత్ర ఎంతో కీలకమైందని... సకల జనుల సమ్మెకు సైరన్ ఊది కార్మికులు నడుం బిగించాకే.. తెలంగాణ రాష్ట్రం వచ్చిందని గుర్తు చేశారు.

బొగ్గుగని కార్మిక సంఘానికి కవిత, ఆర్టీసి కార్మిక సంఘానికి హరీశ్ గౌరవ అధ్యక్షులుగా ఉన్నారని... కార్మిక సంఘాలను కూడా వారి కుటుంబమే గుత్తాధిపత్యం చేసి అధికారంలో కొనసాగుతున్నారని విమర్శించారు. సీఎం కుమార్తె కవిత గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నా... బొగ్గు గని కార్మికుల సమస్యలు పరిష్కరించడం లేదని మండిపడ్డారు. వేలాది కోట్లు కొల్లగట్టడానికే తప్ప కార్మికుల సమస్యలు తీర్చడానికి కేసీఆర్ కుటుంబం ప్రయత్నించడం లేదంటూ ధ్వజమెత్తారు. ఈ తొమ్మిదేళ్లలో బీజేపీ, బీఆర్​ఎస్​ అవిభక్త కవలల్లా కలిసి ఉన్నాయని... కానీ ఇప్పుడు వేరుగా ఉన్నట్లు చూపే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

అప్పుడెమో మోదీ నిర్ణయాలన్నింటికీ కేసీఆర్ సహకరించారని... నేడు ప్రజా వ్యతిరేకత చూసి భయంతో వేరుగా ఉన్నామని చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాడిచర్ల మైన్​ను కేసీఆర్ ఎవరికి అప్పగించారు? తాడిచర్ల మైన్స్​​లో కేసీఆర్ కుటుంబం వాటా ఎంత? ప్రతిమా శ్రీనివాస్​కు లాభం చేకూర్చేందుకు కేసీఆర్ ఈ ఒప్పందానికి సహకరించింది వాస్తవం కాదా? అని రేవంత్​రెడ్డి ప్రశ్నించారు.

revanth reddy padayatra in bhupalapally: ఒడిశాలో ఉన్న కోల్​మైన్​ను అదానికి అమ్మేస్తే... దానిపై కాంగ్రెస్ ఎంపీలం కొట్లాడమని అందుకే నైని కోల్ మైన్ అమ్మకం ఆగిపోయిందని పేర్కొన్నారు. కేసీఆర్, మోదీలది కార్పొరేట్ ఫ్రెండ్లీ విధానమని... శ్రీధర్​ను సీఎండీగా కొనసాగించడం వెనక కేసీఆర్​కు ఉన్న ఉపయోగం ఏమిటో ఆలోచించాలని సూచించారు. లాభాల్లో ఉన్న సింగరేణిని దివాళా తీయించేందుకు సీఎండీ శ్రీధర్ ప్రయత్నిస్తున్నారని... వీటన్నింటిపై కాంగ్రెస్ ప్రభుత్వంలో విచారణకు అదేశిస్తామని తెలిపారు.

సింగరేణిని లాభాల బాటలో పయనించేలా కాంగ్రెస్ నిర్ణయాలు తీసుకుంటామని.. ఎవరు అధికారంలో ఉంటే కార్మికుల కష్టాలు తీరుతాయో ఆలోచించాలని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారం మీ చేతుల్లోనే ఉందని తెలిపారు. తెలంగాణ తెచ్చిన అని చెప్పిన కేసీఆర్​కు రెండు సార్లు అవకాశం ఇచ్చారు... తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్​కు ఒక్క అవకాశం ఇవ్వండని అభ్యర్థించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన చారిత్రక అవసరం ఉందని... తెలంగాణ సాధించడమే కాదు.. దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా కార్మికులపై ఉందని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.