ETV Bharat / state

మేడారం జాతరలో ఉచిత వైఫై..

author img

By

Published : Feb 3, 2020, 10:18 AM IST

తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతరలో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈసారి 20 పాయింట్లలో 80 రూటర్లతో వైఫై సేవలు అందుబాటులోకి తీసుకురానుంది బీఎస్​ఎన్ఎల్. ఒక్కో మొబైల్​కి రోజుకు 1 జీబీ డేటా ఉచితంగా వినియోగించుకోవచ్చు. బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ వినియోగదారులు మాత్రం 2 జీబీ డేటాను వాడుకోవచ్చు.

Free WiFi services at Medaram Jatara mulugu district
మేడారం జాతరలో ఉచిత వైఫై సేవలు

మేడారం జాతర పరిసర ప్రాంతాల్లో వైఫై హాట్‌స్పాట్‌ ఈసారి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో 10 ప్రధాన కూడళ్లలో 20 వైఫై రూటర్లు మాత్రమే పెట్టి భక్తులకు ఇంటర్నెట్ అందించారు. ఈసారి 20 ప్రధాన కూడళ్లలో 80 రూటర్లతో వైఫై సేవలు అందించనున్నారు. ఒక్కో రూటర్‌ నుంచి దాదాపు 300 మీటర్ల వరకు సిగ్నల్స్‌ అందుతాయి. 10 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ సేవలను సమకూర్చేందుకు అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనుంది బీఎస్​ఎన్​ఎల్.

రోజుకు 1 జీబీ డేటా ఉచితం

ఒక్క మొబైల్ లాగిన్​తో రోజుకు 1 జీబీ డేటా ఉచితంగా వినియోగించుకోవచ్చు. బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ వినియోగదారులు మాత్రం రోజుకు 2 జీబీ డేటాను వాడుకోవచ్చు. ఈ సేవల ద్వారా జాతరకు సంబంధించిన ప్రతి సమాచారం క్షణాల్లో ప్రపంచానికి తెలిసిపోతుంది. రద్దీ విషయంలో కూడా ఎప్పటికప్పుడు వేగంగా సమాచారం అందుతుంది. ట్రాఫిక్‌ నియంత్రించి రద్దీ లేకుండా చూసుకునే వీలుంటుంది. జాతర పరిసరాల్లో టవర్ల నిర్మాణం, వైఫై రూటర్ల ఏర్పాట్ల కోసం 40మంది బీఎస్‌ఎన్‌ఎల్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. క్వార్డ్‌జెన్‌ సంస్థ కూడా ఈ ఏర్పాట్లలో పాలు పంచుకుటుంది.

మెరుగైన సేవల కోసం

భక్తుల సౌకర్యార్థం జాతరలో తాత్కాలికంగా 16 టవర్లు ఏర్పాటు చేశారు. గతంలో నెట్‌వర్క్‌ సిగ్నల్స్‌ లేకపోవడం వల్ల సమాచార లోపంతో భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు. దీనికి తోడు.. ఈసారి జాతరలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ఊహించిన అధికారులు భక్తులు తప్పిపోకుండా.. ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులతో సమాచారం చేరవేసేందుకు వీలుగా.. తాత్కాలిక సిగ్నల్ టవర్లను, వైఫై కేంద్రాలను అందుబాటులో ఉంచనున్నారు. భక్తులకు 24 గంటలపాటు 2జీ, 3జీ, 4జీ సేవలు ఉంటాయి.

సెల్ఫీలతో భక్తుల సందడి

అమ్మవార్ల మహాజాతర అంగరంగ వైభవంగా జరగనుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. మేడారం మహానగరంగా మారింది. లక్షలాది మంది అమ్మవార్లను దర్శించుకోవడానికి తరలి వస్తున్నారు. జాతరలో వివిధ ప్రాంతాల్లో సెల్ఫీలు దిగడం.. వీడియోలు తీయడం.. వాటిని ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం అందరికీ అలవాటు. ఇందుకోసం మేడారంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు ఉచిత వైఫై సేవలు అందించడానికి ఏర్పాట్లు చేశారు.

ఉచిత వైఫై కేంద్రాలివే

చిలకలగుట్ట-2, ఆర్టీసీ బస్టాండ్‌-2, ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌-1, ఆర్టీసీ బస్టాండ్‌-1, గద్దెల వద్ద, టూరిజం కాటేజీలు, ఐటీడీఏ అతిథి గృహం, తితిదే కల్యాణ మండపం, హరిత హోటల్‌, ములుగు గట్టమ్మ గుడి, నార్లాపూర్‌ కూడలి, కొత్తూరు, ఊరట్టం, ఎన్పీడీసీఎల్‌ విద్యుత్తు ఉపకేంద్రం, జంపన్నవాగు-1, జంపన్నవాగు-2, జంపన్నవాగు రెడ్డిగూడెం మార్గం, జంపన్నవాగు పాత వంతెన , పోలీస్‌ క్యాంపు కార్యాలయం, చిలకలగుట్ట-1 ప్రాంతాలలో వైఫై రూటర్లు ఏర్పాటు చేయనున్నారు.

ఇదీ చూడండి : మహాజాతరకు ముందే జనజాతర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.